పనిని ఆరాధిస్తూ, పనిని ప్రేమించే గొప్ప సాంస్కృతిక జీవన సమాజం తెలంగాణది. అందుకే ఇక్కడ నాటి నుంచి నేటి వరకూ పనిమంతులకు పట్టాభిషేకం చేస్తూనే ఉన్నాం. ప్రపంచమే అబ్బురపడే శిల్పకళా వైభవంతో, సాంకేతిక నైపుణ్యంతో అలరారుతున్న రామప్ప దేవాలయమే అందుకు సజీవ సాక్ష్యం. క్రీ.శ.1213లో కాకతీయ చక్రవర్తి గణపతి దేవుడి సైన్యాధ్యక్షుడు రేచర్ల రుద్రుడి సారథ్యంలో నిర్మించిన గొప్ప శిల్పకళా వైభవం రామప్ప.
గణపతి దేవుడు ప్రోత్సహించి, రేచర్ల రుద్రుడు పర్యవేక్షించినా గుడికి మాత్రం ఆలయ ప్రధాన శిల్పి రామప్ప పేరును పెట్టడం పనిమంతులకు తెలంగాణ గడ్డ అందిం చే సమున్నత గౌరవానికి నిదర్శనం. ఈ సాంస్కృతిక జీవన వైభవమే రామప్పను ప్రపంచ వారసత్వ కట్టడంగా గుర్తించేందుకు కావాల్సిన పది ముఖ్యమైన అర్హతల్లో అత్యంత ప్రధానమైనది. ఎర్ర ఇసుకరాయితో నిర్మించినందున రామప్ప ఆలయం కాంతివంతంగా కనిపిస్తుం ది. రామప్ప 40 ఏండ్ల పాటు శ్రమించి నిర్మించిన కళావైభవమే నేడు యునెస్కో గుర్తింపును సాధించి పెట్టే చోదకమై మెరుస్తున్నది.
ఆలయంలో ప్రతీ స్తంభాన్ని తాకగానే వేణువులోంచి వస్తున్నట్టుగా సరిగమలు పలుకుతాయి. అత్యంత తేలికైన, నీటిపై తేలియాడే ఇటుకలు ఎలా తయారు చేశారు! పునాదుల్లో మూడు మీటర్ల మేర ఇసుకను నింపే సాండ్ బాక్స్ టెక్నాలజీని పాటించారు. తేలికైన డోలమైట్ లాంటి ఖనిజాలపై శిల్పాలు చెక్కడం, ఆ రోజుల్లోనే 12 నుంచి 24 అంగుళాల బీమ్లను పిల్లర్లపై వాడటం, 800 ఏండ్ల కు పైగా ప్రకృతి వైపరీత్యాలకు చెక్కుచెదరకుండా ఆల యం నిలిచి ఉండటం వంటి రామప్ప సాంకేతికత యునె స్కో అర్హతలకు అనుగుణంగా ఉన్నది. రాజసంతో కూడిన నంది, మహా మంటపం పై భాగంలోని నాలుగు దూలాలపై ఉన్న రామాయణ, పురాణ ఇతిహాసాలతో కూడిన శిల్పాలతోపాటు గుడి అంతటా అద్భుతమైన శిల్పాలు ఉన్నా యి. జగత్విఖ్యాత నాట్య రూపమైన ‘పేరిణి శివతాండవాన్ని’ నటరాజ రామకృష్ణ ఈ శిల్పాల నుంచే గ్రహించి రూపొందించారనేది జగమెరిగిన సత్యం.
ఓరుగల్లుకు 65 కిలోమీటర్ల దూరంలో జీవ, పర్యావరణ వైవిధ్యం కలిగిన ప్రాంతమిది. ప్రధానంగా రుద్ర దేవాలయం శైవ, వైష్ణవ సంస్కృతుల సమ్మిశ్రమంగా ఉంది. శిలాఫలకాలతో సహా ఆధార సహిత ఆనవాళ్లు సైతం యునెస్కో నిర్దేశించిన అంశాలకు అనుగుణంగా ఉన్నాయి. ఈనెల 16 నుంచి 31 వరకూ చైనాలో నిర్వహించే యునెస్కో సమావేశాల్లో రామప్పకు ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపునివ్వటంపై చర్చ జరుగనుండటం ముదావహం.
800 ఏండ్ల క్రితమే వైభవోపేతంగా విలసిల్లింది రామప్ప. అయితే వలస పాలకుల హయాంలో తీవ్ర నిర్లక్ష్యానికి గురైంది. దీంతో ప్రధాన మండపం సహా అనేక ఉప ఆలయాల ప్రాంగణాలు శిథిలావస్థకు చేరుకున్నా యి. రాష్ట్ర అవతరణ తర్వాత మన ప్రభుత్వం తీసుకున్న అనేక చర్యలు నేడు సాంస్కృతిక వేదికగా రామప్ప నిలబడడానికి కారణమైంది. ఈ క్రమంలోనే యునెస్కో ప్రతినిధుల బృందం 2019లో రామప్పను సందర్శించింది. రాష్ట్రప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధతో కేంద్రానికి సచిత్ర ఆధారాలను అందించింది. చైనా వేదికగా 44వ వరల్డ్ హెరిటేజ్ కమిటీ చూసే 255 ప్రతిపాదనల్లో రామప్పకు మద్దతుగా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే 25కు పైగా సభ్యదేశాల మద్దతును కూడగట్టటంలో విజయం సాధించింది. వారసత్వ సంపదలో రామప్పకు చోటు దక్కితే ములుగు జిల్లా అంతర్జాతీయ యవనికలో నిలవనున్నది.
(వ్యాసకర్త: టీఆర్ఎస్ సోషల్ మీడియా రాష్ట్ర కన్వీనర్)
–వై.సతీశ్రెడ్డి