కేంద్రం, జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బేఖాతరు చేసింది. రాయలసీమ ఎత్తిపోతల పథకం, పోతిరెడ్డిపాడు కాలువ విస్తరణ నిర్మాణపనులు సాగిస్తున్నది. నిజానికి ఈ అక్రమ ప్రాజెక్టులపై చర్చ జరగాలి. కానీ ఆంధ్ర నాయకులు, మీడియా ప్రస్తుత చర్చను తెలంగాణ రాష్ట్రం కృష్ణా ప్రాజెక్టుల ద్వారా చేస్తున్న విద్యుత్ ఉత్పత్తి మీదకి మళ్లించారు. ఏపీ ప్రభుత్వం కృష్ణా నదీజలాలనే మలుపుకొనిపోయినట్టుగా, చర్చను కూడా దారి మళ్లించే ప్రయత్నం చేస్తున్నారు. వీరు ప్రధానంగా లేవనెత్తుతున్న అంశాలను పరిశీలిద్దాం.
శ్రీశైలంలో నాగార్జునసాగర్ సాగునీటి అవసరాలకు అనుగుణంగానే విద్యుత్ ఉత్పత్తి చేయాలి. నాగార్జునసాగర్, పులిచింతలలో కృష్ణా డెల్టా సాగునీటి అవసరాలు ఉన్నప్పుడే విద్యుత్ ఉత్పత్తి చేయాలి. కానీ అవేవీ లేకుండా తెలంగాణ ప్రభుత్వం విద్యుత్ ఉత్పత్తి చేస్తూ నీటిని సముద్రం పాల్జేస్తున్నదనే వాదనలు ముందుకు తెస్తున్నారు. ఇది తప్పుడు వాదన.
శ్రీశైలం ప్రధానంగా విద్యుత్ ఉత్పత్తి కోసమే నిర్మించిన ప్రాజెక్టు. 1959లో రూపొందిన డీపీఆర్, 1963లో ప్లానింగ్ కమిషన్ ఆమోదించినప్పుడు, 1976లో బచావత్ ట్రిబ్యునల్ అవార్డు ఇచ్చినప్పుడు ఈ మూడు సందర్భాల్లో శ్రీశైలం ప్రాజెక్టును జల విద్యుత్ ప్రాజెక్టుగానే పరిగణించారు. బచావత్ ట్రిబ్యునల్ శ్రీశైలం నుంచి 33 టీఎంసీల ఆవిరి నష్టం తప్ప ఒక్క చుక్క నీటిని కూడా ఇతర అవసరాలకు కేటాయించలేదు. అందుకే విద్యుత్ కేంద్రాలకు నీటి సరఫరా చేసే పెన్స్టాక్స్ 805 అడుగుల లోతులో పెట్టారు.
1977లో మద్రాస్కు 15 టీఎంసీల తాగునీటి సరఫరా పేరుతో 1500 క్యూసెక్కుల సామర్థ్యంతో శ్రీశైలం ప్రాజెక్టుకు ఒక పొక్క గొట్టడానికి ప్రతిపాదన తెచ్చారు. అదీ సరిపోదని 1981లో ప్లానింగ్ కమిషన్ నుంచి 19 టీఎంసీల శ్రీశైలం కుడిగట్టు కాలువ ప్రాజెక్టుకు అక్రమంగా మంజూరీ తెచ్చుకొని మొత్తం 34 టీఎంసీల నీటిని తరలించడానికి 4 గేట్లతో 11,500 క్యూసెక్కుల పొక్క గొట్టారు. వరదజలాల వినియోగం పేరుతో హం ద్రీనీవా, గాలేరునగరి, వెలిగొండ.. తదితర ప్రాజెక్టులు, వాటికింద 350 టీఎంసీల జలాశయాలను నిర్మించారు. ఈ జలాశయాలను నింపడానికి వైఎస్సార్ కాలంలో అదనపు 10 గేట్లతో 44 వేల క్యూసెక్కులకు పోతిరెడ్డిపాడు పొక్కను వెడల్పు చేశారు. 16 కి.మీ. శ్రీశైలం కుడి ప్రధాన కాలువను బనకచర్ల రెగ్యులేటర్ కాంప్లెక్స్ వరకు అందుకనుగుణంగా వెడల్పు చేశారు. ఇప్పుడు వైఎస్సార్ తనయుడు ఆ సామర్థ్యాన్ని 88 వేలకు పెంచుతూ జీవోలు జారీచేసి పనులు కూడా మొదలు పెట్టాడు. అందులోకి శ్రీశైలం జలాశయం అట్టడుగునుంచి రోజుకు 3 టీఎంసీల నీటిని తోడనీకి రాయలసీమ ఎత్తిపోతలకు శ్రీకారం చుట్టారు. శ్రీశైలం నుంచి తెలంగాణకు కూడా 4 వేల క్యూసెక్కుల ఎస్ఎల్బీసీ సొరంగం, 3200 క్యూసెక్కుల కల్వకుర్తి లిఫ్ట్ను పెట్టి.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కుట్రపూరితంగా, మోసపూరితంగా శ్రీశైలం విద్యుత్ ప్రాజెక్టును వారి మాటల్లోనే మల్టీపర్పస్ ప్రాజెక్టుగా మార్చివేశారు. ఇప్పుడు తెలంగాణ విద్యుత్ ఉత్పత్తి చేస్తుంటే లొల్లి లొల్లి చేస్తున్నరు.
ఇలాంటి అక్రమ, మోసపూరిత ప్రాజెక్టులకు నీటిని సరఫరా చేయడానికి తెలంగాణ ప్రభుత్వం విద్యుత్ ఉత్పత్తి ఆపాలట. తెలంగాణ రైతాంగానికి సాగునీరు అందాలంటే ఎత్తిపోతలు తప్ప మరోమార్గం లేదు. వానకాలం పంటలు ప్రారంభమైనయి. రాష్ట్రంలో డ్రై స్పెల్ కొనసాగుతున్నది. కాబట్టి గోదావరి బేసిన్లో కాళేశ్వరం అన్ని లింకుల్లో పంపులు నడుస్తున్నయి. కృష్ణా బేసిన్లో నెట్టెంపాడు, భీమా, కోయిల్సాగర్, కల్వకుర్తి పంపులు నడుస్తున్నాయి. రాష్ట్రంలో మొత్తం 30 లక్షల వ్యవసా య పంపు సెట్లున్నాయి. త్వరలోనే ఎస్ఎల్బీసీ, దేవాదుల, అలీసాగర్, గుత్పా, ఎల్లంపల్లి పంపులు ప్రారంభమవుతాయి. రాష్ర్టానికి కృష్ణా బేసిన్లోనే జల విద్యుత్కేంద్రాల సామర్థ్యం ఎక్కువ. పవర్గ్రిడ్ మీద ఒత్తిడి పెరిగింది. ఈ స్థితి ఉన్నప్పుడు జలవిద్యుత్ ఉత్పత్తి చేసుకోవచ్చని కృష్ణా బోర్డు తాజాగా 2021, జూన్ 17న తెలంగాణ జెన్కో డైరెక్టర్ (హైడల్)కు రాసిన లేఖలో స్పష్టం చేశారు. జలవిద్యుత్ ఉత్పత్తి చేసేది వానకాలంలోనే. కేంద్రం కూడా రాష్ర్టాలు క్లీన్ గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తికి అధిక ప్రాధాన్యమివ్వాలని మార్గదర్శకాలు జారీ చేసింది. అం దుకే రాష్ట్ర మంత్రివర్గం జలవిద్యుత్ ఉత్పత్తి అన్ని కేంద్రా ల్లో పూర్తిసామర్థ్యంతో చేపట్టాలంటూ తెలంగాణ జెన్కో అధికారులకు ఆదేశాలు జారీచేసింది. జలవిద్యుత్ ఉత్ప త్తి ఆపే ప్రశ్నే లేదని స్పష్టంచేసింది. శ్రీశైలంలో విద్యుత్ ఉత్పత్తి తర్వాత నీరు చేరేది నాగార్జునసాగర్కు. అక్కడ తెలంగాణకు, ఆంధ్రాకూ నీటి అవసరాలున్నాయి.
శ్రీశైలం నుంచి నాగార్జునసాగర్కు 180 టీఎంసీల నీటిని విద్యుత్ ఉత్పత్తి ద్వారా పంపాలని ప్లానింగ్ కమిషన్ నిర్దేశించింది. ఆ నిర్దేశాలను తెలంగాణ ప్రభుత్వం అమలు పరుస్తున్నది. ఏపీ ప్రభుత్వానికేమో సాగర్ కుడికాలువ, కృష్ణా డెల్టా ఆయకట్టు అవసరాల కంటే నీటి కేటాయింపుల్లేని రాయలసీమ జలాశయాలు నింపడమే ప్రాధాన్యంగా ఉన్నది. అందుకే శ్రీశైలంలో నీటిమట్టం పెరగడానికి విద్యుత్ ఉత్పత్తి ఆపమని కోరుతున్నది.
పోతిరెడ్డిపాడు కింద ఉన్నవి వరద ఆధారిత ప్రాజెక్టులు. కృష్ణాలో వరద ఉన్నప్పుడు మాత్రమే నీటిని తీసుకోవాలి. అట్లానే తీసుకుంటామని పోతిరెడ్డిపాడు పొక్క వెడల్పు చేస్తున్నప్పుడు 2005లో ముఖ్యమంత్రి హోదాలో వైఎస్సార్ అసెంబ్లీలో, బయట అనేకసార్లు ప్రకటించాడు. అసలు కృష్ణాలో వరద ఎప్పుడుంది? 215 టీఎంసీల శ్రీశైలం నిండి, 312 టీఎంసీల నాగార్జునసాగర్ నిండి, 45 టీఎంసీల పులిచింతల నిండి నీరు నదిలోకి ప్రవహిస్తున్నప్పుడు మాత్రమే పోతిరెడ్డిపాడు గేట్లు తీసి నీటిని తరలించాలి. ఇప్పుడు కృష్ణాలో వరద పరిస్థితి లేదు. కృష్ణా నదిలోకి వచ్చే తొలి ప్రవాహాలతో తెలంగాణ ప్రభుత్వం గ్రిడ్ ఒత్తిడి కారణంగా, రాష్ట్రంలో నెలకొన్న డ్రై స్పెల్ కారణంగా అనివార్యంగా విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నది. సాగర్ నుంచి పులిచింతలకు వస్తున్న నీరు 30 వేల క్యూసెక్కులు. పులిచింతల నుంచి కిందకు పోతున్న నీరు 5 వేల క్యూసెక్కులే. పులిచింతల డ్యాం నీటి నిల్వ కూడా పెరుగుతున్నది. ఇక్కడ నిల్వయ్యే నీరు మొత్తంగా డెల్టా ఆయకట్టుకు ఉపయోగపడేదే. ప్రకాశం బ్యారేజీ వద్ద కృష్ణా డెల్టా కాలువల్లోకి 20 వేల క్యూసెక్కులు మళ్లించే సామర్థ్యం ఉన్నది. 5 వేల క్యూసెక్కుల నీటిని డెల్టా వ్యవసాయ అవసరాలకు సునాయాసంగా మళ్లించే అవకాశం ఉన్నా తెలంగాణను బద్నాం చేయడానికి గేట్లు తీసి సముద్రంలోకి వదులుతున్నది ఏపీ ప్రభుత్వం. ఇది కుట్ర కాక మరేమిటి? ఈ కుట్రను సభ్యసమాజం గమనించాలి.
ఇక రెండో అంశం… 2015లో తెలంగాణ, ఆంధ్ర రాష్ర్టాలు 299: 512 టీఎంసీల నిష్పత్తిలో నీటిని పంచుకోవడానికి ఒప్పుకొన్నాయి. ప్రభుత్వం తెలంగాణ ప్రయోజనాలను తాకట్టు పెట్టిందని ప్రతిపక్షాలన్నాయి. 512 టీఎంసీలపై తమకు హక్కున్నట్టు, వాటిని వాడుకోవడానికి ప్రాజెక్టులు కట్టుకుంటే అభ్యంతరం దేనికని ఆంధ్రా నాయకుల వాదన. ఈ ఇద్దరికీ వాస్తవాలు తెలియవు.
2015 జూన్ 18, 19 తారీఖుల్లో ఢిల్లీలో కేంద్ర కార్యదర్శి సమక్షంలో ఇరు రాష్ర్టాల కార్యదర్శుల మధ్య ఏడాది కోసం మాత్రమే తాత్కాలిక అంగీకారం కుదిరింది. ఏ ప్రాజెక్టుల ద్వారా ఎన్ని టీఎంసీల నీటిని తీసుకోవాలో ఒక పట్టిక తయారుచేసి ఈ అంగీకారపత్రానికి జతచేయడం జరిగింది. శ్రీశైలం నుంచి చెన్నై తాగునీటికి, ఎస్ఆర్బీసీకి మాత్రమే నీటిని వాడుకోవాలని ఈ అంగీకారపత్రం స్పష్టం చేసింది. ఇందులో వరదజలాల ప్రాజెక్టుల ఊసే లేదు. శ్రీశైలంలో 834 అడుగుల మట్టం చేరిన తర్వాతనే విద్యుత్ ఉత్పత్తి చేయాలని, పోతిరెడ్డిపాడు నుంచి నీటిని తీసుకుపోవడానికి 854 అడుగుల మట్టం దాకా నీటి నిల్వ పెంచాలని ఎక్కడా రాసిలేదు. కాబట్టి ఆ అంగీకారపత్రం ప్రకారం పోతిరెడ్డిపాడు నుంచి వరదజలాల మీద నిర్మించిన ప్రాజెక్టులకు నీటిని తరలించడానికి మట్టాన్ని పెంచే అగత్యం తెలంగాణకు లేదు.
పత్రం చివరి పేరాలో The entire arrange ments agreed for the current year would be without any prejudice to the stand of both the states before any forum అని రాసుకున్నాం. కాబట్టి తెలంగాణ ప్రభుత్వం బ్రిజేష్కుమార్ ట్రిబ్యునల్ ముందు తమకు న్యాయబద్ధంగా పరీవాహక ప్రాంతం (68.5 %), సాగుయోగ్యమైన భూమి (70.40%), జనాభా (72%), కరువు పీడిత ప్రాంతాలు (72.5%) తదితర అన్ని బేసిన్ పేరామీటర్ల ఆధారంగా 574.64 టీఎంసీల నీటిని కేటాయించమని వాదిస్తున్నది. ఇందులో కల్వకుర్తి, నెట్టెంపాడు, ఎస్ఎల్బీసీ, పాలమూరు రంగారెడ్డి, డిండి ప్రాజెక్టులకు నికరజలాల కేటాయింపులు చేయమని అభ్యర్థించింది. 01.07.2018న కేంద్ర జలవనరుల కార్యదర్శికి తెలంగాణ చీఫ్ సెక్రెటరీ రాసిన లేఖలో కృష్ణా ట్రిబ్యునల్ రెండు రాష్ర్టాల మధ్య నీటి కేటాయింపులు జరిపేదాకా కృష్ణా నదిలోకి వచ్చే ప్రవాహాలను 50: 50 నిష్పత్తిలో వినియోగించుకోవడానికి అనుమతించాలని విజ్ఞప్తి చేశారు. ఇదే విషయాన్ని కృష్ణా బోర్డు ముందు కూడా నిరంతరం డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఈ అంశంలో కేంద్రం ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. బోర్డు ఆంధ్రా ప్రభుత్వ ఒత్తిడికి తలొగ్గి తెలంగాణ డిమాండ్ను పట్టించుకోవడం లేదు. అందుకే జూన్ 19న జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ సంవత్సరం నుంచి రెండు రాష్ర్టాల మధ్య 50: 50 నిష్పత్తిలోనే నీటి పంపిణీ జరగాలని తీర్మానించింది. జూలై 20 తర్వాత జరిగే కృష్ణా బోర్డు సమావేశంలో గట్టిగా వాదించనున్నది. తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ ఇంజనీర్లు శక్తివంచన లేకుండా కృష్ణా జలాల్లో న్యాయమైన వాటా పొందడానికి చేస్తున్న ప్రయత్నాలకు ప్రతిపక్షాలు మద్దతు ప్రకటించవలసింది పోయి విమర్శలు చేయడం విడ్డూరం.
–శ్రీధర్రావు దేశ్పాండే