ప్రాణాన్ని నిలిపే ఆక్సిజన్ ప్రాణాలు తీయడం కరోనా మహత్యమే. మహారాష్ట్ర నాసిక్లోని డాక్టర్ జాకీర్ హుస్సేన్ దవాఖాన, ఢిల్లీలో గంగారం దవాఖానలో ఆక్సిజన్ కొరత వల్ల పదుల సంఖ్యలో మృత్యువాత పడటం విషాదం. కరోనా రెండవ దశ విజృంభిస్తున్న పరిస్థితుల్లో దేశంలో ఎక్కడ చూసినా ఆక్సిజన్ కొరత ఏర్పడుతున్నది. రాష్ర్టాల మధ్య ఆక్సిజన్ కోసం పోటీ ఎక్కువైంది. ఆక్సిజన్ ట్యాంకర్ల కోసం రాష్ర్టాలు పోట్లాడుకొనే పరిస్థితి ఏర్పడింది.
కరోనా మొదటి దశ శుచి, శుభ్రతను నేర్పించగా, రెండవ దశ ప్రాణవాయువు ఆవశ్యకతను తెలియజేస్తున్నది. కరోనా కారణంగా ప్రాణవాయువు ఆవశ్యకత తెలిసివచ్చింది. ఏదేమైనా ఆక్సిజన్ కోసం దవాఖానల్లో రోగి బంధువులు పెడుతున్న ఆర్తనాదాలు విన్నవారెవరైనా అయ్యో పాపం అనడమే తప్ప ఏమీ చేయలేని నిస్సహాయ స్థితి. కరోనా కాటుకు పిట్టల్లా రాలిపోతున్న ప్రజలను చూస్తుంటే హృదయం ద్రవించిపోతున్నది. ఇకనైనా ప్రభుత్వాలు చిత్తశుద్ధితో ఆక్సిజన్ను అందరికి అందుబాటులోకి తెచ్చి ప్రాణాలను కాపాడాలి.
కరోనా తొలి దశ తర్వాత ఆక్సిజన్ అవసరాన్ని గుర్తించడంలో కేంద్ర ప్రభుత్వం విఫలం చెందడం ప్రస్తుత దుస్థితికి కారణం. కరోనా తొలి దశ నుంచి దేశం నెమ్మదిగా కోలుకుంటున్న తరుణంలో దానిగురించి నేతలు పట్టించుకోవటంలో నిర్లక్ష్యం వహించారు. రాష్ర్టాల్లో ఎన్నికల నిర్వహణ, కరోనా మార్గదర్శకాలను సరిగా పట్టించుకోకపోవడం వల్లే తిరిగి రెండవ దశ వ్యాప్తి తీవ్రతరమైంది. దీంతో దవాఖానల అవసరం పెరిగి ఆక్సిజన్ కొరత ఏర్పడింది.
రోగులకు అందించే ఆక్సిజన్ను లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్ అంటారు. ప్రకృతిలోని ప్రధాన వాయువుల్లో ఒకటైన ఆక్సిజన్ చుట్టూ ఉన్న గాలిలో 21 శాతమే ఉంటుంది. గాలిలోని ఇతర వాయువులను వేరు చేసి ఈ ఆక్సిజన్ను తయారుచేస్తారు. దీన్నే ఎయిర్ సపరేషన్ యూనిట్ (ఏఎస్యూ) అంటారు. గాల్లోనే వివిధ వాయువులను ద్రవ స్థితికి చల్లార్చిన తర్వాత ఫ్రాక్షనల్ డిస్టిలేషన్ ప్రక్రియ ద్వారా ద్రవ ఆక్సిజన్ను ప్లాంట్లలో తయారు చేస్తారు. ఇలా తయారైన ద్రవ ఆక్సిజన్ను మైనస్ 180 డిగ్రీల సెల్షియస్ ఉష్ణోగ్రత ఉండే క్రయోజనిక్ ట్యాంకర్ల ద్వారా సరఫరా చేస్తారు. దాన్నే దేశంలోని వివిధ పట్టణాల్లోని డిస్ట్రిబ్యూటర్లకు సరఫరా చేస్తారు. డిస్ట్రిబ్యూటర్లు ఈ ద్రవ ఆక్సిజన్ను వాయు రూపంలోకి మార్చి సిలిండర్లలోకి నింపి పలు దవాఖానలకు పంపిణీ చేస్తారు.
ప్రస్తుతం వైద్య ఆక్సిజన్కు ఏర్పడిన కొరత ఉత్పత్తిలో ఒక స్వల్ప భాగం మాత్రమే. ఉత్పత్తి చేసిన ఆక్సిజన్ను దేశంలోని మారుమూల ప్రాంతాలకు వేగంగా చేరవేయడం పెద్ద సమస్య. పారిశ్రామిక అవసరాలను పక్కనపెట్టి యుద్ధ ప్రాతిపదికన దేశమంతటా ఆక్సిజన్ ఉత్పత్తికి కేంద్రం ఆదేశించింది. దవాఖానలు తమంతట తామే ఆక్సిజన్ను ఉత్పత్తి చేసుకునే అవకాశం ఉంది. దీన్ని ప్రెషర్ స్వింగ్ అడ్సాప్షన్ అంటారు. అంటే తన చుట్టూ ఉండే గాల్లోనే ఆక్సిజన్ను వేరుచేసి వాడుకునే విధానం. ఏఎస్యూలో తయారయ్యే ఆక్సిజన్ కంటే దీని నాణ్యత తక్కువే అయినా దవాఖానల్లో వినియోగానికి సరిపోతుంది.
పలు రాష్ర్టాల్లో ప్రజారోగ్య వ్యవస్థ వెంటిలేటర్ మీదకు మారింది. ఆక్సిజన్ అందక ఇప్పుడు ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయి. దీంతో చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్న చందాన, విదేశాల నుంచి 50 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ దిగుమతికి కేంద్రం ఆదేశాలు ఇచ్చింది. అయితే 2020- 21 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో భారత్ పెద్దఎత్తున ఆక్సిజన్ను విదేశాలకు ఎగుమతి చేసింది. ఈ తొమ్మిది నెలల కాలంలో 9,294 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ను ఇతర దేశాలకు అమ్మింది. ఇందులో అత్యధికంగా 8,828 టన్నుల ఆక్సిజన్ను ఒక బంగ్లాదేశ్కే సరఫరా చేసింది.
2017 ముందు ద్రవరూప ఆక్సిజన్ ఉత్పత్తిలో భారత్ ప్రపంచంలోనే అగ్రగామిగా ఉండేది. 2016-17 నాటికి భారత్ నుంచి 13,844 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ ఎగుమతి అయింది. ఆ తర్వాత దేశంలో వైద్య ఆక్సిజన్ అవసరం పెరిగింది. అలాగే పరిశ్రమల్లోనూ ఆక్సిజన్ వినియోగం వృద్ధి చెందింది. దీంతో దేశం నుంచి ఆక్సిజన్ ఎగుమతులపై నియంత్రణ విధించారు. 2017- 18లో భారత్ 4,219 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ను ఎగుమతి చేసింది. 2018-19లో 3,189 మెట్రిక్ టన్నులు, 2019-20లో 4502 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ ఎగుమతి జరిపింది. కాగా గతేడాది ఒక్కసారిగా తిరిగి ఆక్సిజన్ ఎగుమతులను పెంచేసింది. ప్రస్తుతం రోజు దేశంలో 7,128 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ ఉత్పత్తి సామర్థ్యం ఉన్నది. అయితే ఇందులో 92 శాతం పారిశ్రామిక అవసరాలకు ఉపయోగిస్తారు. కొన్ని పరిశ్రమల్లో ఆక్సిజన్ అందుబాటులో లేకుంటే ఉత్పత్తి నిలిచిపోతుంది. ప్రస్తు పరిస్థితుల్లో ప్రభుత్వం పరిశ్రమల అవసరాలను కూడా పక్కనపెట్టి కేవలం ఔషధ, వైద్యరంగాలకు మాత్రమే ఆక్సిజన్ సరఫరా చేసే ప్రక్రియను వేగవంతం చేయటం ఆహ్వానించదగినది.
ప్రత్యేక గ్రీన్ కారిడార్ను ఏర్పాటుచేసి రైల్వేల ద్వారా, విమానాల ద్వారా ఆక్సిజన్ను రవాణా చేయాల్సిన ఆవశ్యకత ఉన్నది. కరోనా మొదటి దశ శుచి, శుభ్రతను నేర్పించగా, రెండవ దశ ప్రాణవాయువు ఆవశ్యకతను తెలియజేస్తున్నది. కరోనా కారణంగా ప్రాణవాయువు ఆవశ్యకత తెలిసివచ్చింది. ఏదేమైనా ఆక్సిజన్ కోసం దవాఖా నల్లో రోగి బంధువులు పెడుతున్న ఆర్తనాదాలు విన్నవారెవరైనా అయ్యోపాపం అనడమే తప్ప ఏమీ చేయలేని నిస్సహాయ స్థితి. కరోనా కాటుకు పిట్టల్లా రాలిపోతున్న ప్రజలను చూస్తుంటే హృదయం ద్రవించిపోతున్నది. ఇకనైనా ప్రభుత్వాలు చిత్తశుద్ధితో ఆక్సిజన్ను అందరికి అందుబాటులోకి తెచ్చి ప్రాణాలను కాపాడాలి.
డాక్టర్ చల్లా ప్రభాకర్రెడ్డి