శిథిలావస్థలో ఇండ్లు.. మురికి కూపాలు.. చెత్త కుప్పలు.. ఆరేడేండ్ల కిందటి పల్లె తెలంగాణలో కనిపించిన దృశ్యమిది. మరిప్పుడు పాడుబడ్డ ఇండ్లు లేవు, దారి వెంట చెత్త కుప్పల్లేవు, మురుగు వరద లేదు. తెలంగాణ పల్లెలు కడిగిన ముత్యాలయ్యాయి. పరిశుభ్రతకు చిరునామాగా మారాయి. పచ్చని చెట్ల తోరణాలతో స్వాగతం పలుకుతున్నాయి. తెలంగాణ సాధికారతకు వెలుగు జిలుగుల పల్లెలు ముఖచిత్రంగా నిలుస్తున్నాయి.
గ్రామాలను ఆదర్శంగా తీర్చిదిద్దే ప్రణాళికతో ప్రతి సంవత్సరం పల్లె ప్రగతి కార్యక్రమం నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్కు ఓ పల్లెవాసిగా నా కృతజ్ఞతలు. తెలంగాణ గ్రామీణ చైతన్యాన్ని ముందుకు నడిపిస్తున్న స్ఫూర్తిప్రదాతకు ధన్యవాదాలు.
భారతదేశానికి పల్లెలే పట్టుగొమ్మలు అని చిన్నప్పటి నుంచి చదువుకున్నాం. కానీ, ఆ పట్టుగొమ్మల బాగోగులు పట్టించుకున్న దాఖలాలు లేవు. స్వరాష్ట్ర సాధన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ అంకితభావంతో పల్లె ప్రగతికి శ్రీకారం చుట్టారు. దీంతో అనతికాలంలోనే పల్లెపల్లెనా పరిశుభ్రత పల్లవించింది. పరిశుభ్రమైన దారుల వెంట బారులు తీరిన చెట్లు.. పొలిమేరలు దాటిన పచ్చదనాన్ని మళ్లీ పరిచయం చేశాయి. గ్రామాల సర్వతోముఖాభివృద్ధితోనే దేశం పురోగతి సాధిస్తుందన్న మహాత్మాగాంధీ మాటలను ఆదర్శంగా తీసుకొని ప్రారంభించిన పథకం ‘పల్లె ప్రగతి’. ఈ కార్యక్రమం ద్వారా తెలంగాణ గ్రామాల రూపురేఖలు మారుస్తూనే, ప్రజల్లో చైతన్యాన్ని కలిగించడంలో ముఖ్యమంత్రి కేసీఆర్ వందశాతం సఫలీకృతులయ్యారు.
2019లో ప్రణాళికాబద్ధంగా, ఆచరణాత్మకంగా ముఖ్యమంత్రి ఆలోచనలతో రూపొందిన పథకం పల్లెప్రగతి. ఈ పథకం అమలుతో పల్లె సిగలో కొత్త హంగులెన్నో వచ్చి చేరాయి. ప్రజలు, ప్రజాప్రతినిధులు ఒక్కతాటిపైకి వచ్చి ఊరు రాత మార్చుకున్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులతో సర్పంచ్ అధ్యక్షతన సమావేశం ఏర్పాటు చేసి పక్కా ప్రణాళిక తయారు చేసుకోవడంతో పనులు నిర్విఘ్నంగా జరిగిపోతున్నాయి. పల్లె ప్రగతి మొదటి విడతలోనే గ్రామాల్లో శిథిలావస్థలో ఉన్న ఇండ్లను తొలగించి పచ్చదనం, పరిశుభ్రతతో కళకళలాడే విధంగా ఊర్లను తీర్చిదిద్దుకున్నారు. నిధులకు కొరత రాకుండా ప్రతి గ్రామ పంచాయతీకి తగినన్ని నిధులు కేటాయించడంతో ఈ పథకం మరింత పరిపుష్టి అయింది.
గ్రామీణ ప్రాంతాల్లో అపరిశుభ్రత పెద్ద సమస్య. వీధుల వెంబడేకాదు ఇళ్లల్లో కూడా పేరుకు పోయిన పనికిరాని వస్తువులు ఈ సమస్యను పెంచేవి. ఇప్పుడు ‘పల్లె ప్రగతి’తో వ్యర్థాలన్నీ డంప్ యార్డుకు చేరుతున్నాయి. పట్నంలో కొనసాగుతున్న తడి-పొడి చెత్త సేకరణ ఇప్పడు పల్లెల్లోనూ మొదలైంది. ఇలా విడివిడిగా సేకరించిన చెత్తను డంపింగ్ యార్డులకు తరలించి ఉపయోగకరమైన ఎరువులుగా మార్చడం గొప్ప మార్పు. ఈ విధంగా పల్లె ప్రగతి ద్వారా ఒక విప్లవాత్మకమైన మార్పు ముఖ్యమంత్రి దూరదృష్టి ద్వారా సాధ్యమైంది.
గత ప్రభుత్వాలు వానకాలంలో ఆదరబాదరగా మొక్కలు నాటేవి. మళ్లీ వానకాలం వచ్చేనాటికి ఒక్కమొక్క కనిపించేది కాదు. కానీ, గ్రీన్ తెలంగాణ లక్ష్యంగా ముఖ్యమంత్రి చేపట్టిన హరితహారం.. అటువంటి పథకం కాదు. ఊరు పొలిమేరల్లో చూడొచ్చు హరితహారం పచ్చదనాన్ని. ఊరు మధ్యలో చూడొచ్చు.. పచ్చని చెట్ల వరుసల్ని. హరితహారంలో భాగంగా కోట్ల సంఖ్యలో మొక్కలు నాటాలనే మహోన్నత లక్ష్యంతో పర్యావరణ పరిరక్షణ కోసం ఒక మహాయజ్ఞాన్ని ప్రారంభించారు. నాటిన మొక్కల సంరక్షణ బాధ్యతలను స్థానిక సంస్థలకు అప్పగించి ‘హరిత హారం’ విజయానికి నాంది పలికారు. గ్రామంలో ప్రజలు కోరుకున్న మొక్కలను, గ్రామ అవసరాలకు అనుగుణంగా నాటేందుకు వీలుగా, గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో నర్సరీ ఏర్పాటు చేయడం దేశచరిత్రలోనే కనీవినీ ఎరుగని ప్రణాళిక.
మనిషి పోయిన దుఃఖం కన్నా.. పోయిన మనిషిని తగిన గౌరవంతో సాగనంపే సౌకర్యం లేక పల్లెవాసులు పడ్డ గోస గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇప్పుడీ పరిస్థితి వైకుంఠధామాలతో పూర్తిగా మారిపోయింది. ధనిక, పేద అనే తేడా లేకుండా అందరూ ఒకటే అనే భావనతో తగిన వసతులతో వైకుంఠ ధామాలు ఏర్పాటుచేయటం గతంలో ఎవరూ చేయని ఆలోచన.
స్వరాష్ర్టాన్ని సాధించుకున్న తెలంగాణ అభివృద్ధి పల్లెల స్వయంసమృద్ధి, ఆర్థిక స్వావలంబనపైనే ఆధారపడి ఉంది. అందుకు తగ్గట్టుగా ఊళ్లను ఆదర్శంగా తీర్చిదిద్దే ప్రణాళికతో ప్రతి సంవత్సరం ‘పల్లె ప్రగతి’ కార్యక్రమం నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్కు ఓ పల్లెవాసిగా నా కృతజ్ఞతలు. తెలంగాణ గ్రామీణ చైతన్యాన్ని ముందుకు నడిపిస్తున్న స్ఫూర్తిప్రదాతకు ధన్యవాదాలు.
పల్లెల్లో మళ్లీ పచ్చదనం
కొన్ని తరాలు చూడని విశేషాలు పల్లె ప్రగతితో ఊళ్లల్లో సాకారమయ్యాయి. అందులో ఒకటి ప్రకృతి వనాలు. పార్కులు అంటే పట్నాల్లోనే ఉంటయి అనే అభిప్రాయం దశాబ్దాలపాటు కొనసాగింది. కానీ, ప్రస్తుతం తెలంగాణ గ్రామాలు ఆ అభిప్రాయాన్ని మార్చివేశాయి. పల్లెల్లో కరువైన పచ్చదనాన్ని మళ్లీ చిగురింపజేసే లక్ష్యంతో ప్రకృతి వనాల ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. ప్రతీ పల్లె గతంలోలా పచ్చదనానికి కేంద్రంగా ఉండాలనే ముఖ్యమంత్రి సంకల్పంతో ఇది సాధ్యమైంది.
–ఆదరాసుపల్లి శశిధర్