దేశంలో ఎంతమంది నివసిస్తున్నారు? వారి ఆర్థిక, సామాజిక, రాజకీయ ప్రాతినిధ్యం ఏమిటి? నిరుద్యోగులు, అనాథలు, వికలాంగులు, అక్షరాస్యత నిష్పత్తి , మొదలైన వివరాలు జనగణన (సెన్సెస్) ద్వారా తెలుస్తుంది. ప్రజలకు సంక్షేమ పథకాలు అమలుచేయడానికి జనగణన పునాదిగా ఉపయోగపడుతున్నది. బ్రిటిష్ ప్రభుత్వం 1881 నుంచి క్రమం తప్పకుండా
పదేండ్లకోసారి జనాభా లెక్కలను నిర్వహించేది.
2021లో జనగణనను కరోనా రెండోదశ వల్ల ఆపివేయాల్సి వచ్చింది. లేనట్లయితే ఈ ఏడాది మార్చి నాటి కి జమ్మూకశ్మీర్, హిమాచల్ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ర్టాలను మినహాయించి అన్ని రాష్ర్టాల్లో, కేంద్రపాలిత ప్రాం తాల్లో ప్రారంభించి ఉండేవారు. దేశంలో ప్రజల సామాజిక స్థితిగతులు తెలుసుకోవాలంటే కులాలవారీగా జనా భా గణన చేయాల్సి ఉంది. అయితే 2018లో అప్పటి కేంద్ర హోంమంత్రి 2021 జనగణనలో ఓబీసీలను లెక్కిస్తామని చెప్పారు. కానీ ఈ ఏడాది మార్చికి ముందు ఓబీసీల సంఖ్యను లెక్కించడం లేదని, రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా సెన్సస్ కమిషనర్ వివేక్ జోషి ప్రకటన ఓబీసీలను (ఇతర వెనుకబడిన తరగతుల వారిని) ఎంతో నిరాశపరిచింది.
డాక్టర్ సయ్యద్ అలీ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు తీర్పులో భాగంగా, 2008లో మద్రాస్ హైకోర్టు వెనుకబడిన తరగతులకు మద్దతుగా, కులాల వారీగా జనగణనను నిర్వహించాలని సెన్సెస్ ఆఫ్ ఇండియాను ఆదేశించింది. అయితే సుప్రీంకోర్టు 2014లో సెన్సస్ కమిషన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు తీర్పులో మద్రాస్ హైకోర్టు తీర్పును తప్పుబట్టింది. న్యాయ పరిమితిని దాటడం మాత్రమే కాకుండా తీర్పులో పక్షపాతం వహించిందంటూ మద్రాస్ హైకోర్టు తీర్పును కొట్టివేసింది. ఇదే తీర్పులో స్టేట్ ఆఫ్ మధ్య ప్రదేశ్ వర్సెస్ నర్మదా బచావో ఆందోళన్ కేసును ఉటంకిస్తూ, ప్రభుత్వ పాలసీలకు కోర్టులు ఎదురు చెప్పొద్దని, ఆ పాలసీల్లో ఆర్టికల్ 14 ప్రాథమిక అవసరాలు తీర్చకుండా ఉన్నట్లయితే కోర్టులు జోక్యం చేసుకోవచ్చని తీర్పునిచ్చింది. అదేవిధంగా కులాలవారీగా సెన్సెస్ నిర్వహించాలని న్యాయస్థానాలు ప్రభుత్వాన్ని ఆదేశించడం సరైనది కాదని తెలిపింది.
1992లో ఇందిరా సహాని కేసులో సుప్రీంకోర్టు బీసీల రిజర్వేషన్లకు ఆమోదం తెలిపి, దేశంలో ప్రత్యేక పరిస్థితుల్లో తప్ప 50 శాతానికి రిజర్వేషన్లు మించవద్దని, ఆర్థికంగా వెనుకబడినవర్గాలకు రిజర్వేషన్లను కల్పించడం రాజ్యాంగ విరుద్ధమని చెప్పింది. అయినా 2019లో కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం 103వ రాజ్యాంగ సవరణ ద్వారా 15(6), 16(6) అధికరణలను చేరుస్తూ ఆర్థికంగా వెనుకబడినవారికి ప్రభుత్వ రంగాల్లో రిజర్వేషన్లను కల్పించి, ఈడబ్ల్యూఎస్ కోటా అమలయ్యేలా చేసింది. రాజ్యాంగంలో కులాలవారీగా సెన్సెస్ నిర్వహించవద్దని ఎలాంటి నిబంధన లేదు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు సాధ్యం కాకున్నా, కేంద్రం రాజ్యాంగ సవరణ ద్వారా అమలుచేసింది. అలాంటిది కులాలవారీగా జనాభా లెక్క లు తీయలేరా? 10 శాతం రిజర్వేషన్లను అమలుచేయడం సాధ్యం చేసి అదేవిధంగా కులాలవారీగా జనాభా గణన చేయడం లేదంటే, ఓబీసీ కులాలపై వివక్ష చూపడమే. 2017లో 2,633 ఓబీసీ కులాల వర్గీకరణకు నియమించిన జస్టిస్ రోహిణి కమిషన్కు కులాలవారీ జనగణన ఎంతో సహాయపడుతుంది. దేశంలో 1953 నుంచి ఏర్పా టుచేసిన జాతీయ, రాష్ట్రస్థాయి బీసీ కమిషన్లు ఓబీసీ కులగణన చేయాలని ప్రభుత్వాలకు సూచించాయి. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం 2021 జనాభా లెక్కల్లో ఓబీసీ కులగణన చెయ్యాలి. ఇది ఓబీసీ/బీసీ రిజర్వేషన్ల అమల్లో ఎదురవుతున్న సమస్యలకు విరుగుడు. దేశ జనాభాలో యాభై శాతానికి పైగా ఉన్న వెనుకబడిన కులాలకు న్యాయం జరుగుతుంది.
–రోహిత్ కోడెపాక
(వ్యాసకర్త: పరిశోధక విద్యార్థి, అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ )