ఒక మంత్రిపై అవినీతి ఆరోపణలు రావడం, ఆయనను బర్తరఫ్ చేయడం, అతడు మరో పార్టీలోకి మారడం మొదలైన అంశాలపై నెల రోజులుగా చర్చ సాగుతున్నది. ప్రజా సమస్యలపై మాట్లాడాల్సిన పార్టీలు ఆ నేతను చేర్చుకునేందుకు ఉత్సాహం చూపుతున్నాయి. ఇలాంటి రాజకీయ మార్పులు ఎలాంటి పరిణామాలకు దారితీస్తాయనేది చర్చించుకోవలసిన అవసరం ఉన్నది. బీజేపీ పాలిత రాష్ర్టాల్లో సమాఖ్య స్ఫూర్తి ఎలా దెబ్బతిన్నది? రాజకీయ కక్షలనే ప్రధానాస్ర్తాలుగా ఎలా మార్చుకుందనేది ఆలోచన చేయాలి. వివిధ రాష్ర్టాల్లో మోదీ, షా ద్వయం వేసే పాచికలు పనిచేస్తాయా అనేది ఒక ప్రశ్నగానే మిగలనున్నది.
కేంద్రంలో రెండు దఫాలు అధికారం చేపట్టిన బీజేపీ తన సహజ ప్రవృత్తి ప్రకారం ప్రభుత్వాలను కూల్చేందుకు చాలా ప్రయత్నాలే చేస్తున్నది. అలాంటి ప్రయత్నాలను ఏడేండ్లలో చాలానే చూశాం. మణిపూర్, గోవా, మధ్యప్రదేశ్, కర్ణాటక రాష్ర్టాల విషయంలో మోదీ, షా ఎత్తుగడలు సఫలమయ్యాయి. సమాఖ్య స్ఫూర్తి గురించి గొప్ప ఉపన్యాసాలు చెప్తూనే, వాటిని తుంగలో తొక్కడం బీజేపీకి పరిపాటి. మతాన్ని రాజకీయాల కోసం వాడుకుంటూ తన కార్యాచరణను అమలు చేసుకుంటున్నది. రాష్ట్ర ప్రభుత్వాలను ఎలా కూలదోయాలి, ఆయా రాష్ర్టాల్లో ఉన్న పార్టీలను ఎలా నిర్వీర్యం చేయాలనేదే మోదీ – షా అజెండా.
బీజేపీ కుట్రలు, కుతంత్రాలు, ఓటమి గురించి మాట్లాడుకోవాలంటే, పశ్చిమబెంగాల్ ప్రజల విజయం గురించి చెప్పుకోవాల్సిందే. బీజేపీకి అధికార యావ తప్ప ప్రజల శ్రేయస్సుపై సోయిలేదని బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో రుజువైంది. బెంగాల్ శాసనసభ ఎన్నికల్లో బీజేపీ వ్యవహారశైలి ప్రజాస్వామ్య విరుద్ధంగా ఉందనేది తెలిసిపోయింది. ఒకప్పుడు బెంగాల్ అంటే దేశానికి దిక్సూచి. బెంగాల్ ఏం ఆలోచిస్తుందో, దేశం అదే చేస్తుందని ప్రచారంలో ఉండేది. అలాంటి బెంగాల్లో విచ్ఛిన్నకర, జుగుప్సాకర రాజకీయాలకు బీజేపీ తెరలేపింది. అక్కడి రాజకీయ వ్యవస్థను చిన్నాభిన్నం చేసేందుకు మోదీ, షా కంకణం కట్టుకున్నారు. అయినా వారి కుట్రలు ఫలించలేదు. అధికారంలో ఉన్న తృణమూల్ కాంగ్రెస్ను మట్టి కరిపించడానికి ప్రధాని, అమిత్ షా వంటి నాయకులు రంగంలోకి దిగడం విడ్డూరం.
తృణమూల్ కాంగ్రెస్ కీలక నేతలు మొదలుకొని కిందిస్థాయి నేతల వరకు అనేక మందిని ప్రలోభపెట్టింది. అన్నిరకాల అస్ర్తాలను ప్రయోగించి కీలకనేతలను లోబరుచుకున్నది. రెండేండ్లలో దాదాపు 34 మంది టీఎంసీ నేతలకు బీజేపీ కండువా కప్పింది. బీజేపీలో చేరినవారిలో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు, మా జీ ఎమ్మెల్యేలు, మున్సిపల్ చైర్మన్లు, ఇతర కిందిస్థాయి నేతలున్నారు. వీళ్ల అండతో అధికారంలోకి రావచ్చని బీజేపీ భ్రమపడింది. మంత్రులు, ఎమ్మెల్యేల చేరికతో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం ఖాయమని బీజేపీ భావించింది కానీ, ప్రజల స్థానికత నినాదం, మమత ప్రజాభిమానం ముందు మోదీ, షాలకు భంగపాటు తప్పలేదు. మణిపూర్, గోవా, మధ్యప్రదేశ్, కర్ణాటక రాష్ర్టాల్లో మాదిరిగా అధికారంలోకి వద్దామనుకున్న బీజేపీకి బెంగాల్ ప్రజలు ఊహించని తీర్పునిచ్చారు. ఎన్నికల్లో ఎన్ని అబద్ధాలను నిజాలుగా చెప్పినా బెంగాలీ ప్రజలు బీజేపీని విశ్వసించలేదు. బీజేపీ ఎత్తుగడలను బెంగాల్ ప్రజలు తిప్పికొట్టారు.
బెంగాలీల మాదిరిగానే, తెలంగాణవాదం బలమైనది. తెలంగాణ గడ్డ మీద మమకారాన్ని వారు అనేకసార్లు చాటుకున్నారు. తెలంగాణవాదం బలమైంది కనుకనే స్వరాష్ర్టాన్ని సాధించుకోగలిగారు. ఏడేండ్లలో అనేక సందర్భాల్లో తెలంగాణ భావం ఎంత బలమైందో నిరూపితమైంది. నేతలను కొనుగోలు చేయడం ద్వారా ప్రజలను మభ్యపెట్టడం సాధ్యం కాదు. వామపక్ష ఉద్యమకారులను ఎంతోమందిని పొట్టనబెట్టుకున్న బీజేపీ, ఇవాళ అదే వామపక్ష నేతలను చేర్చుకునేందుకు ఉవిళ్లూరుతున్నది. వామపక్ష ఎజెండాను తీవ్రంగా వ్యతిరేకించే బీజేపీ, అలాంటి భావాలున్న నేతలను చేర్చుకోవడం ద్వారా తమ సిద్ధాంతాలకు తిలోదకాలు ఇస్తున్నది. దీని వల్ల ప్రజల్లో చులకన అవుతున్నది. చరిత్ర పొడుగునా లౌకికివాదానికి తెలంగాణ సాక్ష్యంగా నిలుస్తున్నది. విద్వేషాలను రెచ్చగొట్టి పబ్బం గడుపుకోవాలనుకునే పార్టీలకు ఇకముందు కూడా తెలంగాణలో స్థానం ఉండదు.
-బండారు జితేందర్