2014, జూన్ 2వ తారీఖు తెలంగాణ ప్రజల దీర్ఘకాల స్వప్నం ఫలించిన రోజు. ఈ రోజు వస్తుందో, ఏమో నని కొన్నేండ్ల నుంచి ఎదురుచూసిన బంగారు దినం. తెలంగాణ ప్రజలకు ఈ రోజు మరుపురాని సుదినం, ఆత్మగౌరవ దినం. తెలంగాణ రాకముందు ఈ ప్రాంతమంతా నీళ్ల కరువుండేది. వానొస్తే ఆ యేడు పంట పండేది, లేకుంటే లేదు. తాగునీటికీ అంతే గోస.
చెరువులు, కుంటలు మాత్రమే తెలంగాణకు నీళ్లు నిల్వ చేసే వనరులు. ఇవి వానలు పడితే నిండేటివి, లేకపోతే ఎండిపోయేవి. ఎప్పుడో కాకతీయ రాజులు ఏర్పరిచిన నీటి వనరులు. ఆలనా పాలనా లేక మట్టితో నిండిపోయినవి. ఇవి మట్టితో నిండి ఉండటంతో నీటి నిల్వ సామర్థ్యం తక్కువై నీరు వృథాగా బయటికి పోయేటివి. పంటలు పండక, తాగునీరు దొరక్క ప్రజలు అల్లాడిపోయేవారు. సరిగా పంటలు చేతికి రాక ఉపాధి కోసం ప్రజలు వలస వెళ్లేవారు. ఇందువల్ల వ్యవసాయం దిక్కు తోచని స్థితికి చేరింది.
మాది కొలనూరు. నా చిన్నతనంలో ఎండకాలం నీళ్లు దొరక్క చాలా అష్టకష్టాలు పడేటోళ్లం. మా పక్కూరోళ్లది అదే పరిస్థితి. ఊరుబయట మైళ్ల దూరంలో ఉన్న ఎవుసాయం మోట బాయి నుంచి, చెలిమెల నుంచి కొందరు నెత్తి మీద బిందెలు, కుండలు పెట్టుకొని, మరికొందరు ఎడ్లబండ్లలో డ్రమ్ములు వేసుకొని నీరు తెచ్చుకునేవారం. అంతటి నరకం చూసినం. పల్లె ప్రజలు నుదిటిపై కుడి అరచేతిని అడ్డుపెట్టుకొని వాన కోసం మొగులువైపు చూసేవారు. ఈ కార్తి కాకుంటే వచ్చే కార్తిలో, మల్ల వచ్చే కార్త్తిలో వర్షాలు పడతాయనే ఆశతో దేవునికి దండం పెట్టుకొని ఆయనపై భారం వేసి ఎదురుచూసేవారు.
పుణ్య నదులైన గోదావరి, కృష్ణ తెలంగాణ వ్యాప్తంగా పారుతున్నా చుక్కనీరు అందులో ఉం డకపోయేది. దీనికి ప్రధాన కారణం ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ వివక్షకు గురికావడమే. ఎస్సారెస్పీ ప్రాజెక్టును పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. దీనికితోడు పుండు మీద కారం చల్లినట్టు గోదావరి నది పైభాగంలో మహారాష్ట్రలోని బాబ్లీ ప్రాజెక్టు నిర్మా ణం చేసి నీరు రాకుండా అడ్డుకున్నారు. ఇక్కడో విషయం గోదావరి నదిని తెలంగాణలో గంగా నదిగా పిలుస్తారు. ఇప్పటికీ చాలాచోట్ల గంగ వచ్చింది, గంగకు పోవాలె, గంగ స్నానం చేయాలంటారు.
తెలంగాణ సిద్ధించిన తర్వాత ఈ పరిస్థితి మారింది. ఇప్పుడు చెరువులు, కుంటల్లోని మట్టిని ‘మిషన్ కాకతీయ’ పథకం ద్వారా తీసి చెరువులు, కుంటలను పునరుద్ధరణ చేశారు. ఇప్పుడు నీళ్లు సమృద్ధిగా నిండుగా కళకళలాడుతున్నాయి. బావుల్లో నీళ్లు పైకి ఎగతన్నుతున్నయి. ఊట విపరీతంగా ఉంటున్నది. ఇప్పుడు, ఈయే డు, ఈ ఎండకాలంలో చెరువులు, కుంటలు నీళ్లతో నిండి మత్తడి దుంకుతున్నయి. వాగులు, వంకలు నిండుగా పారుతున్నయి. నీటి చుక్క కోసం అరిగోస పడ్డ తెలంగాణ నేడు ఏడజూసినా నీటితో కళకళలాడుతున్నది.
దీనికి కారణం మన పురాణాల్లో, ఇతిహాసాల్లో చెప్పినట్టు ఎప్పుడైతే ప్రజలు నానా ఇతిబాధలు పడుతారో అప్పుడు ఆ దేవదేవుడు, ఏదో ఒకరూపంలో ప్రజలను ఆదుకుంటడు. హిరణ్యకశిపుని బారినుంచి ప్రహ్లాదున్ని, మొసలి బారినపడిన ఏనుగును ఆ శ్రీహరి రక్షించినట్లు మన తెలంగాణ నీటి కష్టాలను పారదోలేందుకు సాక్షా త్తూ ఆ శ్రీ మహావిష్ణువు తన విష్ణుచక్రం తిప్పి మన నీటి కష్టాలను నివారించాడు. మన తెలంగాణలో ఉన్న చెరువులు, కుంటల్లో కలు వ పూలు వికసించి (కల్వకుంట్ల), ఆ గరళ శంకరుడు (చంద్రశేఖరుడు) తన శిరస్సుపై నుంచి నీటిధారను కాళేశ్వ రం గోదావరి నదిలో విడిచి మన తెలంగాణ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తున్నాడు. ఇదీ మన ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచనలకు నిదర్శనం. ఆయన పోరాటయోధుడే కాదు, పట్టువదలని విక్రమార్కుడు. నిత్యం కరువు కాటకాలతో విలవిలలాడిన తెలంగాణను సస్యశ్యామలం చేస్తున్న మహనీయుడు. ప్రస్తుతం నేను బోయినపల్లి హైదరాబాద్లో నివాసం ఉంటున్నా. ఈయేడు, ఇప్పుడు ఎండకాలంలో కూడా నీళ్లు పుష్కలంగా వస్తున్నయి. సాక్షాత్తు ఆ గంగే ప్రతి ఇంటిలోనూ నీళ్లతో గలగలాడుతున్నది.
–దండంరాజు రాంచందర్రావు