హమాస్- ఇజ్రాయెల్ మధ్య కాల్పుల విరమణ ప్రస్తుతానికి సంతోషించదగినదే అయినా, ఈ ఘర్షణలకు మూలమైన పాలస్తీనా సమస్య పరిష్కారం కానంతవరకు అక్కడ శాశ్వత శాంతి సాధ్యం కాని పని. దానినట్లుంచితే, ఈసారి ఘర్షణలకు తక్షణ కారణం ఏమిటనే ప్రశ్నపై మన మీడియాలో అసత్యాల ప్రచారం బాగానే జరిగింది కాని, ప్రజలకు వాస్తవాలను తెలియజేసే ప్రయత్నం కనపడలేదు. కనీసం పాశ్చాత్య దేశాల మీడియా నిజాయితీనైనా మనం చూపలేకపోయాము.
హమాస్- ఇజ్రాయెల్ మధ్య స్వల్ప స్థాయి ఘర్షణలు గాక భారీ ఎత్తున కొన్ని సాగాయి. అట్లా చివరిది 2014లో జరిగింది. ఆ తర్వాత ఏడేండ్లకు ఇప్పుడు తిరిగి ఇంత పెద్ద ఘర్షణ 11 రోజుల పాటు ఎందుకు జరిగిందనేది మనం తెలుసుకోవలసిన విష యం. ఘర్షణ కాలమంతా మన మీడి యా ఆ వివరాలేమీ చెప్పలేదు.
మొదటి నుంచి మనకు పాలస్తీనా ప్రజల హక్కులను బలపరచి ఇజ్రాయెల్ దురాక్రమణను వ్యతిరేకించే దేశంగా పేరున్నది. ఇక్కడి మీడియా కూడా అదేవిధంగా వ్యవహరిస్తూ వచ్చింది. దీని అర్థం అసలు ఇజ్రాయెల్ ఉనికినే తుడిచిపెట్టాలని కాదు. చరిత్రలో పాలస్తీనియన్లు, యూదులు కూడా అనేక సమస్యల్ని ఎదుర్కొన్నవారే. ఇరువురికి సొంత దేశాలంటూ లేకుండా పోయాయి. చివరికి ఇజ్రాయెల్ ఏర్పాటులో పాశ్చాత్య దేశాల ప్రయోజనాలు ఏ విధంగా పనిచేసి ఉన్నా, యూదులతో పాటు పాలస్తీనియన్లకు కూడా ఒక దేశం ఏర్పాటై ఉంటే సమస్య తలెత్తేది కాదు. అక్కడి భూ భాగమంతా తమదేనని, యూదులకు ఎటువంటి హక్కు లేదని కొంతకాలం పాటు పాలస్తీనియన్లు, అరబ్ దేశాలు పట్టుబట్టినా, తర్వాత క్రమంగా రెండు దేశాల సిద్ధాంతం బలపడింది. యాసిర్ అరాఫత్ నాయకత్వాన పాలస్తీనా లిబరేషన్ ఆర్గనైజేషన్ (పీఎల్ఓ) కూడా దానిపై రాజీకి వచ్చింది. రెండు దేశాల ప్రతిపాదనను స్వయంగా ఐరాస 1948లో తయారుచేసింది. ఆ ప్రతిపాదనలో భాగంగా వేర్వేరు అంశాలున్నాయి. ఆ తర్వాత కాలంలోనూ పాశ్చాత్య దేశాలు కొద్దిపాటి సవరణలతో రెండు దేశాల ప్రతిపాదనను బలపరుస్తూ వచ్చాయి.
కాల్పుల విరమణ తర్వాత ఈ నెల 23 నాటి తాజా వార్తల ప్రకారం, అమెరికా అధ్యక్షుడు బైడెన్, రెండు దేశాల ఏర్పాటే సమస్యకు పరిష్కారమని ఇజ్రాయెల్కు స్పష్టం చేశారు. దీనంతటికి విముఖత చూపుతూ మొత్తం భూ భాగం తమదేనని, పాలస్తీనియన్లకు హక్కులు లేవనే వైఖరిని ఇజ్రాయెల్ తీసుకుంది. పీఎల్ఓ, అరబ్ దేశాలు కలిసి 1967లో ఇజ్రాయెల్పై యుద్ధం చేశాయి కానీ ఓడిపోయాయి. ఆ యుద్ధంలో ఇజ్రాయెల్ అప్పటికి పాలస్తీనియన్ల అధీనంలో ఉండిన వెస్ట్ బ్యాంక్, తూర్పు జెరూసలేం, గజాలతో పాటు కొన్ని అరబ్ దేశాల భూ భాగాలను కూడా ఆక్రమించింది. పాలస్తీనియన్లు నివాసం ఉండిన ప్రాంతాలలో సైతం తమవారికి అక్రమంగా కాలనీలు నిర్మించటం నేటికీ కొనసాగుతున్నది. ఇజ్రాయెల్కు గల ఆయుధ శక్తి, పాశ్చాత్య దేశాల మద్దతు వల్ల దీనిని ఎవరూ ఆపలేకపోతున్నారు. ఈ క్రమంలో పాలస్తీనియన్లు మధ్యేమార్గ పీఎల్ఓను పక్కకు తోసివేసి, హమా స్ అనే మిలిటెంట్ సంస్థను ఎన్నుకున్నారు. పోరాడితే తప్ప తమకు హక్కులు ఉండవన్నది వారి నమ్మకం.
ఇటువంటి నేపథ్యంలో హమాస్- ఇజ్రాయెల్ మధ్య స్వల్ప స్థాయి ఘర్షణలు గాక భారీ ఎత్తున కొన్ని సాగాయి. అట్లా చివరిది 2014లో జరిగింది. ఆ తర్వాత ఏడేండ్లకు ఇప్పుడు తిరిగి ఇంత పెద్ద ఘర్షణ 11 రోజుల పాటు ఎందుకు జరిగిందనేది మనం తెలుసుకోవలసిన విష యం. ఘర్షణ కాలమంతా మన మీడి యా ఆ వివరాలేమీ చెప్పలేదు. హమాస్ వారు ఉగ్రవాదులు, ముష్కరులు, వం దల రాకెట్లు ప్రయోగిస్తున్న దుండగులు, శాంతికాముకులైన ఇజ్రాయెలీ ప్రజలను హతమార్చుతూ ఆ దేశాన్ని ధ్వంసం చేస్తున్నారనే వార్తలు, వ్యాఖ్యానాలు, పరిభాషలతో అంతా సాగింది. అక్కడ ఏమి జరుగుతూ వస్తున్నదనే విషయపరిజ్ఞానం గాని, జరిగే సంఘటనలపై విచక్షణా దృష్టిగాని, వార్తలు చెప్పటంలో సంయమనంతో కూడిన, వృత్తి విలువలు గల పరిభాష గాని మనకు ఎందుకు లేకుండా పోయిందనేది మరొక చర్చ. అందులోకి పోలేమిక్కడ.
కానీ మొదటినుంచి ఇజ్రాయెల్కు అనుకూలమనీ పేరుబడిన పాశ్చాత్య మీడియా, దేశాలు సైతం ఇప్పటి ఘర్షణలకు కారణం ఇజ్రాయెల్ అనే వైఖరిని తీసుకున్నాయి. ఆ కారణాలు ఏమిటో అమెరికా దిన పత్రిక న్యూయార్క్ టైమ్స్, బిటిష్ పత్రిక గార్డియన్ వంటివి పూసగుచ్చినట్లు రాశాయి. కాల్పుల విరమణను డిమాండ్ చేస్తూ ఫ్రాన్స్ తదితర యూరోపియన్ దేశాలు భద్రతా మండలిలో తీర్మానానికి సిద్ధపడ్డాయి. అమెరికా అధ్యక్షుడు బైడెన్పై ఆయన డెమోక్రటిక్ పార్టీకే చెందిన ప్రముఖ సభ్యులు ఒత్తిడి తేవ టం మొదలుపెట్టారు. చివరికి భద్రతా మండలిలో భారత ప్రతినిధి టీ.ఎస్.తిరుమూర్తి సైతం, హమాస్ దాడులకు దారితీసిన ఘటనలు కొన్ని ఉన్నాయని, అందుకు బాధ్యత ఇజ్రాయెల్దని స్పష్టం చేశారు. ఈ విధమైన వాస్తవాలలో మన మీడియా వారు ప్రజలకు తెలియజెప్పింది చాలా తక్కువ. ఒకప్పటి భారతీయ మీడియా, తెలుగు మీడియా ఈ స్థితికి ఎందుకువచ్చిందో ఆత్మ పరిశీలన చేసుకోవటం అవసరం. పైన అన్నట్లు ఆ చర్చ ఇక్కడ చేయలేము.
ఘర్షణలు మే 10న మొదలుకాగా అందుకు నేపథ్య కారణాలను క్లుప్తంగా చెప్పాలంటే, ఏప్రిల్ 13న పాలస్తీనియన్లు జెరూసలేంలోని ఆల్ అక్సా మసీదులో రంజాన్ పండుగ తొలిరోజు ప్రార్థనలు జరపనుండగా, ఇజ్రాయెలీ పోలీసులు బూట్లు, ఆయుధాలతో చొరబడి ప్రార్థనల మైకులకు వైర్లు కత్తిరించివేశారు. యువకులు ప్రార్థనల తర్వాత రాత్రంతా గుమిగూడి గడిపే డమాస్కస్ గేట్ ప్లాజా ను మూసివేశారు. ఈ చర్యల పట్ల నిరసన తెలిపిన వారిపై దాడులు జరిపారు. అక్కడి సమీపంలోని షేక్ జరా ప్రాంతం నుంచి పాలస్తీనియన్లను బలవంతంగా వెళ్లగొట్టి యూదులకు అప్పగించే ప్రయత్నాలపై అప్పటికే ఉద్రిక్తతలు సాగుతున్నాయి. ఇదంతా తగదని ఇజ్రాయెలీ ఉదారవాదులు, విదేశ రాయబారులు చె ప్పినా ప్రభుత్వం లెక్కచేయలేదు. ఇతరత్రా పేరుకుపోతున్న సమస్యలు, ఇజ్రాయెల్లో పౌరులు అయిన పాలస్తీనియన్ల అణచివేత వంటివి ఉండనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో రంజాన్ తొలిరోజు నాటి అల్ అక్సా మసీ దు ఘటన నిప్పురవ్వగా మారింది.
టంకశాల అశోక్