ఆరోగ్యమే మహాభాగ్యం లోకోక్తి. ప్రాచీన యుగంలోని చరకుడు ఆయుర్వేదంతో అన్ని రోగాలను నయం చేసేవాడు. ఆధునిక యుగంలో కలరా, మశూచి వ్యాధులను జయించినప్పటికీ, చికున్గున్యా, హెచ్ఐవీ ఎయిడ్స్, జికా, నిఫా, ఎబోలా, స్వైన్ ఫ్లూ, సార్స్, ఎల్లో ఫీవర్, బర్డ్ఫ్లూ లాంటి వైరస్లు అప్పుడప్పుడూ జన నష్టం చేస్తున్నప్పటికీ, ప్రస్తుతం కరోనా వైరస్ ప్రపంచ దేశాలను వణికిస్తున్నది.
విజన్ 2040ను అనుసరించి వైద్య ఆరోగ్యరంగాన్ని విస్తృతం చేసుకోవాల్సిన అవసరం, ఒక బలమైన శక్తిగా ఈ రంగాన్ని అభివృద్ధి చేసుకొని రాబోయే రోజుల్లో కొవిడ్ కన్నా బలమైన వైరస్ ఏది వచ్చినప్పటికీ దీటుగా ఎదుర్కొనే విధంగా ప్రణాళికలు చేసుకోవాలి.
కరోనా నివారణ కోసం భారత్లో కొవాక్సిన్ , కోవిషీల్డ్, అమెరికాలో మొడెర్నా, ఫైజర్, రష్యాలో స్పుత్నిక్, చైనాలో సినోఫామ్, బ్రిటన్లో ఆస్ట్రోజెన్కా టీకాలు వచ్చాయి. డీఆర్డీఓతో పాటుగా ఇంకా పలు సంస్థలు కరోనా నివారణ కోసం కనిపెట్టిన మందుల ట్రయల్ రన్స్ జరుగుతున్నాయి. బ్రిటన్, ఆస్ట్రేలియా లాంటి కొన్ని దేశాలు తాము కొవిడ్ను సమర్థంగా ఎదుర్కొన్నామని, తమ దేశంలో ప్రస్తుతం కరోనా కేసులు లేవని చెప్తున్నాయి. కానీ, భారత్లో జనవరి 16 నుంచి మొదలైన టీకా కార్యక్రమం ఐదు నెలలు గడిచినా ఇంకా 20 శాతం కూడా పూర్తికాలేదు. దీనికి కారణం కేంద్ర ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలను కూడా తికమకపెట్టే విధంగా కేంద్రం రోజుకొక కొత్త ప్రకటన విడుదల చేయడం.
ప్రజల ఆరోగ్యం ప్రభుత్వ బాధ్యత. రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కుల్లో ప్రజలకు విద్యా హక్కుతో పాటుగా ఆరోగ్య హక్కు కూడా ప్రసాదించింది. ఆర్టికల్ 38, 45 ప్రజల ఆరోగ్యానికి సంబంధించిన విషయాలను తెలియచేస్తుంది. ‘రైట్ టు హెల్త్’ ప్రజల హక్కు. ప్రజల ఆరోగ్య పరిరక్షణకు నాటి నిజాం కట్టించిన పెద్ద పెద్ద దవాఖానలను ఉదాహరణగా తీసుకుంటే, 1888లో ప్రభుత్వ టీబీ చెస్ట్ దవాఖాన, 1910లో ఉస్మానియా జనరల్ దవాఖాన, 1938లో చార్మినార్ యునాని దవాఖానతో పాటుగా గాంధీ దవాఖానలు ప్రజలకు ఇప్పటికీ సేవలందిస్తున్నాయి. స్వాతంత్య్రం వచ్చిన కొత్తలో భారత ప్రభు త్వం వైద్యారోగ్య ప్రాముఖ్యాన్ని గుర్తించి 1950 దశకం నుంచి పెద్ద ఎత్తున చర్యలను తీసుకున్నది. ఢిల్లీలో ‘ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్’ (ఎయి మ్స్)ను నిర్మించింది. దేశంలోని ప్రతి జిల్లా, తాలూకా కేంద్రాల్లో ప్రభుత్వ దవాఖానలను నెలకొల్పింది. ధనికులు, పేదలు తేడా లేకుండా ప్రజలు ఈ దవాఖానల ద్వారా ఆరోగ్య సేవలను అందుకున్నారు. 1970 దశకం నుంచి ఆరోగ్యం ప్రైవేటుపరమైంది. సూపర్ స్పెషాలిటీ పేరుతో ఢిల్లీ నుంచి గల్లీ దాకా ప్రైవేటు దవాఖానలు విచ్చలవిడిగా ఏర్పాటయ్యాయి. ప్రభుత్వంలో ఉన్న ఐడీపీఎల్ లాంటి గొప్ప ఔషధ సంస్థలు మాయమయ్యాయి. కానీ, రోజులన్నీ ఎపుడూ ఒకేవిధంగా ఉండవని కరోనా వైరస్ నిరూపించింది. ఈ రోజు కూడా గాంధీ, కింగ్ కోఠి, గచ్చిబౌలిలోని టిమ్స్ ప్రభుత్వ దవాఖానల్లో అద్భుతమైన వైద్య సేవలందుతున్నాయి.
కరోనా కొంతకాలం తర్వాత తగ్గిపోతుంది. కానీ, కరోనా స్థానంలో ఇంతకన్నా మరొక పెద్ద ఉపద్రవం రాదనే గ్యారంటీ లేదు. దేశాల ఆర్థికవ్యవస్థలు కుప్పకూలాలంటే యుద్ధాలు, రాకెట్లు, బాంబులు కాదు, జీవ వైరుధ్య వైరస్లు సృష్టించే పరిశోధనలు పలుదేశాలు చేస్తున్నాయి. కరోనా వైరస్ కూడా అలాంటి సృష్టి అనేది పలువురి అభిప్రాయం. అయితే, గత కొంతకాలంగా మనుషులు కరోనాతో కాకుం డా ఆక్సిజన్ అందక మరణిస్తున్న సంఘటనలు కలవరపెడుతున్నాయి. ఆక్సిజన్ సిలిండర్లు లేక కొందరు, వెంటిలేటర్లు అందక మరికొందరు, మందులు, సూదులు అందక మరికొంత మంది మరణిస్తున్నారు. దవాఖానల్లో తగినన్ని మంచాలు లేపోవడం, డాక్టర్ల సంఖ్య తక్కువగా ఉండటం కూడా ప్రభుత్వ దవాఖానల పనితీరు విమర్శల పాలవుతున్నది. పలు దవాఖానల్లో ఒక్కసారిగా మంటలు కూడా అంటుకొని రోగులు మంచం మీదనే మరణిస్తున్నారు. ఇవన్నీ కూడా ఎక్కువగా ప్రభుత్వ దవాఖానల్లోనే జరుగుతున్నాయి.
వీటికోసం ఒక జాతీయ ఆరోగ్య విధానం అవసరం. రాజ్యాంగంలో అత్యవసర పరిస్థితులను మూడు రకాలుగా విభజించారు. జాతీయస్థాయిలో ఏర్పడిన అనిశ్చితి, రాష్ర్టాల్లో ఏర్పడిన అనిశ్చితి, ఆర్థికపరమైన అనిశ్చితిల గురించి వివరించారు కానీ, ఆరోగ్య అత్యవసర పరిస్థితిని కూడా చేర్చాల్సిన అవసరం ఉన్నది. 130 కోట్ల మంది ప్రజలున్న భారత దేశం కరోనా మహమ్మారితో బాధపడుతున్నది. ప్రపంచ ఆరోగ్య సంస్థ మార్గదర్శకాలకు అనుగుణంగా అరుదైన వ్యాధులపై జాతీయ విధానం రూపొందించాల్సిన అవస రం ఉన్నది. ప్రస్తుతం ఎదుర్కొంటున్న కరోనా వ్యాధిపై బ్రిటిష్ కాలంలో చేసిన చట్టాన్ని ఎపిడమిక్ డిసీజెస్ చట్టం- 1896, డిసాస్టర్ మేనేజ్మెంట్ చట్టం- 2005లను మాత్రమే వాడుతున్నాం. కాబట్టి భవిష్యత్తులో కూడా కరోనా లాంటి ఉపద్రవాలు సంభవిస్తే ఎదుర్కోవడానికి వీలుగా ఒక సమగ్ర ప్రణాళిక, జాతీయ ఆరోగ్య విధానం అవసరం. ప్రజలకు ఆరోగ్య బీమా కూడా అవసరం.
ప్రభుత్వరంగంలో డాక్టర్లు, ఫార్మా రంగం మరింతగా పెంచాల్సిన అవసరం ఉన్నది. మెడికల్ సంబంధిత పరికరాల సంస్థలను ప్రోత్సహించాల్సిన అవసరం కూడా ఉన్నది. తెలంగాణలో మెడికల్ డివైసెస్ పార్క్ను ఏర్పాటుచేయడం హర్షణీయం. మెడిటెక్ సంస్థ హైదరాబాద్లో పెట్టుబడులు పెట్టడానికి ముందుకువచ్చింది. లైఫ్ సైన్సెస్, మైక్రో బయాలజీ రంగాల్లో కూడా విద్యార్థులను ప్రోత్సహించాల్సిన అవసరం ఉన్నది. విజన్ 2040ను అనుసరించి వైద్య ఆరోగ్యరంగాన్ని విస్తృతం చేసుకోవాల్సిన అవసరం, ఒక బలమైన శక్తిగా ఈ రంగాన్ని అభివృద్ధి చేసుకొని రాబోయే రోజుల్లో కొవి డ్ కన్నా బలమైన వైరస్ ఏది వచ్చినప్పటికీ దీటుగా ఎదుర్కొనే విధంగా ప్రణాళికలు చేసుకోవాలి. ఏటా లక్షల కోట్ల బడ్జెట్ ప్రతిపాదిస్తున్న ప్రభుత్వాలు ప్రతి జిల్లా కేంద్రాల్లోనూ, నగరాల్లోనూ అన్ని వసతులతో కూడిన ప్రభుత్వ దవాఖానలు ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం కింద నిర్మించాల్సిన అవసరం ఉన్నది.
కన్నోజు మనోహరాచారి