భూ కబ్జా ఆరోపణలతో రాష్ట్ర మంత్రివర్గం నుంచి బర్తరఫ్కు గురైన మాజీ మంత్రి ఈటల రాజేందర్ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసే విషయంలో వెనుకంజ వేస్తున్నారు. అధికారపక్షం నుంచి, మరీ ముఖ్యంగా తన అనుచర వర్గం నుంచీ తీవ్ర ఒత్తిడి ఉన్నప్పటికీ రాజీనామా విషయంలో ముందుకు కదలకపోవడానికి ముఖ్య కారణం ఓటమి భయమే. ఈటల లౌక్యం తెలిసిన మనిషి. ఈ విషయాన్ని ఆయనే పలు సందర్భాల్లో చెప్పుకొన్నారు. చుట్టుముట్టిన సమస్యలతో ఉక్కిరిబిక్కిరవుతున్న ఆయన ఎవరో ఒత్తిడి తెస్తున్నారని పరువు ప్రతిష్ఠలకు పోయి మరింత అగాథంలోకి కూరుకుపోవడానికి సిద్ధంగా లేరు.
అయినా.. అన్ని వనరులతో ఉన్న అధికారపార్టీని తట్టుకొని హుజురాబాద్లో సొంతంగా గెలవడం ఈటలకు సాధ్యమయ్యే పనా? అన్నది ప్రశ్న. అధికార టీఆర్ఎస్ పార్టీని ఓడించడమే లక్ష్యంగా ఉన్న కాంగ్రెస్, బీజేపీలు తమ పార్టీల నుంచి అభ్యర్థులను పోటీ పెట్టకుండా స్వతంత్ర అభ్యర్థిగా ఈటల బరిలోకి దిగితే మద్దతు ఇస్తాయా? బీజేపీకి పెద్దగా పునాది లేదు. కాంగ్రెస్ అభ్యర్థి లేకపోతే ఆ ఓట్లు ఈటలకు బదిలీ అవుతాయనే నమ్మకమూ లేదు.
తప్పని తెలిసినా తక్కువ ధరకు వస్తున్నాయని అసైన్డ్, దేవాలయ భూములను ఈటల తన పేరు మీద, కుటుంబసభ్యుల పేరు మీద కొనుగోలు చేశారు. అచ్చంపేట ఏరియాలోనైతే రెండు మూడేండ్ల కిందట ఒక్కో ఎకరానికి రైతుల నుంచి కేవలం రూ.60- 70 వేలు చెల్లించి కొనుగోలు చేశారు. ఎక్కడా లక్షన్నరకు మించలేదు. ఆ డబ్బులు కూడా వారికి ఒకేసారి చెల్లించలేదు. పెండింగ్లో ఉన్న చిన్నమొత్తాల కోసం రైతు లు ఇప్పటికీ శామీర్పేటలోని ఆయన ఇంటిచుట్టూ తిరుగుతూనే ఉన్నారు. అసైన్డ్ భూములు కొనుగోలు చేయడమే నేరం అంటే.. వాటి సమీపంలో ఉన్న మరిన్ని ప్రభుత్వ భూములను కబ్జా చేసినట్టు అధికారుల విచారణలో వెల్లడైంది. ఈ మోసం ఇక్కడితోనే ఆగిపోలేదు. అవే భూముల్ని జాతీయ బ్యాంకుల్లో తనఖా పెట్టి వంద కోట్ల వరకూ రుణా లు కూడా తీసుకున్నారు. అయినా నేను సరైనదే చేశానంటూ సమర్థించుకుంటున్నారు.
మంత్రివర్గం నుంచి బర్తరఫ్ అయిన ఈటల పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తాడని టీఆర్ఎస్ అంచనా వేసింది. ఆ పార్టీ క్యాడర్ ఆయన్ని అలాగే రెచ్చగొట్టింది. ఆయన్ని సమర్థించే అనుచరులు సైతం ఇదే విషయమై ఈటలపై ఒత్తిడి తెచ్చారు. కొత్త పార్టీ పెట్టబోతున్నాడని మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. కానీ ఈ విషయంలో ఆయన ఎక్కడా ముందడుగు వేయలేదు. ఇప్పటికీ ఎలాంటి సంకేతాలూ ఇవ్వలేదు. పార్టీ పెట్టడం అంటే ఆషామాషీ కాదు. నిజానికి మంత్రివర్గం నుంచి బర్తరఫ్ కావడానికి ముందువరకూ ఆయన ఆర్థిక పరిస్థితి బాగానే ఉంది. వందల ఎకరాల భూములు, బ్యాంకుల నుంచి రుణాల రూపంలో వచ్చిన కోట్లాది రూపాయలు ఆయన చేతిలో ఉండేవి. అవసరమైతే టీఆర్ఎస్ పార్టీ నుంచి వేరుపడి సొంత పార్టీ పెట్టడానికి కూడా ఆయన పావులు కదిపారు. ఈటల తన నియోజకవర్గానికి వెళ్లినప్పుడల్లా పరోక్షంగా పార్టీ అధినేతను, ప్రభుత్వ పథకాలను విమర్శిస్తూ వచ్చారు.
ఈటల నుంచి ముఖ్యమంత్రి ఆరోగ్యశాఖను తప్పించిన తర్వాత ఆయన తనకు తాను క్యాబినెట్ నుంచి తప్పుకొంటాడనే అభిప్రాయం కలిగింది. కానీ ఈటల ఆ పని చేయలేదు. ముఖ్యమంత్రి ఆయనను మంత్రివర్గం నుంచి తొలగించిన తర్వాత, ఇప్పుడైనా పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తాడని అంచనా వేస్తున్నారు. ఈలోగా టీఆర్ఎస్ నాయకత్వం హుజురాబాద్ నియోజకవర్గాన్ని పూర్తిగా తమ గుప్పిట్లోకి తీసుకునే చర్యలు మొదలుపెట్టింది. రాజేందర్ను ఆయన నియోజకవర్గంలోనే ఒంటరిని చేసింది. ఉపఎన్నిక ఎప్పుడు వచ్చినా ఈటల రాజేందర్ను ఓడించడానికి తగిన వ్యూహాన్ని రూపొందించే బాధ్యతను మంత్రులు హరీష్రావు, గంగుల కమలాకర్లకు పార్టీ నాయకత్వం అప్పగించింది.
ఒకవైపు హుజురాబాద్ ఉప ఎన్నికల్లో జెండా ఎగరేయడమే లక్ష్యంగా టీఆర్ఎస్ పార్టీ పావులు కదుపుతుంటే, ఎటూ తేల్చుకోలేని స్థితిలో ఈటల కొట్టుమిట్టాడుతున్నారు. ఈటలకు పూర్వమే హుజురాబాద్లో టీఆర్ఎస్ పార్టీ బలంగా ఉంది. అక్కడ ఎమ్మెల్యే సీటును గెలిచిన చరిత్ర కూడా ఉంది. నియోజకవర్గాల పునర్విభజనలో కమలాపురం స్థానం రద్దుకావడంతో కేసీఆరే ఈటలను ఇక్కడ కూర్చోబెట్టారు. అంతేకానీ ఈటలతోనే అక్కడ పార్టీ నిర్మాణం జరగలేదు.
ప్రతిపక్షపార్టీల నేతలు ఆశపడుతున్నారే గానీ ఈటల బీజేపీలోకి వెళ్లే అవకాశం లేదు. కారణం ఈయన మొదట్లో వామపక్ష ఉద్యమసంస్థల్లో పనిచేసిన వ్యక్తి. సహజంగానే ఇలాంటివారు బీజేపీలో కలిసిపోవడానికి ఇబ్బంది పడతారు. దీనికితోడు ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ, నాగార్జునసాగర్ ఎన్నికల్లో ఆ పార్టీ ఎలాంటి ప్రభావం చూపలేకపోయింది. ఈటల అమాయకుడేమీ కాదు. రానున్న రోజుల్లో బీజేపీ ఏదో అద్భుతం సృష్టిస్తుందని ఈటల భావించడం లేదు. ఇకపోతే రాష్ట్రంలో కాంగ్రెస్కు నాయకత్వం లేదు. ఈ పార్టీకి ప్రజలు ఓట్లేయడం క్రమంగా మరిచిపోతున్నారు.
ఈటలకు భవిష్యత్తు కనిపించడం లేదు. కాబట్టి ఆయన ఏ పార్టీకి వెళ్లే అవకాశం లేదు. సొంత పార్టీ పెడదామనుకుంటే తగినంత ధనబలం లేదు. ఉన్న ఆస్తులు విచారణ సంస్థల చేతుల్లోకి వెళ్లాయి. ఇప్పటికే తీసుకున్న బ్యాంకుల అప్పులు మెడ మీద వేలాడుతున్నాయి. అయినా సొంత పార్టీ పెట్టేముందు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి అదే స్థానంలో ఒకసారి గెలిచి చూపించాలి.
ఈటల ఇప్పటికీ తన గెలుపుపై అపనమ్మకంతో ఉన్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో అక్కడ గెలుపు అంత సులభం కాదని ఆయన భావిస్తున్నారు. సాధారణంగా ఉప ఎన్నికల ఫలితాలు ఎక్కువగా ఎక్కడైనా అధికారపార్టీకే మొగ్గుచూపిస్తాయి. అందుకే ఉప ఎన్నికను నివారించాలని అనుకుంటున్నారు. మంత్రి పదవి లేకపోయినా పార్టీలో కొనసాగితే చాలనుకుంటున్నారు. ఏదేమైనా తనకు తాను చేసుకున్న తప్పిదాలతో ఈటల రాజకీయ భవితవ్యం అర్థంకాని పద్మవ్యూహంలో చిక్కుకున్నదనటంలో ఏ మాత్రం సందేహం లేదు.
(వ్యాసకర్త సీనియర్ జర్నలిస్టు)
శ్రీనివాస్ గౌడ్ ముద్దం