మనుషులకు కొదవ లేదు.. కానీ మానవత్వమే కనిపించట్లేదు. చదువులకు కొదువ లేదు, జ్ఞానమే కనిపించట్లేదు. కరోనా విపత్కర పరిస్థితుల్లో ఒకరికొకరు తోడుగా నిలవాల్సిన ప్రజలు స్వార్థపరులు, స్వార్థపౌరులు అవుతున్నారు. మూడున్నర వేల ఎమ్మార్పీ ఉన్న ‘రెమిడెసివర్’ను రూ. 30 వేలకు నల్లబజారులో అమ్ముతున్నారు. నిర్దిష్టమైన మందు, చికిత్సా విధానమే లేని కరోనా వైద్యానికి కార్పోరేట్లు వేసే ఐసీయూ బిల్లులు అంతరిక్ష దర్శనం చేస్తున్నాయి. సగటున రోజుకి రూ. 60వేల నుంచి రెండు లక్షల రుసుములు వసూలు చేస్తున్న వైద్య నారాయణులున్నారు. కోర్టు వ్యాజ్యాల్లో ఓడినవాడు రోడ్డు మీద ఏడిస్తే, గెలిచిన వాడు ఇంటికొచ్చి ఏడిచాడన్న చందంగా, ఇంటెన్సివ్ కేర్లో కరోనాను గెలిచిన సామాన్యుడు పోయే ప్రాణాలు దక్కాయని సంతోషించాలో, ఉన్న ఆస్తులు పోయి రోడ్డు మీదకొచ్చినందుకు ఏడవాలో అర్థంకాని పరిస్థితి.
అవకాశం వచ్చింది కదా అని అడ్డగోలు అద్దెలు వసూలు చేస్తున్న అంబులెన్సు డ్రైవర్లు, కరోనా రోగిని ఒక దోషిగా, నేరస్తుడిగా చూసే సాటి మనుషులు, కరోనా పీడిత కుటుంబాలను సామాజిక బహిష్కరణకు గురి చేస్తున్న ఇరుగు పొరుగు వారిలో మానవత్వం కనుమరుగైంది. అమ్మ నాన్నలను కోల్పోయి అనాథలైన వారిని ఆదుకోని బంధువులు, వలస జీవులకు, రోజుకూలీలకు పట్టెడన్నం పెట్టని నిర్దయులు తయారయ్యారు.
పుస్తెలమ్ముకుని ముప్పై వేలకి కొన్న రెమిడెసివర్ అసలు మందే కాదు పొమ్మంది డబ్ల్యూహెచ్వో. నిన్నటి వరకు ప్లాస్మా దాతల కోసం పరితపించిన ప్రజలు ప్లాస్మాథెరపీ పనే చేయదని చల్లగా తేల్చేశారు. వ్యాధి చివరి దశలో కళ్లెం వేయలేని కరోనాని తొలి దశలో గుర్తిస్తే మాత్రం తప్పక ప్రాణాలు కాపాడవచ్చన్న నిపుణుల భరోసాతో తక్షణం వైవిధ్య ప్రజాచైతన్య కార్యక్రమాల్ని రూపొందించుకుని ప్రజలకి మరింత అవగాహన కల్పించాలి. అమ్మ నాన్నలను, అయినవాళ్లను కోల్పో యి అనాథలయిన వారు రాష్ట్రంలో వేలల్లో ఉన్నారు. వారిని ఆదుకోవాలి.
యూకే స్ట్రెయిన్, సింగపూర్ స్ట్రెయిన్, సౌత్ ఆఫ్రికా స్ట్రెయిన్, బ్రెజిల్ స్ట్రెయిన్, డబుల్ మ్యూటెంట్ స్ట్రెయిన్ వంటి వైవిధ్య ఉత్పరివర్తనాలతో వైరస్ విరుచుకుపడుతుందేమో అనుకుంటున్న థర్డ్ వేవ్ను నిర్వీర్యం చేయడానికి బహుముఖ వ్యూహ రచన జరగాలి. వైరస్ ఏరోసాల్ రూపంలో గాలిలో వ్యాపిస్తుందన్న అనుమానాలున్నాయి. అందుబాటులో ఉన్న ఏ వ్యాక్సిన్ నూటికి నూరు పాళ్ళు రక్షణ కల్పించలేదనే వాదనలు రాబోయే ప్రమాద తీవ్రతను సూచిస్తున్నాయి. కనుక వైరస్ వ్యాప్తికి కారణమయ్యే దేశ, రాష్ట్ర సరిహద్దుల్ని, కంటైన్మెంట్ జోన్లను కట్టడి చేయాలి. దేశీయంగా ఉత్పత్తి చేయగలిగే స్వీయ పరీక్షా పరికరాల తయారీకి, వెంటిలేటర్ల తయారీకి కేంద్రం తక్షణమే ఆర్థిక సహాయం అందించాలి.
రాజకీయ పార్టీలు ఒకరినొకరు నిందించుకోవడం పరిపాటిగా, ఒక అలవాటుగా మారింది. ప్రభుత్వాలు, ప్రజలు పరస్పరం నిందించుకునే బ్లేమింగ్ కల్చర్కి ముగింపు పలకాలి. ప్రజలు ప్రభుత్వం పర్యాయ పదాలన్న విషయం అర్థం చేసుకోవాలి. ఒకరినొకరు అంగీకరించే సహన, సహకార సంస్కృతికి ఆహ్వానం పలకాలి. పార్టీలు, ప్రాంతాలకతీతంగా ప్రతి పౌరుడు కరోనా యోధుడు కావాలి.
వ్యాసకర్త తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం
–కనకశ్రీ విజయ్ రఘునందన్