జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం అమలులోకి వచ్చాక ఆ పథకాన్ని దేశంలో మొదట 200 జిల్లాల్లోనే అమలుచేశారు. ఆ తర్వాత వంద శాతం పట్టణ జనాభా ఉన్న ప్రాంతాలను మినహాయించి మిగతా ప్రాంతాన్ని ఈ పథకం పరిధిలోకి తెచ్చారు. గ్రామీణ ప్రాంతాల్లో నైపుణ్యం లేని కార్మికులకు పనిలేని సమయాల్లో ఉపాధి కోసం పని కల్పించడం చట్టబద్ధమైన హక్కుగా ఈ చట్టం ద్వారా గుర్తించారు.
రాష్ట్రం ఏర్పడిన తర్వాత పల్లెలను పట్టణాలతో సమానంగా అభివృద్ధి చేయాలనే సంకల్పంతో ‘పల్లె ప్రగతి’ కార్యక్రమం చేపట్టారు. దీనిలో భాగంగా ‘మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం’ ద్వారా పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్రతి ఇంటికి బాత్రూములు, ఇంకుడు గుంతల నిర్మాణం చేపడుతున్నారు. ఇండ్లలోని చెత్తను డంపింగ్యార్డుకు చేర్చి తడి, పొడి చెత్తను వేరు చేసే కం పోస్ట్ షెడ్డు ఏర్పాటు చేస్తున్నారు. ప్రతి గ్రామంలో వైకుంఠధామం నిర్మాణాలు చేపడుతూ ఉపాధిహామీ నిధుల ద్వారా వాటి నిర్మాణాలు పూర్తిచేస్తున్నారు. ప్రతి గ్రామం లో నర్సరీలను ఏర్పాటుచేస్తున్నారు. గ్రామీణ జనాభాకు అనుగుణంగా ప్రభుత్వం ‘హరితహారం’లో భాగంగా మొక్కలు నాటుతూ సంరక్షించే ఏర్పాటు చేసింది. పంచాయతీ కార్యదర్శులకు ఉపాధి హామీ బాధ్యతలను అప్పగించారు. ఈ మధ్యనే కేంద్ర ప్రభు త్వం ప్రకటించిన దీన్ దయాల్ ఉపాధ్యాయ పంచాయతీ స్వశక్తీకరణ పురస్కారాలలో మన రాష్ర్టానికి 12 అవార్డు లు దక్కడం వెనుక పంచాయతీ కార్యదర్శుల కృషి ఉన్నది.
గత ఆర్థిక సంవత్సరంలో రికార్డు స్థాయిలో 387.66 కోట్ల పనిదినాల ద్వారా ఉపాధి కల్పించారు. దీంతో 11.5 కోట్ల మందికి పైగా గ్రామీణ పేదలకు ఉపాధి లభించింది. కరోనా లాక్డౌన్తో గ్రామీణ ప్రాంతాలకు తిరిగివచ్చిన వలస కార్మికులకు ఉపాధి నిధులను పెంచి ‘గరీబ్ కల్యాణ్ యోజన’ అనే పథకాన్ని సృష్టించడం మేలైంది. దీనివల్ల పేదవారికి ముఖ్యంగా వలస కార్మికులకు ఉపాధి లభించింది. కరోనా సంక్షోభంలో గ్రామీణులకు, వలస కార్మికులకు జీవనోపాధి కల్పించి ఆదుకున్నది ఈ మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకమే.
ఈ పథకం అమలులో అనేక సమస్యలు వెంటాడుతున్నాయి. ముఖ్యంగా కేంద్రం నుంచి నిధులు ఆలస్యంగా రావడం వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ నిధులను కొన్ని రాష్ర్టాలు వాడుకోలేకపోతున్నాయి. కొన్ని రాష్ర్టాలేమో ఎక్కువ నిధులు అడుగుతున్నాయి. వేతనాల చెల్లింపులో లింగ అసమానతలు, నాణ్యమైన పనులు చేయలేకపోవడం, నిరుద్యోగ భృతిని అమలు చేయకపోవడం, శిక్షణ ఉన్న మానవ వనరులను వినియోగించకపోవడం వల్ల సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. గ్రామసభల ఆధారంగా సోషల్ ఆడిట్ను సరిగా నిర్వహించకపోవడం వల్ల ఈ పథకానికి తూట్లు పడుతున్నాయి.
గ్రామీణ పేదలకు కల్పతరువు లాంటి ఈ పథకానికి ఇంకా ఎక్కువ నిధులను కేటాయించాలి. అలాగే ఉపాధి చట్టం-2005లోని అన్ని అంశాలను పకడ్బందీగా అమ లుపరచాలి. గ్రామీణ అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా నాణ్యమైన, అవసరమైన పనులను చేస్తూ పారదర్శకతను పాటించాలి. ఉపాధి హామీ నిధులను గ్రామీణ ప్రాం తాల్లో జరిగే ఇతర అభివృద్ధి కార్యక్రమాలకు కూడా మళ్లించాలి. గ్రామసభలను బలోపేతం చేస్తూ టెక్నాలజీ వాడకాన్ని పెంచాలి. వ్యవసాయాన్ని ఈ పథకంతో అనుసంధానం చేస్తే రైతులకూ ఎంతో ఉపయోగకరంగా, లాభదాయకంగా ఉంటుంది.
ఆర్.భాస్కర్ రెడ్డి