90వ దశకం మొదట్లో మన దేశం విదేశీ చెల్లింపుల అసమతులనానికి గురైంది. ఆర్థికవ్యవస్థను గాడిలో పెట్టాలంటే, అంతవరకున్న ఆర్థిక నమూనాను సమూలంగా మార్చాలని ప్రభుత్వం తలచింది. ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు ఆర్థికరంగాన్ని మార్కెట్ శక్తులకు అంటే.. ప్రైవేటు పెట్టుబడికి అనుకూలంగా మార్చడంలో పోటీపడ్డాయి. ‘ప్రభుత్వరంగం’ అనే మాటనే అసమర్థతకు చిహ్నం అనీ, ‘సామర్థ్యానికి, మెరుగైన పనితీరుకు ప్రైవేటు రంగం చిరునామా’ అని నమ్మే నయా ఉదారవాద రాజకీయ, ఆర్థిక సిద్ధాంతాన్ని అమల్లోకి తేవడం గత మూడు దశాబ్దాలుగా కేంద్ర ప్రభుత్వాలు పనిగా పెట్టుకున్నాయి.
ఈ మూడు దశాబ్దాల కాలంలో ప్రభు త్వ ఆర్థిక (పబ్లిక్ ఫైనాన్స్) రంగంలో అనేక మార్పులు చోటు చేసుకున్నాయి. పన్నుల సంస్కరణలు చేపట్టడం ద్వారా (ఆర్థిక సంస్కరణల ముందటికాలంతో పోలిస్తే) పన్నుల జాతీయ నిష్పత్తిలో పెరుగుదల కనిపించింది. జాతీయోత్పత్తిలో పన్నుల ద్వారా రాబడి సగటున 11 శాతానికి చేరుకున్నది. ఆర్థిక సంస్కరణలకు ముందు ఈ నిష్పత్తి సగటున 9 శాతమే ఉండేది. అయి తే ఇది మాత్రమే దేశ బడ్జెట్ అవసరాలను తీర్చలేదు. కనుక క్రమేణా ప్రభుత్వం అనేక ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేటుకు అప్ప జెప్పింది. ఈ క్రమంలోనే ప్రభుత్వరంగం నుంచి పెట్టుబడుల ఉపసంహరణకు కేంద్ర ప్రభుత్వం ఒక మంత్రిత్వశాఖనే ఏర్పాటుచేసింది!
‘దీపం’-మానిటైజేషన్ (నగదీకరణ): ప్రస్తుతం కేంద్ర ఆర్థికమంత్రిత్వ శాఖలో ‘డిపార్ట్మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ పబ్లిక్ అసెట్ మేనేజ్మెంట్ (డీ.ఐ.పీ.ఎ.యమ్- దీపం) అనే శాఖ పని చేస్తున్నది. ఈ శాఖ 1.కేంద్ర ప్రభుత్వరంగ సంస్థల్లో పెట్టుబడు లను ఉపసంహరించటం, ప్రైవేటుపరం చేయడం, 2.ప్రభుత్వ వాటాల్లో కొంతభాగాన్ని అమ్మడం, 3.ప్రభుత్వ ఆస్తులను సమర్థంగా వాడి ఆర్థికవనరులు రాబట్టడం (మానిటైజేషన్ ఆఫ్ అసెట్స్), 4.ప్రభుత్వ పెట్టుబడుల నిర్వహణ అంటే.. లాభసాటిగా లేని వాటినుంచి పెట్టుబడులు ఉపసంహరించటం.. అనే నాలుగు పనులు చేస్తున్నది. 2019 నుంచి మన సర్కారు ఈ ‘అసెట్ మానిటైజేషన్’ పనిలో ఉన్నది. ఏతా వాతా విషయం ఏమంటే.. వాణిజ్య వ్యవహారాల నుంచి ప్రభుత్వం వీలున్నంత మేర పక్కకు తొలగిపోతున్నది. లాభాలు తేని ప్రభుత్వ ఆస్తులను వ్యాపార వర్గాలకు అప్పచెప్పి ఆర్థిక వనరులను సమకూర్చుకోవాలన్న కోరిక నిన్న మొన్న వచ్చిన ఆలోచ న కాదు. ఇది ఆర్థిక సరళీకరణ విధానాల్లో మరొక రూపం మాత్రమే. ‘అసెట్ మానిటైజేషన్’అంటే.. ఆస్తులను సాంకేతికంగా అమ్మడం కాదు, కానీ ప్రభుత్వ ఆస్తులను ప్రైవేటు వారు ఒక కాలపరిమితికి లోబడి వాడుకుంటారు. దానికి మొదటగా ప్రభుత్వానికి చెల్లింపులు చేస్తారు. ప్రభుత్వం దగ్గ ర ఉన్న ఆయిల్ పైప్లైన్లను, టెలీ కమ్యూనికేషన్ టవర్లనూ ప్రైవేటు చమురు సంస్థల కు, ప్రైవేటు టెలికం సంస్థలకు కొంతకాలం ఒకేసారి ముందస్తు చెల్లింపు చేసి వాడుకునే అవకాశాన్ని ఇస్తారు. కొంత జాగ్రత్తగా గమనిస్తే ఈ అసెట్ మానిటైజేషన్ కార్యక్రమం అంటే.. ప్రభుత్వ ఆధీనంలో ఉన్న అనేక కీలక మౌలిక వనరులను ఒక కాలపరిధి విధిం చి ప్రైవేటు వారికి అప్పజెప్పడమే.
మానిటైజేషన్ పైప్లైన్: నీతి ఆయోగ్ సూచనల మేరకు 2021 ఆగస్టులో కేంద్ర ప్రభుత్వం ఈ కార్యక్రమానికి పూనుకున్నది. నేషనల్ మానిటైజేషన్ పైప్లైన్ ద్వారా వచ్చే నాలుగు ఆర్థిక సంవత్సరాల్లో, ప్రభుత్వ ఆస్తులను ప్రైవేటుకు 25 ఏండ్ల దాకా అప్పజెప్పి ఆరు లక్షల కోట్ల ఆదాయా న్ని గడించాలని లక్ష్యంగా పెటుకున్నది. ఇది ప్రస్తుత కేంద్ర బడ్జెట్ 30 లక్షల కోట్లలో 5వ వంతు. రహదారులు, రైల్వేలు, విద్యుత్ సరఫరా-ఉత్పత్తి, టెలీ కమ్యూనికేషన్, ఓడ రేవులు, విమానయానరంగం, గిడ్డంగులు వంటి మౌలిక సేవారంగాల్లో ఉన్న ఆస్తుల ను అప్పగిస్తున్నారు.సూత్రప్రాయంగా ఉపయోగంలో లేని ఆస్తులను అప్పజెప్పి రాబ డి పెంచుకొని, దాన్ని మరో రీతిలో పెట్టుబడిగా పెట్టాలనే ఆలోచన బాగుంది. కానీ అది వాస్తవంలో అనేక చిక్కులున్నాయి.
దేశ ఆర్థిక పురోగతి గత ఐదేండ్లలో మందగించింది. 2016 3వ త్రైమాసికంలో 9.6 శాతం ఆర్థికవృద్ధి సాధింస్తే, 2020 చివరి త్రైమాసికంలో అది 5.7 శాతంగా ఉన్నది. ఈ స్థితిలో ఆర్థిక వనరులను సమకూర్చుకునేందుకు ప్రభుత్వం ఈ పథకాన్ని ముందుకుతెస్తున్నది. అయితే ఇది నిజంగానే అన్ని లక్షల కోట్ల ఆ దాయాన్ని తెస్తుందా అన్నది అనుమానమే.
తాజాగా కేంద్రం ఈశాన్య భారతానికి విద్యుత్తును సరఫరా చేస్తున్న ఎన్టీపీసీని కూడా ప్రైవేటుపరం చేయటానికి సిద్ధమైం ది. పూర్తి ప్రభుత్వ ఆధీనంలో ఉన్న నార్త్ఈస్ట్రన్ విద్యుత్ పవర్ కార్పొరేషన్ (ఎన్ఈఈపీసీఓ)తో పాటు ఎన్టీపీసీ విద్యుత్ వ్యాపార నిగమ్, ఎన్ఆర్ఈఎల్ లను కూడా పందే రం చేస్తున్నది. ఎన్టీపీసీలోని వందశాతం వాటాలను 15వేల కోట్లకు కట్టబెడుతున్న ది. దీనికంతటికీ పరాకాష్టగా ప్రకృతి సహజ వనరైన భూమిని కూడా ప్రైవేటు పరం చేసేందుకు నేషనల్ ల్యాండ్ మానిటైజేషన్ కార్పొరేషన్ (ఎన్ఎల్ఎంసీ)ని ఏర్పాటు చేసి ప్రభుత్వ భూములను ప్రైవేటుకు అప్పగించేందుకు సమాయత్తమవుతున్నది!
ఉదాహరణకు-100 రూపాయల ఆస్తిని 25 ఏండ్లకు ప్రైవేటుకు అప్పగిస్తే ముందస్తుగా చెల్లించేది 35 రూపాయలే.ఈ ప్రక్రియతో ప్రభుత్వం 6లక్షల కోట్లు సాధిం చాలంటే దానికి మూడు రెట్ల విలువైన ఆస్తులను ఈ బేరానికి పెట్టాల్సి ఉంటుంది. ఈ మానిటైజేషన్ ద్వారా వచ్చే ఆదాయాన్ని దేనికి ఖర్చుచేస్తారన్న విషయం మీద స్పష్టత లేదు. అంతా ప్రైవేటు మయమైన తర్వాత దేశ సమ గ్రత, స్వావలంబన మిగులు తుందా..?
(వ్యాసకర్త: అసిస్టెంట్ ప్రొఫెసర్, నల్సార్ యూనివర్సిటీ ఆఫ్ లా)
హారతి వాగీశన్