ఎన్నికల సందర్భంగా రాజకీయ పార్టీలు పరస్పర విమర్శలకు దిగడం, ఒక్కోసారి విభేదాలు శృతి మించడం సాధారణం. కానీ ఎన్నికలు ముగిసిన తర్వాత ఉద్రిక్తతలు సమసి పోతాయి. హోరాహోరీగా పోరాడిన రాజకీయ ప్రత్యర్థుల మధ్య సౌహార్ద్రపూరిత వాతావరణం నెలకొంటుంది. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉండే సౌందర్యమది. కానీ పశ్చిమ బెంగాల్ పరిస్థితే శాంతి కాముకులకు ఆవేదన కలిగిస్తున్నది. తృణమూల్ కాంగ్రెస్, బీజేపీ మధ్య హింసాయుత ఘర్షణలు చెలరేగుతున్నాయి. తృణమూల్ కాంగ్రెస్సే దాడులు చేస్తున్నదని బీజేపీ నాయకులు ఆరోపిస్తున్నారు. మరోవైపు మమతా బెనర్జీ పట్ల కక్ష సాధింపు చర్యలకు కేంద్రమే దిగుతున్నదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. తాజాగా సీబీఐ దాడులను ఇందుకు ఉదహరిస్తున్నారు. అటు ప్రధాని మోదీ, ఇటు ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఏ మాత్రం దిగిరాకుండా మొండిగా వ్యవహరిస్తున్నట్టే కనిపిస్తున్నది.
2014లో ఒక పాత్రికేయుడు నిర్వహించిన నారదా స్టింగ్ ఆపరేషన్లో తృణమూల్ కాంగ్రెస్కు చెందిన దాదాపు తొమ్మిది మంది నాయకులు ఇరుక్కుపోయారు. అందులో ఇప్పుడు బీజేపీ నేతగా మమతా బెనర్జీకి ఎదురు నిలిచిన సువేందు అధికారి, మరో బీజేపీ ప్రముఖుడు కూడా ఉన్నారు. కానీ ఇద్దరు రాష్ట్ర మంత్రులతో పాటు మమతా బెనర్జీకి చెందిన నలుగురు సన్నిహిత నేతలను సీబీఐ అరెస్టు చేయడం వివాదాస్పదమవుతున్నది. వామపక్షాలు అధికారంలో ఉన్నప్పుడు నాటుకుపోయిన హింసా రాజకీయాలను నిర్మూలించడానికి మమతా బెనర్జీ ప్రయత్నించలేదు. ఇంకా అదే హింసా సంస్కృతి కొనసాగుతున్నది. బీజేపీ జాతీయ నాయకులు కూడా స్థానిక నేతలను ఎగదోస్తున్నారు. కానీ ఈ వైషమ్యాలు రాజకీయ చర్చల వల్ల మాత్రమే సమసిపోతాయి.
ఆటగాళ్ళు కొన్ని నియమాల ప్రకారం తలపడినట్టు రాజకీయ ప్రత్యర్థులు కూడా క్రీడా స్ఫూర్తితో పోటీ పడాలి. రాజకీయ ప్రత్యర్థులను శత్రువులుగా పరిగణించకూడదు. తృతీయ ప్రపంచదేశాలెన్నో సైనిక పాలనలో లేదా జాతుల కలహాలలో కొట్టుమిట్టాడుతున్న వేళ, మన దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థలు స్థిరపడిన తీరుకు గర్విస్తున్నాం. సమాజానికి, దేశానికి దారి చూపిన ఘన చరిత్ర బెంగాల్కు ఉన్నది. అనేక మంది మహామహులు పుట్టిన గడ్డ అది. ఇందిరా గాంధీ హయాంలో పశ్చిమ బెంగాల్లో వామపక్ష ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా సంబంధాలు ఇంతగా దిగజారలేదు. అటువంటిది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కత్తులు దూసుకోవలసినంతటి అవసరం ఏమొచ్చింది? దేశంలో పరిస్థితి కూడా ఏమంత బాగా లేదు. కరోనాను ఎదుర్కొన లేక పశ్చిమబెంగాల్తో సహా దేశమంతా తల్లడిల్లి పోతున్న వేళ ఇది. ఘర్షణ పడటం ఎవరికీ శ్రేయస్కరం కాదు. ఇప్పటికైనా ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సామరస్యంగా ఉండవలసిన అవసరాన్ని గుర్తించాలి. దేశాన్ని పీడిస్తున్న సమస్యలపై కేంద్రం, రాష్ర్టాలు ఉమ్మడిగా పోరాటం చేయాలి.