ప్రపంచ బ్యాంక్ నిర్దేశించిన ప్రాథమిక ఆరోగ్య పరిరక్షణ ప్రతిపాదనలను అమలు చేసే క్రమంలో తెలంగాణ రాష్ట్రం వినూత్న ఒరవడిని సృష్టించింది. కొవిడ్ వంటి వ్యాధుల వ్యాక్సిన్ను డ్రోన్ల ద్వారా సరఫరా చేస్తూ సాంకేతిక అంశాల్లో ముందున్నానని నిరూపించింది.
ప్రాథమిక ఆరోగ్య పరిరక్షణ విషయంలో ప్రపంచ బ్యాంక్ సమీక్షించిన పలు అంశాలను తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే కార్యరూపంలో పెడుతున్నది. ఈ రంగంలో ‘డయాగ్నిస్టిక్ హబ్’ల ఏర్పాటు విశేషమైనది. ఆరోగ్య కేంద్రాలు, క్షేత్రస్థాయి వైద్య ఆరోగ్య కార్యకర్తలను నియోగించి వ్యాక్సినేషన్ను వేగతరం చేసింది. ప్రభుత్వ ఆరోగ్య కేంద్రా ల్లో ఎమర్జెన్సీ వ్యాధి నిర్ధారణ పరీక్షల కోసం సేవలను విస్తరించింది. వీటికి తోడు దవాఖానలు, ఆరోగ్య కేంద్రాల్లో ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తున్నది. తెలంగాణ డయాగ్నస్టిక్ హబ్ సీఎం కేసీఆర్ వినూత్న ఆలోచనలకు దర్పణం. కేసీఆర్ కిట్, అమ్మ ఒడి, ఆరోగ్య లక్ష్మి, గర్భిణులకు 102 సేవలు, అంగన్వాడీ కేంద్రాల ద్వారా ఐరన్తో కూడి పోషకాహారం పంపిణీ వంటి పథకాలను ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టింది. గ్రామీణ సబ్సెంటర్లలో ఇంటింటికీ వ్యాక్సినేషన్ సాగుతున్నది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల స్థాయిలో కూడా ప్రాథమిక ఆరోగ్య హబ్లు రూపుదిద్దుకునేలా కృషి చేస్తున్నది.
ప్రపంచబ్యాంకు తన సమీక్షలో మూడు ప్రాధాన్య సంస్కరణలను వివరించింది. అవి .. ప్రాధాన్య సంస్కరణ1: మల్టీ డిసిప్లినరీ టీమ్ ప్రాతిపదికగా వైద్యఆరోగ్య సేవలు అందించడం. ప్రాథమిక ఆరోగ్యకేంద్రాల వృద్ధిలో మల్టీ డిసిప్లినరీ టీమ్లు కీలక పాత్ర పోషిస్తాయి. ఈ టీమ్కు చెందిన హెల్త్ సర్వీస్ ప్రొవైడర్లు ఒక పీహెచ్సీ హబ్ కేంద్రంగా పనిచేస్తుంటారు. నిర్దేశించిన జనాభాకు సేవలందించడంలో సమష్టిగా పనిచేస్తుంటారు. కీలకమైన పీహెచ్సీ టీమ్లో సాధారణంగా మూడు రకాల హెల్త్ ప్రొవైడర్లు ఉంటారు. కమ్యూనిటీ హెల్త్ వర్కర్లు, సీహెచ్డబ్ల్యూలు, నర్సులు, జనరల్ ప్రాక్టీస్/ ఫ్యామిలీ మెడిసిన్ స్పెషలిస్టులు ఉంటారు. ఈ మల్టీ డిసిప్లినరీ టీమ్లు శైశవ దశలో ఉన్నప్పటికీ తమ పనితీరు ద్వారా మంచి ఫలితాలు ఇస్తున్నట్టు రుజువైంది.
ప్రాధాన్య సంస్కరణ 2- అనేక దేశాల్లో ఒక మల్టీ ప్రొఫెషనల్ హెల్త్ ఫోర్స్ నిర్మాణం: పీహెచ్సీ ప్రాతిపదికగా నాణ్యతతో కూడుకున్న టీమ్ను అందించడంలో సంఖ్యలోనూ, సేవలందించడంలోనూ పీహెచ్సీ వర్క్ఫోర్స్ సమర్థంగా లేదు. హెల్క్ వర్కర్లకు శిక్షణ, అవసరమైన ప్రాం తాల్లో నియామకం, నిర్వహణ, సక్రమ చెల్లింపు లాంటి మార్పులు తేవాలి. ప్రాధాన్య సంస్కరణ 3: పీహెచ్సీని ఆర్థికంగా పటిష్టపర్చడం: వైద్య ఆరోగ్య వ్యవస్థలకు ఒక కేంద్రంగా పీహెచ్సీని వృద్ధి చేయడంలో ఆర్థిక సర్దుబాట్లు సరిపోవు. ఆ క్రమంలో భారీపెట్టుబడులు ఉపకరిస్తాయి.
వైద్య ఆరోగ్య వ్యవస్థలను ఆర్థికంగా బలోపేతం చేయడంలో అనేక అల్పాదాయ దేశాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ఇలాంటి దేశాల్లో పీహెచ్సీ సంస్కరణలకు దాతలు అండ గా ఉండాల్సిన అవసరం ఉంది. కరోనా కట్టడికి కేంద్రానికి అనుసంధానంగా రాష్ర్టాలు తమవంతు కర్తవ్యాలను నిర్దేశించుకున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయంలో దేశానికే దిక్సూచిగా నిలిచింది. ప్రపంచ బ్యాంకు పేర్కొన్న మల్టీడిసిప్లినరీ టీంల ఏర్పాటు ప్రక్రియను మన రాష్ట్రం కరోనా తొలివేవ్లోనే అమలు చేసింది. ‘టిమ్స్’ లాంటి ప్రత్యేక దవాఖానను ఏర్పాటు చేయడమే కాక జిల్లా కేంద్రాల్లో ఉన్న దవాఖాన లను హెల్త్ సర్వీసు ప్రొవైడర్లుగా మార్చి చికిత్సా హబ్లుగా చేయడంలో సఫలమైంది. ప్రాథమిక ఆరోగ్య పరిరక్షణకు ఆర్థిక జవసత్తాలు అందించడంలో కూడా మన రాష్ట్రం అనూహ్యమైన ప్రగతిని సాధించింది. వైద్యరంగంలో వినూ త్న సాంకేతిక పరిజ్ఞానాన్ని అమలు చేయడానికి వీలుగా ప్రభుత్వ రంగాన్ని కూడా భాగస్వామిగా చేసింది. ఇతర రాష్ర్టాలు మొదటి వేవ్, రెండవ వేవ్లలో సరైన సాంకేతిక పరిజ్ఞానం లేక ఇబ్బందులు పడ్డాయి. కానీ మన రాష్ట్రం వ్యూహాత్మకత కార్యాచరణతో ఆ సవాళ్ళను అధిగమించింది.
చిన్న దేశాల్లో కూడా మల్టీ ప్రొఫెషనల్ హెల్త్ ఫోర్స్ నిర్మాణం చేపట్టాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ కరోనా రెండవ దశ ముగుస్తున్న కాలంలో సూచించింది. దీన్ని కూడా రాష్ట్రం సమర్థంగా అమలు చేసింది. వైద్య విద్య సంస్కరణలను అమలు చేస్తున్నది. ప్రభుత్వ రంగంలో ఏర్పాటు చేస్తున్న మెడికల్ కళాశాలలు దీనిలో భాగమే. ప్రజారోగ్యానికి డేటా సేకరణ కోసం దేశాలు ప్రత్యేక ప్రణాళికను రూపొందించాలని డబ్ల్యూహెచ్ఓ జూలై నెల సమీక్షలో పేర్కొన్నది. ఇందులోనూ సమగ్ర హెల్త్ కార్డ్ పేర తెలంగాణ దిక్సూచిగా నిలువడం విశేషం.
(వ్యాసకర్త: వరంగల్లోని కడియం ఫౌండేషన్ చైర్పర్సన్)
డాక్టర్ కడియం కావ్య