ప్రేరణ, ఆచరణ, లక్ష్యసాధన అనే మూడు అంశాలకు తెలంగాణ రాష్ట్రం ప్రతీక. కరోనా పాండమిక్లో ఈ దిశగా స్పష్టమైన ప్రభుత్వ కార్యాచరణ మనకు కనిపిస్తున్నది. ప్రభుత్వరంగంలో ఉన్న వైద్యానికి మౌలిక వనరుల మెరుగుదల కోసం కరోనా ఇచ్చిన ఒక అరుదైన అవకాశంగా తెలంగాణ రాష్ట్రం వినియోగించుకోవడమే ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ.
ప్రపంచవ్యాప్తంగా కొవిడ్-19 కరోనా వైరస్ రూపంలో జడలు విప్పిన నేపథ్యంలో ప్రజానీకం ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ఆందోళనకు, ఆవేదనకు గురయ్యారు. ఈ దశలో ఈ విపత్తును అత్యంత చాకచక్యంగా ఎదుర్కోవడానికి మన రాష్ట్ర ప్రభుత్వం అనుసరించిన కార్యాచరణ దేశవ్యా ప్తంగా వైద్యరంగంలో మౌలిక వనరుల పటిష్టతకు స్ఫూర్తిగా నిలిచిందని చెప్పుకోవాలి. జాతీయస్థాయిలో దేశవ్యాప్త లాక్డౌన్ లాంటి వ్యాధి నివారణ చర్యలకు ప్రభుత్వాలు పూనుకున్న దశలో తెలంగాణ రాష్ట్రం ద్విముఖ కార్యాచరణ చేపట్టింది. మొద టి విడత కరోనా వేవ్ నేపథ్యంలోనే మౌలిక వనరుల పటిష్టత అనే అత్యంత ప్రాముఖ్యం గల అంశాన్ని ప్రభుత్వం ఆచరణలో పెట్టింది.
చైనా వూహాన్లో అప్పటికప్పుడు కరోనా చికిత్సకు ఒక భారీ దవాఖాన రూపకల్పన చేసిన తరహాలోనే మన దేశ రాజధానిలో ఓ ప్రయత్నం జరిగింది. రాజధానిలోని కొన్ని స్టేడియాలను తాత్కాలిక ప్రాతిపదికన దవాఖానలుగా తీర్చిదిద్ది కరోనా చికిత్స కోసం వినియోగించుకున్నారు. వీటన్నింటికి భిన్నంగా తెలంగాణలో కరోనా జడలు విప్పగానే ప్రభుత్వ రంగంలో గచ్చిబౌలి ప్రాంతంలో ‘టిమ్స్’ పేరిట ఒక దవాఖానను నెలకొల్పారు. దానికితోడు ప్రభుత్వం ఇంటింటి జ్వర సర్వే నిర్వహించి కరోనా చికిత్స విషయంలో ప్రజల్లో ఆత్మస్థయిర్యాన్ని నింపింది.
వైద్యరంగంలో మౌలిక వనరుల పటిష్టత కోసం ప్రభుత్వం ఎప్పటికప్పుడు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నది. పదమూడేం డ్ల ఉద్యమ అనంతరం సాధించుకున్న తెలంగాణలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ప్రధాన దవాఖానలుగా తీర్చిదిద్దారు. ప్రజారోగ్య వ్యవస్థలో భారీస్థాయిలో నిధుల కేటాయింపు జరుగుతున్నది. దవాఖానల్లో మౌలిక వనరులను మెరుగుపరుస్తున్నారు, అభివృద్ధి చేస్తున్నారు. రెండో దశ కరోనా ప్రభుత్వాలకు అత్యంత క్లిష్టమైన సవాల్ విసిరినప్పుడు కూడా తెలంగాణలో ప్రభుత్వం చేపడుతున్న చర్యలు ప్రజా బాహుళ్యంలో ప్రశంసలు పొందా యి. ప్రధానంగా మౌలిక వనరులను మెరుగుపర్చాలనే దీర్ఘకాలిక ఆలోచనా విధానాన్ని ప్రభుత్వం ఆచరణాత్మకం చేస్తున్నది. కరోనా చికిత్స కోసం అవసరమైన ఆక్సిజన్ లభించనప్పుడు ప్రభుత్వం వైద్యారోగ్య శాఖ ఆధ్వర్యంలో 48 ఆక్సిజన్ జనరేషన్ ప్లాంట్లను ఏర్పాటుచేయడమే కాక, 324 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ను ఉత్పత్తి చేసి ఇప్పటి కొరతను, భవిష్యత్ అవసరాలను తీర్చగలిగే రీతిలో వనరులను సమకూర్చింది. హైదరాబాద్లో లిక్విడ్ ఆక్సిజన్ ఉత్పత్తి చేయడానికి 100 మెట్రిక్ టన్నుల ఉత్పత్తి సామర్థ్యంతో అదనపు ప్లాంట్ను ఏర్పాటుచేసింది. 16 మెట్రిక్ టన్నుల ఉత్పత్తి సామర్థ్యం ఉన్న ప్లాంట్లను ఆరింటిని, ఎనిమిది మెట్రిక్టన్నుల ప్లాంట్లను పదిహేనింటిని, నాలుగు మెట్రిక్టన్నుల ప్లాంట్లను ఇరవై ఏడింటిని భవిష్యత్లో ప్రభుత్వ దవాఖానలకు అనుసంధానంగా ఏర్పాటుచేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నది.
ఇప్పటికే ప్రభుత్వరంగంలో అమలుపరుస్తున్న గర్భిణీలకు ఉపకరించే ‘అమ్మ ఒడి’ పథకం రాష్ట్రంలో ప్రభుత్వరంగంలోని దవాఖానల్లో కాన్పుల సంఖ్య పెరగడానికి ఉపయోగపడింది. వీటికితోడు ‘కంటి వెలుగు’ రూపంలో చేపట్టిన నేత్ర వైద్య పథ కం కూడా భారీస్థాయిలో కంటి చికిత్సకు ప్రభుత్వ వైద్యాన్ని పొందే అవకాశాన్ని కల్పించింది. వీటికితోడు తాజాగా కరోనా వైరస్ నిర్ధారణ కోసం 19 జిల్లా కేంద్రాల్లో ఏర్పాటుచేసిన డయాగ్నొస్టిక్ సెంటర్లు కూడా వనరుల మెరుగుదలకు ఉపయోగకారులుగా నిలిచేందుకు ఉపకరిస్తున్నాయి. మహబూబ్న గర్, నిజామాబాద్, మెదక్, జనగామ, ములు గు, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, జగిత్యాల, సిద్దిపేట, నల్గొండ, ఖమ్మం, సిరిసిల్ల, వికారాబాద్, నిర్మల్, కరీంనగర్, ఆదిలాబాద్, గద్వాల, ఆసిఫాబాద్ జిల్లా కేంద్రాలతో పాటు అన్ని ప్రధాన ప్రభుత్వ దవాఖానల్లో ఈ డయాగ్నొస్టిక్ సెంటర్లు సేవలందిస్తున్నాయి. పేద రోగుల కోసం ఉపకరించే డయాగ్నొస్టిక్ సెంటర్లు ప్రభుత్వరంగంలో వైద్యసేవలు మరింత సునాయాసంగా అం దేందుకు మార్గదర్శకాలు అవుతున్నాయి. పలు జిల్లా కేంద్రాల్లో ఏర్పాటుచేస్తున్న మెడికల్ కళాశాలలు కూడా భవిష్యత్ అవసరాల కోసం ఉద్దేశించినవే కావడం వల్ల ప్రభుత్వరంగం ద్వారా పేదలకు మరింత చేరువగా వైద్య సదుపాయాలు అందే అవకాశాలు లభిస్తున్నాయి.
వరంగల్లో ఇప్పటికే ఏర్పాటుచేసిన సూపర్ స్పెషాలిటీ దవాఖానకు తోడుగా సెంట్రల్ జైలు ప్రాంగణంలో ఏర్పాటు చేయ తలపెట్టిన భారీ దవాఖాన ప్రభుత్వరంగంలో పేదల ఆరోగ్యానికి చికిత్సను అందించే సంజీవనిగా ఉపకరిస్తుందనడంలో సందేహం లేదు. మౌలిక వనరుల రూపకల్పన భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా చేపట్టాలనే దీర్ఘకాలిక ఆలోచనతో ఆచరణాత్మకం చేస్తున్న వరంగల్ భారీ దవాఖాన రాష్ట్ర చరిత్రలోనే గొప్ప అంశంగా నిలిచే అవకాశం ఉన్నది. సవాళ్లు అధిగమించే సందర్భాల్లో నాయకత్వ పటిమతో చేసే వ్యూహాలు భవిష్యత్ సన్నద్ధతను తెలియపరుస్తాయి. తెలంగాణలో ప్రభుత్వరంగంలోని వైద్యారోగ్య సేవలకు ఉపకరించే మౌలిక వనరుల రూపకల్పన ఆ విషయాన్ని ప్రస్ఫుటం చేస్తున్నది.
(వ్యాసకర్త వరంగల్లోని కడియం ఫౌండేషన్ చైర్ పర్సన్)
–డాక్టర్ కడియం కావ్య ఎం.డి. (పాథాలజీ)