ప్రతి సంవత్సరం సెప్టెంబర్ నెల నాల్గవ ఆదివారాన్ని ప్రపంచదేశాలు ‘నదుల దినోత్సవం’ (రివర్స్ డే)గా జరుపుకొంటున్నాయి. 2005లో ఐక్యరాజ్యసమితి ‘వాటర్ ఫర్ లైఫ్ డెకేడ్’కు పిలుపునిచ్చిన సందర్భంగానే ‘వరల్డ్ రివర్స్ డే’ను ప్రకటించింది. ప్రపంచ ప్రఖ్యాతి చెందిన ‘నదుల’ పరిరక్షణవాది మార్క్ ఏంజెలో ఐక్యరాజ్యసమితి ముందు ‘ప్రపంచ నదుల దినోత్సవం’ జరపాలనే ప్రతిపాదనను పెట్టారు.
జల వనరుల పరిరక్షణే తక్షణ కర్తవ్యం. మనిషి పుట్టుక నుంచి మరణం దాకా అన్ని సందర్భాల్లో జీవితం నదులతో, నీటితో ముడిపడి వుంటుంది. నదిని తల్లిగా భావిస్తాము. పన్నెండేండ్లకోసారి నదుల వద్ద పుష్కరాలు నిర్వహిస్తాము. వివిధ సందర్భాల్లో నదుల్లో స్నానాలాచరిస్తాం. యాభై ఏండ్లకు పూర్వం మూసీనదిలో నీటిని తాగేవాళ్ళం, స్నానాలు చేసేవాళ్ళం. ఎలాంటి నది ఎలా అయిపోయింది? దీనికి బాధ్యత కేవలం ప్రభుత్వాలదేనా? పౌర సమాజానికి లేదా?
నదుల తీరాలలోనే పురాతన నాగరికతలు వికసించాయి. మన దేశంలోని సింధూలోయ నాగరికత, టైగ్రిస్ నది ఒడ్డున వెలసిన మెసపుటోమియా నాగరికత, నైలునది ఒడ్డున విరాజిల్లిన ఈజిప్టు నాగరికత, యెల్లో, యాంగ్జీ నదుల ఒడ్డున విలసిల్లిన చైనా నాగరికతలు ఇందుకు ఉదాహరణలుగా చెప్పవచ్చు. ఈ విశ్వంలో జీవం నీటితోనే మొదలైంది. మొక్కలకు, ప్రాణులకు నీరే ప్రాణాధారం. ఆహారం లేకుండా కొన్ని వారాలు, నెలలు బ్రతుకగలమేమో కానీ నీరు తాగకుండా మనిషి నాలుగు రోజులు కూడా జీవించలేడు. ఇంత ముఖ్యమైన నీటి గురించి కొన్ని వాస్తవాలను పరిశీలిద్దాం.
భూమి ఉపరితలంపై సుమారు 70 శాతానికిపైగా నీరే ఉంది. ఈ నీటిలో 97 శాతం ఉప్పు నీరే. మిగిలిన 3 శాతం మంచినీరు. ఇందులో 2.7 శాతం మంచుకొండల్లో ఘనీభవించి వుంది, భూ గర్భంలో 400 మీ.నుంచి 800 మీ. లోతున మనకందకుండా ఉన్నది. ఇక మానవాళికి ప్రపంచమంతా అందుబాటులో వున్న మంచినీరు కేవలం 0.30 శాతం లోపే. ఈ కొద్ది నీరు కూడా ప్రపంచంలోని అన్ని దేశాలకు సమానంగా అందడం లేదు. ప్రపంచంలో 3వ వంతు జనాభా ఉన్న చైనా, భారత్లకు అందుబాటులో ఉన్నది.. ప్రపంచంలో అందుబాటులో ఉన్న మంచినీటిలో 10 శాతమే. మూడింట ఒక వంతు మంచినీరు జనాభాలో కేవలం 0.47 శాతం ఉన్న రష్యాలో ఉంది. సుమారు ఐదింట ఒకవంతు మంచినీరు జనాభాలో 2.73 శాతం ఉన్న బ్రెజిల్లో అందుబాటులో ఉంది. అంటే మంచినీటిలో సగం రష్యా, బ్రెజిల్ దేశాల్లో లభ్యమవుతుంటే మిగిలిన రెండు వందలకు పైగా దేశాల్లోని సుమారు 97 శాతం ప్రపంచ జనాభాకు అందుబాటులో ఉన్నది సగం మంచినీరు మాత్రమే. మరో ఆసక్తికరమైన అంశం ప్రపంచంలో లభ్యమయ్యే మంచినీటిలో 20 శాతం జన సంచారం లేని సైబీరియా (రష్యా)లోని బైకాల్ సరస్సులో ఉన్నది.
ఆది మానవుని కాలం నుంచి నేటివరకు లభ్యమవుతున్న మంచినీటి పరిమాణంలో ఏ మార్పూ లేదు. కానీ జనాభా మాత్రం 1801లో 100 కోట్లుంటే ప్రస్తుతం 790 కోట్లు దాటింది. వ్యవసాయం ఎన్నో రెట్లు పెరిగింది. పరిశ్రమల సంఖ్య వందల రెట్లు పెరిగాయి. పర్యవసానంగా నీటి అవసరాలు, వినియోగమూ పెరిగింది. మానవాళికి అందుబాటులో వున్న మంచినీటిలో మూడింట రెండువంతులు వ్యవసాయానికే వినియోగిస్తున్నారు. సుమారు రెండు వందల కోట్లమందికి స్వచ్ఛమైన తాగునీరు అందుబాటులో లేక కలుషిత నీరు తాగి వ్యాధుల బారిన పడుతున్నారు. మరో 78 కోట్ల మందికి తాగడానికి నీరు లభించక ఇబ్బందులు పడుతున్నారు. ఐరాస అంచనా ప్రకారం 2025 నాటికి ప్రపం చ జనాభాలో సగం తీవ్రమైన నీటి కొరతను ఎదుర్కోబోతున్నారు. నీటి వినియోగం విషయంలో ప్రజల్లో సరైన అవగాహన కల్పించడానికే ఐక్యరాజ్యసమితి వాటర్ డే, రివర్స్ డే వంటి కార్యక్రమాలను రూపొందించింది.
మన దేశంలో మంచినీరు ఎక్కువగా అందుబాటులో వున్నది గంగా, యుమున, బ్రహ్మపుత్ర, నర్మద, తాపి, గోదావరి, కృష్ణ, మహానది, కావేరి నదులు, సుమారు మరో 400 ఉపనదులు, లక్షలాది చెరువుల్లో, కుంటల్లో, సరస్సుల్లో, సుమారు 200 మీ-నుంచి 400 మీ.లోతున భూగర్భంలో అందుబాటులో వుంది. నదులను, చెరువులను కాపాడుకుంటేనే రాబోయే తరాలకు మంచినీరు అందించగలం. స్వాతంత్య్రానంతర ప్రభుత్వాలు వహించిన నిర్లక్ష్యం వల్ల, ప్రజల్లో అవగాహనా లోపం, స్వార్థం కారణంగా నదులు, చెరువులు కాలుష్యమయమైపోతున్నాయి. లక్షలాది చెరువులు కబ్జాల పాలవుతున్నాయి. వర్షపు నీటి ప్రవాహ నాలాలు మురుగునీటి కాల్వలుగా మారుతున్నాయి. చెత్తా, చెదారం, పారిశ్రామిక వ్యర్థాలు, భవన నిర్మాణ వ్యర్థాలు, చచ్చిన జంతువులు, పనికిరాని వస్తువులు, ప్లాస్టిక్ వ్యర్థాలన్నీ నదుల్లో, చెరువుల్లో వేస్తున్నారు. ఈ పద్ధతి మారకపోతే రాబోయే తరాలకు మంచినీరు దొరకదు.
నదుల పట్ల మన దృక్పథం, వైఖరి మారాలి. నదులను గౌరవించే సంస్కృతికి శ్రీకారం చుట్టాలి. నదీజలాల స్వచ్ఛతను, పరిశుభ్రతను కాపాడాలి. అడవుల సరిహద్దులను గుర్తించి ఫెన్సింగ్ ఏర్పాట్లుచేస్తే కబ్జాల నుంచి కాపాడగలం. నదులు, చెరువులు డ్రైనేజీలు కారాదు. ‘జల పురుషుని’గా ప్రసిద్ధి చెందిన డాక్టర్ రాజేంద్రసింగ్ చరిత్రలో తొలిసారి ‘ఇండియన్ పెనిన్సులార్ రివర్ బేసిన్ కౌన్సిల్’, ‘హిమాలయన్ రివర్ బేసిన్ కౌన్సిల్’ ఏర్పాటుచేసి నదుల పరిరక్షణకు పూనుకున్నారు. జలసాక్షరతా ఉద్యమాన్ని ప్రారంభించారు. జల ప్రేమికులను సంఘటితం చేస్తున్నారు.
మరో పక్క మూసీనది ప్రక్షాళన కోసం, నదిలోకి వచ్చే ప్రతి నాలాపై, చెరువులపై సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంటులను ప్రభుత్వం ఏర్పాటుచేస్తున్నది. నదికి ఇరుపక్కలా ఫెన్సింగ్ ఏర్పాటుచేస్తున్నారు. వాకింగ్ ట్రాక్, ఉద్యాన వనాలు పెంచుతున్నారు. ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి ప్రాణహిత సంగమం దాకా ఎండిపోయిన గోదావరిని కేసీఆర్ పునరుజ్జీవింపజేశారు. తెలంగాణను నిండుకుండలా మార్చారు. స్వచ్ఛమైన తాగునీరు ఇంటింటికీ అందుబాటులోకి వచ్చింది. కేసీఆర్ పథకాలు దేశానికి ఆదర్శం కావాలి. నదుల పట్ల, జల వనరుల పట్ల ప్రజల్లో అవగాహనను, గౌరవాన్ని పెంచాలి. నీటిని పొదుపుగా వాడుకోవడం, నీటి స్వచ్ఛతను, నదుల ఆరోగ్యాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత మనందరిదీ.
(వ్యాసకర్త: చైర్మన్, తెలంగాణ జలవనరుల అభివృద్ధి సంస్థ)
వి.ప్రకాశ్