ఈ మట్టిలోనే పుట్టారు.. ఈ మట్టిలోనే పెరిగారు.. ఈ మట్టిలోనే చదివారు.. ఈ మట్టిలోనే తిన్నారు.. ఈ మట్టిలోనే పన్నారు.. కానీ బుద్ధులు మాత్రం ఈ మట్టివి రాలేదు. ఈ నేల గాలి ఏ మాత్రం సోకలేదు. అందుకే గాలి మాటలు మాట్లాడతారు.. ఇంటిలోని గులాబీలు వారికి నచ్చవు. పొరుగింటిలోని కాగితం పూలు కమ్మని సుగంధాలు చిమ్ముతాయి. సొంత కంట్లోనే పొడవాలని చూస్తారు. సొంత ఇంట్లో నిప్పు పెడతారు. అందుకోసం ఎంతకైనా దిగజారుతారు!
వారి లక్ష్యం ఒక్కటే.. పచ్చమీడియాలో ఒకటిగా ఛీ కొట్టించుకుంటున్న ఓ పత్రిక వారి స్థావరం తెలంగాణ.. కానీ వారి కావరం, కసి అంతా తెలంగాణ మీద ప్రదర్శిస్తారు! మనింట్లో జీడి పప్పు, బాదం పప్పు మెక్కుతూ, తీరా గుడ్డుపెట్టే సమయానికి పొరుగింటి గోడ దూకి
అక్కడ విసర్జించే కోళ్ల బాపతు!
వారు ఊహించలేదు, తెలంగాణ రాష్ట్రం వస్తదని. వచ్చినా ఇక్కడ కూడా తమ యజమాని చంద్రబాబే పెత్తనం చెలాయిస్తారని కలలు కన్నారు. ఆంధ్రాలో చంద్రబాబు, తెలంగాణలో లోకేష్ బాబు ముఖ్యమంత్రులు అవుతారని, రెండు రాష్ర్టాలను దోచుకోవచ్చని భ్రమల్లో మునిగితేలారు. కానీ, తెలంగాణలో టీడీపీకి తెగులు పట్టి, ఏ ఎరువులు చల్లినా, ఎన్ని మందులు కుమ్మరించినా దానికి పట్టిన చీడలు పీడలు వదలవని, ముల్లె, మూటా సదురుకొని పారిపోవడం వారి కళ్లను మండిస్తున్నాయి. ఈ గడ్డమీద తమ శకుని పాచికలు పారవని చాలా ఆలస్యంగా తెలుసుకున్నారు. తాము నరనరానా ద్వేషించే కేసీఆర్ రాష్ట్ర సారథ్యం వహించడం ఏ మాత్రం జీర్ణించుకోలేకపోతున్నారు. ఆంధ్రా పాలకుల పక్షపాతం కారణంగా అరవై ఏండ్లుగా తెలంగాణ చిన్నచూపునకు గురైందని ఆంతరంగిక సమావేశాల్లో ఏపీ నాయకులు కూడా ఒప్పుకొంటారు. రాష్ట్రం విడిపోవడం వల్ల రెండు ప్రాంతాలు అభివృద్ధికి నోచుకుంటాయని, అన్నదమ్ముల్లా కలిసిమెలిసి ఉందామని కేసీఆర్ నాడు చెప్తే ఒకప్పుడు వ్యతిరేకించినవారు సైతం నేడు వాస్తవాన్ని గ్రహిస్తున్నారు. కేసీఆర్ పాలనకు హారతులు పడుతున్నారు.
అరువై ఏండ్లు చిన్నచూపునకు గురైన నాలుగు కోట్ల జనాభా కలిగిన ప్రాంతాన్ని అభివృద్ధి చెయ్యడానికి ఎంతటి అనుభవజ్ఞుడికైనా కనీసం ఇరువై ఏండ్లు పడుతుంది. అలాంటిది కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ శరవేగంగా ప్రగతి సాధిస్తుండటం దేశం మొత్తం అబ్బురంగా గమనిస్తున్నది. కేంద్ర ప్రభుత్వం సైతం గత ఏడేండ్లలో తెలంగాణ సాధిస్తున్న అభివృద్ధిని ప్రశంసించింది. కేసీఆర్ చేపట్టిన రైతుబంధు, దళితబంధు లాంటి పథకాలు దేశంలోనే మొదటిసారిగా తెలంగాణలో అమలవుతున్నవి. ఇంకా లెక్కలేనన్ని సంక్షేమపథకాలు నిరాటంకంగా ప్రజలకు అందుతున్నాయి. ఐటీ, పురపాలక శాఖామంత్రి కేటీఆర్ కృషి ఫలితంగా అంతర్జాతీయ కంపెనీలు తెలంగాణకు క్యూ కడుతున్నాయి. లక్షల మందికి ఉపాధి దొరికింది. దేశం మొత్తానికి ఉపాధి కల్పనా కేంద్రంగా హైదరాబాద్ కొలువుదీరింది. శాంతిభద్రతల విషయంలో సర్కార్ నిక్కచ్చిగా వ్యవహరిస్తున్నది. నేరగాళ్ల మీద ఉక్కుపాదం మోపుతున్నది.
ఇక వ్యవసాయ రంగంలో చూస్తే ఒకప్పుడు నెర్రెలు విచ్చిన నేలలు ఇప్పుడు పచ్చని పట్టుచీరలు కప్పుకొని ఆనందతాండవం చేస్తున్నాయి. తెలంగాణ గడ్డలో ఎక్కడచూసినా జలసిరులు వయ్యారాలు పోతున్నాయి. కేసీఆర్ పాలనకు ప్రకృతి కూడా సంతోషించి నెలకు మూడు వానలు కురిపిస్తున్నది. కేసీఆర్ స్వప్నించిన బంగారు తెలంగాణ సాకారం కావడానికి ఎన్నో రోజులు పట్టదు. మొన్ననే కేంద్రమాజీ మంత్రి శశిథరూర్ హైదరాబాద్ సందర్శించి మంత్రి కేటీఆర్ను బహిరంగంగా మెచ్చుకున్నారు. తెలంగాణ ఐటీ రంగంలో సాధించిన అభివృద్ధిని ప్రశంసించారు.తెలంగాణ ప్రభుత్వ ఆర్థిక నిర్వహణను రిజర్వ్ బ్యాంక్ అఫ్ ఇండియా సైతం రికార్డుల సాక్షిగా శెభాష్ అని భుజం తట్టింది. రాష్ట్ర తలసరి ఆదాయ సాధనలో తెలంగాణ దేశంలో నాలుగో స్థానంలో
ఉన్నదని రిజర్వ్ బ్యాంకే స్పష్టం చేసింది. దేశానికి ఆర్థిక స్తంభంగా తెలంగాణ ఈ రోజు కేసీఆర్ నాయకత్వంలో సగర్వంగా మోరలెత్తుకొని నిలబడింది. తెలంగాణ దక్షిణ భారతదేశానికి ధాన్యాగారమే కాదు.. యావద్దేశానికి ధనాగారం.
ఇంత ఘనత కళ్లముందు సాక్షాత్కరిస్తున్నప్పటికీ, ఆ పత్రికకు కనపడటం లేదంటే ఆ కళ్లకు పచ్చపొరలు కమ్మడమే కారణం! చంద్రబాబు ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికి అమరావతికి పారిపోవడం, బాబు అధికారం కోల్పోవడం, అమరావతి భ్రమరావతిలా మిగిలిపోవడం, ఆ పత్రిక యజమాని జీర్ణించుకోలేకపోతున్నారు. తాను విషం చిమ్మే కేసీఆర్ రెండోసారి కూడా మహోధృతంగా మెజారిటీ సాధించి మధ్యందిన మార్తాండుడిలా జ్వలించడం, కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తితో తెలంగాణలోని లక్షల ఎకరాలు తడిసి పులకించిపోవడం, జాతీయస్థాయిలో కేసీఆర్ ప్రతిష్ఠ ఇనుమడించడం ఆయన గారికి పగటి వేళ కూడా పీడకలలు తెప్పిస్తున్నాయి.
అరవై ఏండ్లపాటు వనరుల దోపిడీకి గురై అంబలికి కూడా ముఖం వాచిన నాటి తెలంగాణ కాదు ఇది. కేసీఆర్ దార్శనికతతో తాను మూడుపూటలా సన్న బియ్యంతో తింటూ, ఇరుగు పొరుగు రాష్ర్టాలకు కూడా కడుపునిండా అన్నం పెట్టే అన్నపూర్ణగా వర్ధిల్లుతున్న ఆహార తెలంగాణ! టూరిజం రంగంలో అగ్రశ్రేణిగా విరాజిల్లుతున్న విహార తెలంగాణ! పచ్చదాస్యంతో విచ్చలవిడిగా రెచ్చిపోయిన వారి పుచ్చిపోయిన ఆ పత్రిక పలుకులకు ప్రజలే సమాధానం చెప్తారు. చివరగా కేసీఆర్ చెప్పినట్లు కొందరి జీవితాలు ‘థూ నీ బతుకు చెడా’.
ఇలపావులూరి మురళీ మోహనరావు