మానవాళికి స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వంతో కూడిన సమాజ స్థాపన కోసం ఎన్నో ఉద్యమాలు జరిగాయి. ప్రజాస్వామ్యం అంటే కేవలం ఓటు హక్కు ద్వారా పౌరపాలన ఏర్పాటు ఒక్కటే కాదు. అందరికీ సమాన హక్కులు, అవకాశాలు, భాగస్వామ్యం కల్పించాలి. పాలనలో కుల, మత, ప్రాంతీయ, వర్ణ వివక్షకు తావులేని, గౌరవప్రదమైన జీవన విధానాన్ని అవలంబించాలి.
19-20వ శతాబ్ది ద్వితీయార్థంలో ప్రపంచవ్యాప్తంగా పౌరపాలన పటిష్ఠతకు ఆశాభావం, అనివార్యత ప్రేరణతో విశేషమైన ప్రజాస్వామ్య వ్యాప్తి జరిగింది. కానీ నేడు ప్రజాస్వామ్యం తీవ్రమైన సవాళ్లను ఎదుర్కొంటున్నది. అప్రజాస్వామిక పోకడలు ప్రజాస్వామ్యాన్ని ప్రశ్నార్థకం చేస్తున్నాయి. ప్రజాస్వామ్య పాలనపై అవగాహ న, పౌరుల అప్రమత్తత, విలువలతో కూడి న రాజకీయాలు, స్వేచ్ఛాయుత ఎన్నికలు, పాలనలో పారదర్శకత, స్వతం త్ర న్యాయవ్యవస్థ ప్రజాస్వామ్యానికి కవచాలు.
ప్రజల్లో ప్రజాస్వామ్య విలువలను ప్రోత్సహించి అవగాహన కల్పించే ఉద్దేశంతో ఏటా సెప్టెంబర్ 15న ‘అంతర్జాతీయ ప్రజాస్వామ్య దినోత్సవా’న్ని జరుపుకొంటున్నాం. 1997 సెప్టెంబర్ 16న ఈజిప్టు రాజధాని కైరోలో జరిగిన సమావేశంలో ప్రజాస్వామ్యంపై సార్వత్రిక ప్రకటన వెలువడింది. 2006లో ఖతార్ రాజధాని దోహాలో జరిగిన అంతర్జాతీయ సమావేశంలో ప్రజాస్వామ్య దినోత్సవాన్ని ప్రోత్సహించాలని నిర్ణయించి, ఇంటర్ పార్లమెంటరీ యూనియన్ సూచనల మేరకు 2007 నవంబర్ 8న ఐరాస సమావేశంలో ఈ తీర్మానాన్ని ఆమోదించారు. ‘ప్రజలు తమ రాజకీయ, ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక వ్యవస్థల్లో జీవితంలో అన్ని అంశాల్లో పూర్తి స్వేచ్ఛను కలిగి ఉండటమే ప్రజాస్వామ్య ముఖ్య లక్షణం’ అన్నారు. యూఎన్ఓ లోని సభ్యదేశాలన్నీ ప్రజాస్వామ్య సూత్రాలను పాటించాలని ప్రకటించారు.
సామాజిక, ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక అంశాల్లో తేడాల్లేకుండా ప్రపంచంలోని ప్రజలందరూ స్వేచ్ఛ, సమానత్వం విలువలపై ఆధారపడి జీవిం చే హక్కును కలిగించడమే ఈ అంతర్జాతీయ ప్రజాస్వామ్య దినోత్సవ ముఖ్య లక్ష్యం. కానీ ప్రపంచంలో ప్రజాస్వామ్య పాలనను యాభై శాతం దేశాలు మాత్రమే అనుసరిస్తున్నా యి. సంపూర్ణ ప్రజాస్వామ్యా న్ని అమలుచేస్తున్న దేశాలు 2015 నాటికి కేవలం 9 శాతం మాత్రమే. సంపూర్ణ ప్రజాస్వా మ్య దేశాల జాబితాలో
నార్వే మొదటి స్థానంలో ఉండగా తర్వాతి స్థానాల్లో స్వీడన్, న్యూజిలాండ్, డెన్మార్క్, కెనడా దేశాలున్నాయి.
గ్రీకు రాజ్యంలో మొదలైన సమానత్వం అనే భావన భారత రాజ్యాంగంలో పొందుపరచారు. పాలనా తత్వవేత్తలు అరిస్టాటిల్, ప్లేటో వంటివారు నాటి పాలనా వ్యవస్థల్లో ప్రజాస్వామ్య పునాదులు వేశారని చెప్పవచ్చు. వీరిద్వారా ప్రభావితమైన భారత ప్రజలు కూడా బ్రిటిష్ కాలం నాటి అప్రజాస్వామిక పాలనకు వ్యతిరేకంగా సుదీర్ఘ పోరాటం చేసి ప్రజాస్వామిక ఆకాంక్షను సఫలం చేసుకున్నారు.
ప్రజాస్వామిక పటిష్ఠతకు అంబేద్కర్ భారత రాజ్యాంగంతో ప్రజాస్వామ్యం పురుడు పోశారని చెప్పవచ్చు. భారత్ అమెరికా నుంచి కొన్ని అంశాలను తీసుకొని చట్టాల రూపంలో పొందుపరిచారు. మనం నేడు భారత రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులు ఐర్లాండ్ నుంచి; ఆదేశిక, న్యాయసూత్రాలు, పాలనా పద్ధతులు బ్రిటన్ నుంచి తీసుకున్నారు.
75 వసంతాల ప్రజాస్వామ్య పాలనతో భారతదేశం అభివృద్ధిలో ముందుకుపోతున్నది. ఇది నాణేనికి ఒకవైపు మాత్రమే. రెండోవైపు చూసినట్లయితే ప్రజాస్వామ్య విలువలు, ప్రజల హక్కులు రోజురోజుకు హరించుకుపోతున్నాయి. స్వతంత్ర భారతం సాధించింది ఎంతో, సాధించవలసింది మరెంతో ఉంది. స్వాతంత్య్రం వచ్చాక ప్రజాస్వామ్య పాలనలో ప్రజల జీవన ప్రమాణాలు పెరిగాయా లాంటి అనేక ప్రశ్నలు రేకెత్తుతున్నాయి. అమర్త్యసేన్ ప్రకారం.. ‘స్వతంత్ర భారతదేశం సాధించిన విజయం ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవడం. కానీ ఘోరమైన వైఫల్యాలు, సామాజిక అసమానతలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి’ అని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రజల ఆకాంక్షలను, ఆశయాలను ప్రతిబింబించే వేదికలుగా పార్లమెంటు, శాసనసభలు ఉండాలి. కానీ మన చట్టసభలు యుద్ధభూమిని తలపిస్తున్నాయి. తెలుగు రాష్ర్టాల విభజన బిల్లు సమయంలో పార్లమెంట్లో పెప్పర్ స్ప్రే చేయడం అందర్నీ ఆశ్చర్యపరిచింది. మన ప్రజాస్వామ్య విలువలు రోజురోజుకు సన్నగిల్లుతున్నాయి. దీనికి కారణం లేకపోలేదు. విలువల్లేని వారు చట్టసభల్లోకి రావడమే. దీనివల్ల ప్రజల్లో చట్టసభలపై, ప్రజాస్వామ్యంపై విశ్వసనీయత పోతున్నది.
ఏ దేశ పాలన వ్యవస్థలోనైనా జవాబుదారీతనం, పారదర్శకత సుపరిపాలనకు రెండు కండ్లు. సుపరిపాలన కోసం 1969 నుంచి నేటివరకు అనేక పాలనాపరమైన సంస్కరణలను భారత ప్రభుత్వం చేపట్టింది. ఈ తరుణంలోప్రజాస్వామ్య పరిరక్షణ కోసం సాగే అస్తిత్వ పోరాటాలు ముఖ్యమైనవి. ఈ క్రమంలో ప్రజలే ప్రభువులు.. పాలకులు సేవకులు కావాలి. ప్రజల సార్వభౌమాధికారాన్ని కాపాడుతూ అవినీతి, పక్షపాతరహిత, బాధ్యతాయుతమైన సుపరిపాలనా వ్యవసే ్థప్రజాస్వామ్యానికి రక్షణ.
(వ్యాసకర్త: ప్రభుత్వ పాలనశాస్త్రం పరిశోధకులు, ఓయూ)
డాక్టర్ ఎ.కుమారస్వామి