దేశంలో ఓబీసీ జనగణన మరోసారి చర్చనీయాంశమవుతున్నది. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత పదేండ్లకోసారి నిర్వహిస్తున్న జనగణనలో ఇప్పటివరకు కేవలం ఎస్సీ, ఎస్టీ కులాల సమాచారాన్నే సేకరిస్తున్నారు. 2011లో కులగణన చేపట్టినా వివరాలు అసమగ్రంగా ఉన్నాయని దాన్నిపక్కనపెట్టారు. ఓబీసీ జనగణన చేపట్టాలనే డిమాండ్ దశాబ్దాలుగా వినిపిస్తున్నా అది ఎన్నికల స్టంట్ లాగే మిగిలిపోతున్నది. జాతీయపార్టీలు ఎన్నికల్లో ప్రయోజనాల కోసం ఈ అంశాన్ని లేవనెత్తడం, అధికారంలోకి రాగానే మూలన పడేయటం పరిపాటిగా మారింది.
దేశంలో 1872 జనాభా లెక్కల సందర్భంగా కులగణనలో బ్రాహ్మణ, క్షత్రియ, రాజ్పుత్లతో పాటు కులవృత్తుల వారీగా వర్గీకరించారు. స్థానిక క్రిస్టియన్లు, ఆదివాసీ తెగలను గుర్తించారు. ఆ తర్వాతి కాలంలో 1901లో 1,642 కులాలను గుర్తించారు. 1931లో 4,147 కులాలను లెక్కించారు. ఆ తర్వాత జరగలేదు. సుదీర్ఘకాలం తర్వాత 2011లో 46 లక్షల కులాలు, ఉపకులాలు, గోత్ర నామాల ఆధారంగా ప్రాంతాల వారీగా జనాభా లెక్కలను సేకరించారు.
ఓబీసీల అభ్యున్నతి కోసం దేశంలో అనేక కమిషన్లు వేశారు. వాటిలో ఖలేల్కర్ కమిషన్, మండల్ కమిషన్ ముఖ్యమైనవి. 1953లో వేసిన కాకా ఖలేల్కర్ కమిషన్ 2,399 వెనుకబడిన కులాలను గుర్తించింది. అందులో 837బీసీ కులాలు అత్యంత వెనకబడి ఉన్నాయని తేల్చింది. 1961లో కులాలవారీగా జనగణన చేపట్టాలని కేంద్రానికి సిఫారసు చేసింది. 1979లో వేసిన మండల్ కమిషన్ దేశ జనాభాలో 52 శాతం ఓబీసీలున్నారని తేల్చింది. ఓబీసీలకు ప్రభుత్వ ఉద్యోగాల్లో 27 శాతం రిజర్వేషన్లు కల్పించాలని సూచించింది. ఆ తర్వాత 2017లో వేసిన రోహిణి కమిషన్ 97 శాతం ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యా రిజర్వేషన్ల ఫలాలు కేవలం 25 బీసీ ఉపకులాలకే చెందుతున్నాయని తెలిపింది. 2,633 ఓబీసీ కులాలు రిజర్వేషన్లలో మూలకు నెట్టబడుతున్నా యని, 983 కులాలకు అసలు ప్రాతినిధ్యమే లేదని తేల్చింది. ఓబీసీలకు ప్రభుత్వ ఉద్యోగాల్లో కల్పిస్తున్న 27 శాతం రిజర్వేషన్లను 4 సబ్ క్యాటగిరీలుగా విభజించాలని సూచించింది.
దేశంలో అధిక సంఖ్యాకులుగా ఓబీసీలు ఉంటారన్నది నిర్వివాదాంశం. అయినా వారికి అధికారంలో, నియామకాల్లో తగినస్థాయిలో చోటుదక్కటం లేదని ఎన్నో ఏం డ్లుగా వారు ఆరోపిస్తున్నారు. తాము వెనుకబడి ఉండటానికి అధికారంలో జనాభా ప్రాతిపదికన తగిన ప్రాతినిధ్యం లేకపోవటంమే అని ఆరోపిస్తున్నారు. ఓబీసీల స్థితిగతులపై పలు కమిషన్లను ఏర్పాటుచేసినా, వాటి సిఫారసులను అధికారంలో ఎవరున్నా అమలుచేసిన పాపానపోలేదు. ఒక కులాన్ని ఓబీసీగా గుర్తించే అధికారాన్ని పార్లమెంటు ఇటీవల రాష్ర్టాలకు కల్పించటంతో మళ్లీ ఓబీసీ జనగణనపై చర్చ మొదలైంది. జనాభా లెక్కల సేకరణ అధికారం కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉండటంతో అనేక పార్టీలు దేశవ్యాప్తంగా ఓబీసీ జనగణన చేపట్టాలని డిమాండ్ చేస్తున్నాయి. కేంద్రం మాత్రం ఈ డిమాండ్ను పట్టించుకోవ టం లేదు. ఆ పార్టీకి బలమైన ఓటుబ్యాంకు ఓబీసీలే కావటంతో జనాభా గణన చేపడితే వారిలో చీలిక వచ్చి ఆ ఓటు బ్యాంకును కోల్పోవాల్సి వస్తుందేమోనని బీజేపీ భయపడుతున్నట్టు కనిపిస్తున్నది.
ఓబీసీ జనగణనకు సంబంధించి కాం గ్రెస్, బీజేపీలు మొదటినుంచీ సుముఖంగా లేవు. కులగణన వల్ల సమాజంలో చీలికలు ఏర్పడుతాయని సాకులు చెప్తున్నాయి. దేశంలో పదుల సంఖ్యలో కులాలు, ఉపకులాలున్నాయి. ఒక ప్రాం తంలో ఓసీగా ఉన్నవారు మరో రాష్ట్రంలో బీసీలు, ఎస్టీలుగా ఉన్నారు. ఈ పరిస్థితిలో కులగణన చేసి అన్ని కులాలు సరైన సామాజిక స్థానా న్ని గుర్తించటం అసాధ్యమని వాదిస్తున్నా యి. ఈ వాదనను ఓబీసీ వర్గాలు తిరస్కరిస్తున్నాయి. కులగణనతో ఓబీసీల ప్రాబ ల్యం పెరిగిపోతుందని, తద్వారా ప్రస్తుత రిజర్వేషన్ల పరిమితిని పెంచాలనే డిమాండ్ వస్తుందన్న భయంతోనే వెనుకడుగు వేస్తున్నారని ఓబీసీ నేతల విమర్శ. విద్య, ఉపాధి, రాజకీయ అవకాశాల్లో ఓబీసీలు మరింత ప్రాతినిధ్యం కోసం పట్టుబట్టే అవకాశం ఉన్నదని కూడా జాతీయపార్టీలు కులగణన చేపట్టడం లేదన్న ఆరోపణలున్నాయి. ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు చట్ట సవరణ చేసి రిజర్వేషన్ కల్పించిన బీజేపీ ప్రభుత్వం, ఓబీసీ జనగణన సాధ్యం కాదని చెప్పడం ఆ పార్టీ ద్వంద్వనీతికి నిదర్శనమని కులగణన సమర్థకులు అంటున్నారు.
సమాజంలో జనాభా పరంగా అధికంగా ఉన్న బీసీలను తమవైపు తిప్పుకోవటానికి జాతీయ, ప్రాంతీయ పార్టీలు పోటీ పడుతున్నాయి. ఓబీసీ కులగణనకు అనేక రాష్ర్టాల్లో ప్రాంతీయపార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. ప్రాంతీయ పార్టీలు అధికారంలో ఉన్నచోట సంక్షేమ పథకాల్లో బీసీలకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నాయి. అయితే, ఓబీసీల సమగ్ర సమాచారం అందుబాటులో లేకపోవడంతో కొన్ని బీసీ వర్గాలే లబ్ధి పొందుతున్నాయి. నిరాదరణకు గురవుతున్న ఓబీసీ వర్గాలు క్రమంగా జాతీయ పార్టీల వైపు మొగ్గుచూపుతున్న స్థితి ఉన్నది. ఓబీసీ గణన చేపట్టాలని ఇప్పటికే ఒడిశా, తమిళనాడు, బీహార్, మహారాష్ట్ర అసెంబ్లీలు తీర్మానం చేసి కేంద్రానికి పంపాయి. 18 ప్రాంతీయ పార్టీలు ఇదే విషయమై ప్రధానికి లేఖ కూడా రాశాయి. అదే దిశలో మరికొన్ని రాష్ర్టాలు అడుగులు వేస్తుండటం గమనార్హం.
మ్యాకం రవికుమార్