మట్టిలో మట్టి కలిస్తే అది మట్టిగా మాత్రమే మిగిలిపోతుంది. అదే మట్టికి ఒక విత్తనం, మొలక తోడైతే అది మహావృక్షాన్ని వాగ్దానం చేస్తుంది. ఆ మొక్క పచ్చదనానికి, పర్యావరనానికి, ప్రజారోగ్యానికీ హామీ పడుతుంది. అందుకోసం అందివచ్చిన ప్రతి సందర్భాన్ని మానవాళి సంరక్షణకు, పర్యావరణ పరిరక్షణకు వినియోగించుకోవాలి.
మానవాళి భవిష్యత్తు పట్ల నిబద్ధతతో ఆలోచించేవారు తప్పకుండా ప్రతి ఆచార వ్యవహరాన్నీ, పండుగను మానవాళి సంక్షేమం కోసం ఉపయోగిస్తారు. ఆ కోవలోనే ఎంపీ సంతోష్ కుమార్ తనదైన సృజనాత్మక ఆలోచనతో గణేశ్ ఉత్సవ సందర్భాన్ని కూడా పర్యావరణ పరిరక్షణకు వినియోగిస్తున్నారు. గణేశ్ ఉత్సవాల సందర్భంగా ఇంటింటికీ మట్టి గణేశ్ విగ్రహాలను సరఫరా చేస్తున్నారు. గణేశ్ మట్టి విగ్రహంలో ఓ విత్తనాన్ని ఉంచి దాన్ని ప్రజలకు పంచుతున్నారు. వినాయక విగ్రహాన్ని పూజలైపోయిన తర్వాత తిరిగి నిమజ్జనం చేసినప్పుడు మట్టివిగ్రహం కరిగి విత్తనం మొలకెత్తి పచ్చదనానికి హామీగా నిలుస్తుంది. ఇలా భక్తికి పరమోన్నత లక్ష్యాన్ని జోడించి తనదైన బాధ్యతను నిర్వర్తిస్తున్నారు రాజ్యసభ ఎంపీ జోగినపల్లి సంతోష్కుమార్.
కార్యశీలులకు కాదేదీ కార్యానికి అనర్హం అని నిరూపిస్తున్నారు సంతోష్కుమార్. ప్రజల భక్తిభావాన్ని తిరిగి అదే ప్రజల భౌతిక జీవిత సమస్యలకు ఒక పరిష్కారంగా మలచడమంటే ఇదే. భగవంతుడిని నిత్య జీవిత మార్గదర్శిగా జనం కండ్లముందు నిలబెట్టడమంటే ఇదే. ఇలాంటి కార్యాల వల్లనే పరమాత్ముడు మనిషికి పరమ ఆప్తుడుగా మారుతాడు. ఇలా భగవంతునికి భక్తునికీ మధ్య బలమైన వారధి నిర్మించేందుకు ఉడుతగా మారి తన జీవితాన్ని ఉన్నతీకరించుకున్నారు జోగినపల్లి సం తోష్ కుమార్.
ఆదిదేవుడిగా, విఘ్నేశ్వరుడిగా వినాయకునిపై ప్రజలకు ఎనలేని భక్తి విశ్వాసాలున్నాయి. విఘ్నాలు తొలగించే దేవుడిగా కొలుస్తారు. కానీ ఈ మధ్య పర్యావరణవేత్తలు చెప్తున్న విషయాలు వింటున్న తర్వాత అందరూ గణేశ్ ప్రతిమల పట్ల అనుమానం, భయం పెంచుకునే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. నిజంగానే గణేశ్ విగ్రహాలను నీటిలో త్వరగా కరిగిపోనటువంటి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో చేయటమే కాకుండా ప్రమాదకరమైన రసాయన రంగులద్దుతున్నారు. ఈ రసాయన కారకాలతో వినాయక నిమజ్జనం తర్వాత జలాశయాలన్నీ కాలుష్యమైపోతున్నాయి. చెరువులు, కుంటలు, నదుల్లోని జలచరాలు చేపలు చనిపోతున్న పరిస్థితి ఏర్పడుతున్నది. నిమజ్జనం తర్వాత ఆ నీటిని సాధారణ వినియోగానికి ఉపయోగించుకోలేని దుస్థితి ఏర్పడుతున్నది.
ఈ నేపథ్యంలోంచే పర్యావరణ ప్రేమికులు వినాయక ప్రతిమలను మట్టితోనే చేసుకోవాలని సూచిస్తున్నారు. ఎలాంటి రసాయనరంగులు లేకుండా సాధారణ, స్వచ్ఛమైన మట్టి విగ్రహాలే భక్తికీ, ముక్తికీ మంచిదని అంటున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరూ వినాయకపూజ పేరుతో పర్యావరణానికి చేటు చేసేవిధంగా వ్యవహరించకుండా ఉండాలని కోరుతున్నారు. ఈ సందర్భంగా పర్యావరణ ప్రేమికులంతా మట్టి విగ్రహ పూజనే ప్రోత్సహించాలి. భవిష్యత్తుతరాల కోసమైనా, తక్షణ పర్యావరణ సమస్యల పరిష్కారం కోసమైనా మట్టి వినాయక పూజనే శ్రేయస్కరం. పర్యావరణ పరిరక్షణకు ముందుతరాలపై మహత్తర బాధ్యతతో ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. కాలు ష్యకారక కార్యక్రమాలను విడనాడాలి.
గోసుల శ్రీనివాస్యాదవ్
(వ్యాసకర్త: గొల్ల కుర్మ హక్కుల పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షులు)