తెలంగాణ రాజకీయ చరిత్రలో మరో చారిత్రక అధ్యాయాన్ని లిఖించేందుకు టీఆర్ఎస్ పార్టీ సిద్ధమవుతున్నది. దేశ రాజధాని ఢిల్లీలో పార్టీ కార్యాలయ నిర్మాణానికి పార్టీ అధ్యక్షులు, ముఖ్యమంత్రి కేసీఆర్ సెప్టెంబర్ 2వ తేదీన భూమి పూజ చేయనున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాల్లోని ఏ పార్టీకి లేనివిధంగా ఢిల్లీలో టీఆర్ఎస్ పార్టీకి శాశ్వత భవన నిర్మాణం ఏర్పాటవుతుండటం ఆహ్వానించదగిన పరిణామం. ద్వి దశాబ్ది వేడుకలను పూర్తిచేసుకుంటున్న టీఆర్ఎస్ పార్టీ తన భవిష్యత్తు రాజకీయ వ్యూహానికి పదునుపెట్టే దిశగా వేస్తున్న అడుగుగా దీన్ని అభివర్ణించవచ్చు.
తెలుగువారి ఆత్మగౌరవం పేరుతో ఏర్పాటైన టీడీపీకి నేటిదాకా ఢిల్లీలో సొంత ఠికానా లేదు. దేశ రాజకీయాలను శాసించామని సొంత డబ్బా కొట్టుకోవడం తప్ప తెలుగువారి అస్తిత్వాన్ని చాటే ప్రయత్నం ఆ పార్టీ ఏనాడూ చేయలేదు. తెలుగు నేలపై ప్రాంతీయ పార్టీగా పుట్టి రెం డు దశాబ్దాలకు పైగా అధికారాన్ని అనుభవించిన టీడీపీ కనీసం ఢిల్లీలో తెలుగువారికి ఒక రాజకీయ అడ్డాను ఏర్పాటు చేయలేకపోయింది. కూటముల పేరుతో ప్రధానమంత్రులను, రాష్ట్రపతులను చేశామని చెప్పుకోవడం తప్ప ఢిల్లీలో శాశ్వత పార్టీ కార్యాలయాన్ని ఏర్పాటు చేయలేకపోయింది. కనీసం ఆ పార్టీకి దీనిపై స్పృహ కూడా ఏనాడు లేకపోడం గమనార్హం. తెలుగు నేల నుంచి పుట్టి.. ఢిల్లీ లో శాశ్వత రాజకీయ పార్టీ కార్యాలయాన్ని ఏర్పాటుచేసుకోబోతున్న తొలి పార్టీగా తెలంగాణ రాష్ట్ర సమితి సరికొత్త రికార్డు సృష్టించబోతున్నది. ఇదేమీ ఆషామాషీ విషయం కాదు.
ఉద్యమ అవసరాల కోసం పుట్టిన రాజకీయ పార్టీ టీఆర్ఎస్. దీని పుట్టు క.. ప్రస్థానం అంతా వైవిధ్యమే. అయితే, ఏది చేసి నా.. ఏం చేసినా పక్కాగా.. ఈ ప్రాంత ప్రజల వాణి ని బలంగా వినిపించే గొంతుకగా టీఆర్ఎస్ నిలబడింది. మకాలో పుట్టి పుబ్బలో కలిసిపోతుందన్న పార్టీ ద్విదశాబ్ది ఉత్సవాలను చేసుకోవడం ఒకెత్తయితే.. దేశ రాజకీయాల్లో స్థిరమైన, బలమైన రాజకీయపార్టీగా భవిష్యత్తు బాట నిర్మించుకోవడంలో టీఆర్ఎస్ నిమగ్నం కావడం తెలంగాణకు గర్వకారణం. భవిష్యత్తు రాజకీయాల్లో టీఆర్ఎస్ జాతీయస్థాయిలో కీలకపాత్ర పోషించాలని కోరుకుంటున్నవారు సెప్టెంబర్ 2వ తేదీన ఢిల్లీకి వెళ్లనున్నారు. కేసీఆర్ చేతుల మీదుగా టీఆర్ఎస్ పార్టీ కార్యాలయ నిర్మాణానికి భూమిపూజ జరుగుతుండటం తెలంగాణ, ఏపీ రాష్ర్టాల ప్రజలకు గర్వకారణం. ఢిల్లీలో నిర్మించబోయే తెలంగాణభవన్ ముమ్మాటికీ జాతీయస్థాయిలో అనేక కీలక రాజకీయ పరిణామాలకు సాక్షిగా నిలుస్తుందనడంలో ఏ మాత్రం సందేహం లేదు.
‘తెలంగాణ భవన్’ సబ్బండవర్గాల అతిథి కేంద్రం: 2001 ఏప్రిల్ 27న జలదృశ్యంలో మొదలైన టీఆర్ఎస్ పార్టీకి తనకంటూ సొంత కార్యాల యం లేకుండా చేసే కుట్ర జరిగింది. టీఆర్ఎస్ పార్టీ రోజుల పసిగుడ్డుగా ఉన్నపుడే దీని పీక పిసికేందుకు సమైక్యవాదులు కుట్ర చేశారు. ఆ కుట్రల ఫలితమే జలదృశ్యం నుంచి టీఆర్ఎస్ పార్టీ కార్యాల యం రోడ్డు మీదికి వచ్చింది. అక్కడినుంచి అద్దె కార్యాలయాల్లో కొనసాగింది. ఎట్టకేలకు పార్టీ 2004 ఎన్నికల్లో అనేక ఆటుపోట్లను తట్టుకొని బలమైన రాజకీయశక్తిగా ఆవిర్భవించడం, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో చేరడంతో అప్పటికప్పుడు కార్యాలయ సమస్య కొంత తప్పినప్పటికీ శాశ్వత భవనం ఉండాలని కేసీఆర్ తలిచారు. అందుకోసమే అప్పటి కాం గ్రెస్ పార్టీతో కొట్లాడి బంజారాహిల్స్లో సర్వహంగులతో ‘తెలంగాణ భవన్’ను నిర్మించారు. ఆ భవన నిర్మాణం పూర్తయి పదిహేనేండ్లయింది. దాన్ని నిర్మించేనాటికి తెలంగాణవాదులు కలుసుకునేందు కు ఒక వేదిక లేదు. తెలంగాణవాదులు ఒకచోట చేరి తమ కష్టనష్టాలను, రాజకీయ భావజాలాన్ని పంచుకోవాలన్న ఉద్దేశంతోనే టీఆర్ఎస్ పార్టీ కేంద్ర కార్యాలయానికి ‘తెలంగాణ భవన్’ అని పేరు పెట్టా రు. దాని నిర్మాణంతో తెలంగాణ వాదుల్లో టీఆర్ఎస్పై ఉన్న నమ్మకం రెట్టింపయిందనడంలో సందే హం లేదు. ఇగ ఈ పార్టీ రాజకీయంగా గట్టిగనే ఉం టది. టెంపరరీ పార్టీ కాదన్న భావన వ్యక్తమైందనడంలో సందేహం లేదు.
ఉద్యమ సమయంలో తెలంగాణ భవన్ వార్ రూంలా పనిచేసింది. తెలంగాణ వ్యాప్తంగా ఉన్న అనేకమంది తెలంగాణ సానుభూతిపరులు, మేధావులకు, ఇది ఉద్యమ కార్యక్షేత్రమైంది. ఉద్యమకారులకు స్ఫూర్తి కేంద్రమైంది. అంతేకాదు.. సబ్బండ వర్గాలకు అతి థి కేంద్రమైంది. తెలంగాణ భవన్ కట్టిన కొత్తలో కార్యాలయానికి చుట్టుపక్కల నిర్మానుష్యంగానే ఉండేది. బసవతారకం క్యాన్సర్ దవాఖానకు ఉమ్మడి రాష్ట్రంతో పాటు పక్క రాష్ర్టాల నుంచి వచ్చే పేద రోగులకు అన్నం పెట్టింది. తెలంగాణ భవన్లోని క్యాంటిన్ను స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించారు. ప్రారంభించిన నాడే ఇక్కడ ఎవ్వరు వచ్చినా భోజనం పెట్టి పంపించాలని చెప్పారు. దీంతో ఏండ్లకేండ్లు ఇక్కడ వందల మం దికి ప్రతీ రోజు భోజనం దొరికే స్థలంగా మారింది. విద్యార్థులు, హైదరాబాద్కు వివిధ పనులపై వచ్చేవారు బంజారాహిల్స్లోని పార్టీ కార్యాలయానికి రావడం.. భోజనం చేయడం, ఇక్కడ జరిగే ఉద్యమ కార్యక్రమాల్లో పాలుపంచుకోవడం సర్వసాధారణంగా మారింది. పార్టీ కార్యాలయంలోని గదులను కళాకారులు, విద్యార్థులు, ఉద్యోగులు, పింఛనర్లు, మీడియా ప్రతినిధుల కోసం కేటాయించారు. నేటికి అనేకమంది తెలంగాణ భవన్ను చూసి వెళ్తుంటారు.
తెలంగాణ ప్రజల సామాజిక ఆకాంక్షలకు తెలంగాణ భవన్ కేంద్రస్థానంగా ఉండటమే కాదు, సాంస్కృతిక కేంద్రంగా ఉంది. తెలంగాణ ఉద్యమానికి ప్రాణం పోసింది ఇక్కడే. తెలంగాణ సమాజాన్ని ఒక్కతాటిపైకి తేవడం. తెలంగాణ రాజకీయశక్తుల పునరేకీకరణ ఇక్కడే జరిగింది. ఇక భవిష్యత్తులో ఢిల్లీ కేంద్రంగా టీఆర్ఎస్ పార్టీ నిర్మించబోయే తెలంగాణ భవన్ ఇదే తరహాలో మరింత క్రియాశీలకంగా వ్యవహరిస్తుందని ఆశిద్దాం.
ఓరుగంటి సతీష్