‘కులం పేరుతో మనుషుల మీద కొనసాగుతున్న సామాజిక వివక్ష ఇంకా ఆత్మ వేదనగానే మిగిలి ఉన్నది. స్వాతంత్య్రం వచ్చి దశాబ్దాలు గడుస్తున్నా, దళితుల పట్ల సామాజిక, ఆర్థిక వివక్ష ఇంకా కొనసాగుతుండటం అత్యంత బాధాకరం’ అనే ముఖ్యమంత్రి కేసీఆర్ ఆవేదనకు మూలాన్ని మేధావి వర్గం మరింత లోతుగా అన్వేషించాల్సిన సందర్భం ఇది.
ఇది కుటుంబానికి రూ.10 లక్షల ఆర్థిక సాయమే కాదు, ఇది దళితులను సమాజంలో, సామాజిక ఉత్పత్తిలో భాగస్వాములను చేసేందుకు కేసీఆర్ ఇచ్చిన ఉద్యమ పిలుపు.
సమసమాజానికి దేశంలో పడుతున్న మేలి అడుగు. కులాన్ని ఉపరితలంలో కాకుండా,ఆర్థికాంశంతో జోడించి దళితజాతి విముక్తికి వేసిన పునాది.
మనలోని ఒక సమూహానికి సమాజం నుంచి సాంత్వన కావాలి. ముఖ్యంగా తమ గురించి ఆలోచించే పాలక వ్యవస్థలు కావాలి. తరతరాల అంతులేని తన్లాటను, శతాబ్దాల వివక్షను, గోసను, మందితో కలిసి తిరగలేని ఒంటరి మానసిక వ్యథను అర్థం చేసుకోగలిగే ఆత్మబంధువు కావాలి. ఆ ఆత్మబంధువు ఒక పాలకుడే అయితే.. ఇక వివక్షకు చరమగీతం పాడే కాలం వచ్చినట్టే. ఆ కాలం ఇప్పుడు వచ్చింది. తెలంగాణలో దళిత జాతి విముక్తం పొందేందుకు ఒక బాట పడ్డది. అదే కేసీఆర్ బాట. సీఎం కేసీఆర్ అమల్లోకి తెచ్చిన ‘దళిత బంధు’ పథకం చరిత్ర లిఖించబోతున్నది.
‘ప్రపంచ కార్మికులారా ఏకం కండి..’ అని ఆర్థిక వివక్షకు గురవుతున్న కార్మిక లోకానికి నాడు కారల్ మార్క్స్ పిలుపునిచ్చిండు. ‘ఆర్థిక వివక్ష మాత్రమే కాకుండా, పుట్టుక ద్వారా జాతి, కులవివక్షకు గురవుతున్న 165 జాతులకు చెందిన బాధితులారా ఏకం కండి’ అని కేసీఆర్ ‘దళితబంధు’ పథకం ప్రారంభోత్సవం సందర్భంగా హుజూరాబాద్ బహిరంగసభ వేదికగా ప్రపంచానికి పిలుపునిచ్చిండు. ఆర్థిక వివక్షనే ప్రధానం చేసుకున్నది మార్క్సిజం. నేడు సామాజిక వివక్షను ప్రధానం చేసుకున్నది కేసీయారిజం.
21వ శతాబ్దం ప్రారంభం దాకా అటు భౌగోళిక విముక్తి దిశగా, ఇటు సామాజిక సమానత్వం దిశగా సిద్ధాంత కార్యాచరణలు తెలంగాణలో నడిచాయి. మార్క్స్ నుంచి మహాత్మా ఫూలే, అంబేద్కర్ మీదుగా పలు ప్రయోగాలు తెలంగాణలో జరిగినయి. అయితే 2001 నుంచి తెలంగాణలో కేసీఆర్ కార్యాచరణ ప్రారంభమైంది. రాజకీయ పాలనారంగాల్లో గుణాత్మక దిశగా ఓ పారడైమ్ షిప్టు చోటుచేసుకున్నది. ‘దళిత బంధు’ ప్రారంభం ద్వారా తెలంగాణలో సమసమాజ స్థాపన దిశగా చరిత్ర కీలక మలుపు తిరిగింది.
దేశీయ ప్రధాన స్రవంతి రాజకీయ యవనిక మీద ‘కేసీయారిజం’ అనుసరిస్తున్న కుల, సామాజిక, తాత్త్విక విధానాన్ని అర్థం చేసుకోవాల్సి ఉన్నది. ప్రాంతీయ వివక్షకు వ్యతిరేకంగా పోరాడి తెలంగాణకు రాష్ట్ర హోదా కల్పించి ‘ఇండియన్ ఫెడరల్ సిస్టం’ను బలోపేతం చేసే దిశగా ప్రాంతీయ న్యాయం కోసం ముందడుగు వేసింది కేసీయారిజం. అదే సమయంలో నిచ్చెన మెట్ల సమాజంలో వెనకబడేసిన కులాలను రాజకీయ, ఆర్థిక, విద్యారంగాల్లో ముందుంచడం ద్వారా సామాజిక న్యాయాన్ని సాధించే ప్రయత్నం ప్రారంభించింది కేసీయార్ ఆలోచనా విధానం.
వర్గ విభజన గురించి మార్క్స్ చెప్పినట్టు, సామాజిక విభజన ఈ దేశంలో వర్గం కేంద్రంగా జరగలేదు. కులం కేంద్రంగా జరిగింది. కాబట్టి దేశంలో వర్గం లేదు, కులం మాత్రమే ఉన్నది. అదే ఈ దేశ సామాజిక నిర్మాణం. కులమే వాస్తవం అనే దేశీయ సామాజిక గతితర్కాన్ని అంత లోతుగా సూక్ష్మంగా పట్టుకున్న ఒకే ఒక దేశీయ విప్లవకారుడు, పాలకుడు కేసీఆర్. కులాలను, వర్గాలకు కుదించకుండా, సబ్బండ వృత్తులకు వారి వారి కులాల పేరు మీదనే వృత్తి గౌరవాన్ని ఆపాదిస్తున్న ఒకే ఒక్క పాలకుడు కేసీఆర్. రాష్ట్ర ప్రభుత్వం అదే స్ఫూర్తిని కొనసాగిస్తూ ఎస్సీ కులాల అభివృద్ధి కోసం ‘దళిత బంధు’ ద్వారా విప్లవాత్మక కార్యాచరణ చేపట్టింది.
దళితులను సామాజిక ప్రధాన స్రవంతిలో, ఉత్పత్తిలో భాగం చేసే ప్రక్రియే ‘దళితబంధు’. ఇది కుటుంబానికి రూ.10 లక్షల ఆర్థిక సాయమే కాదు, ఇది దళితులను సమాజంలో, సామాజిక ఉత్పత్తిలో భాగస్వాములను చేసేందుకు కేసీఆర్ ఇచ్చిన ఉద్యమ పిలుపు. సమసమాజానికి దేశంలో పడుతున్న మేలి అడుగు. కులాన్ని ఉపరితలంలో కాకుండా, ఆర్థికాంశంతో జోడించి దళితజాతి విముక్తికి వేసిన పునాది. ‘మీరు ఇదే పని చేసుకుని బతుకాలె’ అనే తరతరాల వర్ణ సాంచాలను ధ్వంసం చేసేందుకు పుట్టిందే దళితబంధు. అందుకే ఎస్సీ కులాలు కేవలం వారికి నిర్దేశించిన తరతరాల వృత్తినే చేసుకోమని కేసీఆర్ చెప్పట్లేదు. వ్యాపారం దగ్గరి నుంచి ఏ వృత్తినైనా స్వీకరించవచ్చునని స్పష్టం చేస్తున్నరు. కార్మికవర్గ చైతన్యం అంటే ఈ దేశంలో దళిత కుల చైతన్యమే. దానికి నాందీ ప్రస్తావనే దళితబంధు.
దేశంలో సంపద సృష్టి దళిత బహుజన కులాలు చేస్తున్న రెక్కల కష్టం ద్వారానే పోగవుతున్నదనే తాత్త్వికత గల పాలకుడు కేసీఆర్. ‘ఎవరైతే సంపదకు సృష్టి కర్తలో వారినే ఊరికి దూరంగా ఉంచి, నువ్వు అంటరాని వాడవు, నీవు ఊరవతల ఉండు అనేది ఎవడు కనిపెట్టిండో కానీ ఇది దుర్మార్గం’ ఇదీ కేసీఆర్ ఆవేదన. ఈ ఆవేదనకు ప్రతిరూపమే దళితబంధు. దళిత సమాజాన్ని మందిలో కలిపేందుకే దళితబంధు.
ప్రపంచవ్యాప్తంగా దళితుల మాదిరిగానే 165 జాతులు సామాజిక వివక్షకు, అణచివేతకు గురై ఉన్నాయి. ఆస్తులు, అవకాశాల్లేక అణగారి ఉన్నాయి. దేశంలో అంబేద్కర్ చేసి న పోరాటాల ఫలితంగా దళితులకు కొద్దిమేర న్యాయం జరిగింది. కొన్ని పదవుల్లో రిజర్వేషన్లు, కొందరికి ఉద్యోగాలు లభించాయి. కానీ ఇప్పటికీ 95 శాతం మంది దళితులు పేదరికంలోనే మగ్గుతున్నరు. అందుకే కేసీఆర్ ప్రభు త్వం దళితబంధుకు శ్రీకారం చుట్టింది. దళిత బహుజనం కుల స్పృహతో బతుకాలని ఫూలే చెప్పిండు. దాన్ని అంబేద్కర్ అమలుచేసి చూయించిండు. అదే కార్యాచరణను దళితబంధు ద్వారా అమలుచేస్తున్నదే కేసీయారిజం. యావత్ దేశం నేడు తెలంగాణ లోని దళితవాడను చూడబోతున్నది. సామాజిక, ఆర్థిక వివక్ష నుంచి దళితులను బయట పడేయడం ద్వారా దేశీయ సామాజిక, ఆర్థిక విప్లవ కార్యాచరణకు దళితబంధు బాటలు వేయబోతున్నది. మనందరం దళితబంధువు వెంట నడుద్దాం.
(వ్యాసకర్త: సీఎం పీఆర్వో)
రమేశ్ హజారి