పీవీ నరసింహారావుపై పత్రికలు మౌనమునిగా ముద్రవేశాయి. గిట్టనివారు వాటినే చిలువలు పలువలుగా చేసి ప్రచారం కల్పించారు. అందుకు కారణం లేకపోలేదు. అయితే పీవీ మోములోని గాంభీర్యాన్ని చూసి అందరూ అదే నిజమనుకునేవారు. కానీ వాస్తవానికి పీవీ హాస్య చతురులని ఆయన సన్నిహితులు, దగ్గరి నుంచి చూసినవారు చెబుతుంటారు. అంతేకాదు, అందుకు ఈ సంఘటన ఒక ఉదాహరణ. వరంగల్కు చెందిన పాత తరం రాజకీయ నాయకుల్లో మాజీ మంత్రి హయగ్రీవాచారి ఒకరు. ఆయన అధ్యక్షతన కొనసాగిన ఒక సభా కార్యక్రమానికి పీవీ ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. అయితే సభ ప్రారంభించిన అనంతరం హయగ్రీవాచారి సుదీర్ఘ సమయం పాటు ప్రసంగించారు. అప్పటికీ ఆ సభకు హాజరైన జనం విసుగెత్తి ఎటువారు అటు వెళ్లిపోవడం మొదలుపెట్టారు. చివరికి ఎట్టకేలకు హయగ్రీవాచారి తన ప్రసంగం ముగించి పీవీని ఉపన్యసించవల్సిందిగా ఆహ్వానించారు. మైకు వద్దకు వెళ్తూనే పీవీ ‘ఇప్పటివరకు హయగ్రీవాచారి ఎల్పీ విన్నారు. ఇక నా ఎల్పీ కూడా వినండి’ అనగానే సభలో నవ్వులు విరబూశాయి. (ఎల్పీ అంటే గ్రామ్ ఫోన్ రికార్డులకు వినియోగించే లాంగ్ ప్లే టేపు. ఒక్కో టేపు నిడివి సుమారు గంటన్నర ఉంటుంది) ఆ తర్వాత పీవీ చేసిన ప్రసంగాన్ని శ్రోతల్లో ఉత్సాహం నింపేలా సాగింది.