సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమ(ఎంఎస్ఎంఈ)లు పరిమిత పెట్టుబడితో ఉత్పత్తి, ఉపాధి కల్పిస్తూ దేశ ఆర్థికాభివృద్ధికి చోదకశక్తిగా ప్రధాన పాత్ర వహిస్తున్నాయి. వ్యవసాయరంగం తర్వాత 6.33 కోట్ల ఎంఎస్ఎంఈలు 11 కోట్ల మందికి ఉపాధి కల్పిస్తున్నాయి.
ఆత్మనిర్భర్ ప్యాకేజీలో భాగంగా ప్రకటించిన ఆర్థిక సాయాన్ని ఎంఎస్ఎంఈలు సంపూర్ణంగా వినియోగించుకొని ఈ రంగాన్ని తిరిగి పూర్వస్థితికి తీసుకురావాలి. ‘59 మినిట్ లోన్’, 2 శాతం వడ్డీ రాయితీ రుణాలను సద్వినియోగం చేసుకోవాలి. నూతన వర్గీకరణ ప్రకారం అన్ని ఎంఎస్ఎంఈలు ఉద్యమ్ పోర్టల్లో నమోదు చేసుకోవాలి. ఎంఎస్ఎంఈలు డిజిటలీకరణ వైపు అడుగులు వేస్తూ అంతర్జాతీయ మార్కెట్ ద్వారా ప్రపచమంతటా తమ వస్తువులను వ్యాపింపజేయాలి.
సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు దేశ జీడీ పీలో 30 శాతం, పారిశ్రామిక ఉత్పత్తిలో 45 శాతం, ఎగుమతుల్లో 48 శాతం వాటా కలిగి ఉన్నాయి. దాదాపు 8 వేల రకాల వస్తువులను తయారుచేస్తున్నాయి. మొత్తం ఎంఎస్ఎంఈలలో 51 శాతం వరకు గ్రామీణ ప్రాంతాల్లో ఉండి గ్రామీణ ఉపాధి కల్పనలో, అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. మొత్తం ఎంఎస్ఎంఈలలో 99 శాతం సూక్ష్మ పరిశ్రమలు కాగా, మిగిలిన 1 శాతం చిన్న, మధ్యతరహా పరిశ్రమలుగా పనిచేస్తున్నాయి. వీటిలో 31 శాతం తయారీ రంగంలో, 36 శాతం వర్తక రంగంలో ఉండగా, 33 శాతం సేవల రంగంలో పనిచేస్తున్నాయి. ఇటీవల తయారీ, సేవల రంగాలను కలిపి పెట్టుబడి, టర్నోవర్ ఆధారంగా ఎంఎస్ఎంఈలను నూతనంగా వర్గీకరణ చేశారు. రూ.కోటి వరకు పెట్టుబడి, 5 కోట్ల వరకు టర్నోవర్ కలిగిన వాటిని సూక్ష్మ పరిశ్రమలుగా, రూ.10 కోట్ల వరకు పెట్టుబడి, 50 కోట్ల వరకు టర్నోవర్ కలిగిన వాటిని చిన్న పరిశ్రమలుగా, రూ. 50 కోట్ల వరకు పెట్టుబడి, 250 కోట్ల వరకు టర్నోవర్ కలిగిన వాటిని మధ్య పరిశ్రమలుగా నిర్వచించారు. అత్యధికంగా 10.76 కోట్ల మంది సూక్ష్మ పరిశ్రమల్లో ఉపాధి అవకాశాలను పొందుతుండగా, 31.95 లక్షలు మంది చిన్న పరిశ్రమల్లో, 1.75 లక్షల మంది మధ్యతరహా పరిశ్రమల్లో ఉపాధి పొందుతున్నారు. ఎంఎస్ఎంఈలు 55 శాతం ఉపాధిని పట్టణాల్లో, 45 శాతం ఉపాధిని గ్రామీణ ప్రాంతాల్లో కల్పిస్తున్నాయి.
కరోనా మహమ్మారిని కట్టడి చేయడానికి విధించిన లాక్డౌన్తో కుదేలైన సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలను తిరిగి గాడిన పెట్టేందుకు కేంద్రం రూ.3.70 లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజీని ప్రకటించింది. దీనిలో భాగంగా 45 లక్షల ఎంఎస్ఎంఈలకు ప్రయోజనం కల్పించే ఉద్దేశంతో ఎమర్జెన్సీ క్రెడిట్ లైన్ గ్యారెంటీ స్కీం (ఈసీఎల్ జీఎస్) కింద హామీ లేని రుణాలను అందించే ఉద్దేశంతో రూ.3 లక్షల కోట్లను ప్రకటించింది. అయితే 2021, ఫిబ్రవరి 28వ తేదీ వరకు వివిధ ఎంఎస్ఎంఈలకు రూ.2.46 లక్షల కోట్లు అనుమతించగా, రూ. 1.81 లక్షల కోట్లు చెల్లింపు చేశారు. ఇటీవల ఈ పథకాన్ని జూన్ 30 వరకు లేదా రూ.3 లక్షల కోట్లు పూర్తయ్యేంత వరకూ పొడిగించారు. కావున ఎంఎస్ఎంఈలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. అదేవిధంగా పారుబాకీల సమస్యను ఎదుర్కొంటున్న 2 లక్షల ఎంఎస్ఎంఈలకు ఈక్విటీ మూలధనం సహాయం చేసే ఉద్దేశంతో రూ. 20 వేల కోట్లతో సబార్డినేట్ డెట్ ఫండ్ను ఏర్పాటుచేయడం మంచి పరిణామం. ఈ పథకం కింద మార్చి 10 వరకు రూ.40.56 కోట్లు మంజూరు చేసినట్లు ఎంఎస్ఎంఈల శాఖామాత్యులు నితిన్ గడ్కరీ వెల్లడించారు.
ఈ పథకాన్ని ఇంకా చాలా ఎంఎస్ఎంఈలు వినియోగించుకోవాల్సి ఉన్నది. సుస్థిరాభివృద్ధి సాధిస్తూ, విస్తరణకు అవకాశం ఉన్న ఎంఎస్ఎంఈలను మరింత బలోపేతం చేసి, స్టాక్ ఎక్ఛేంజీలలో తమ వాటాలను నమోదు చేసుకునే విధంగా వాటికి ఈక్విటీ మూలధనం సహా యం చేసే ఉద్దేశంతో రూ.50 వేల కోట్లతో ‘ఫండ్ ఆఫ్ ఫండ్స్’ను ప్రకటించింది. దీన్ని పూర్తిస్థాయిలో అమలుచేయవలసి ఉన్నది. ఇంకా ఈ-మార్కెట్ లింక్ సదుపాయం, ప్రభుత్వం, ప్రభుత్వరంగ సంస్థల నుంచి ఎంఎస్ఎంఈలకు రావలసిన బాకీలను 45 రోజుల్లో పరిష్కరించే విధంగా ప్రకటించిన చర్యలు ఎంఎస్ఎంఈలను తిరిగి గాడిన పెట్టడానికి ఎంతో ఉపయోగకరమైనవిగా చెప్పవచ్చు. అత్మనిర్భర్ భారత్ ప్యాకేజీ ప్రకటించిన తర్వాత అఖిల భారత ఉత్పత్తిదారుల సంఘం దాదాపు 46,525 మంది ఎంఎస్ఎంఈల యాజమానులు, స్వయం ఉపాధి దారులు, కార్పొరేట్ సీఈఓలు, కార్మికులు, ఇతరులపై సర్వే జరిపింది. కొవిడ్ సంక్షోభం వల్ల జరిగిన నష్టం నుంచి కోలుకునే అవకాశాలు లేకపోవడంతో 35 శాతం ఎంఎస్ఎంఈలు, 37 శాతం మంది స్వయం ఉపాధి పొందేవారు తమ పరిశ్రమలను మూసివేయడమే శరణ్యమని ఈ సర్వేలో వెల్లడైంది.
ఆత్మనిర్భర్ ప్యాకేజీలో భాగంగా ప్రకటించిన ఆర్థిక సాయాన్ని ఎంఎస్ఎంఈలు సంపూర్ణంగా వినియోగించుకొని ఈ రంగాన్ని తిరిగి పూర్వస్థితికి తీసుకురావాలి. ‘59 మినిట్ లోన్’, 2 శాతం వడ్డీ రాయితీ రుణాలను సద్వినియోగం చేసుకోవాలి. నూతన వర్గీకరణ ప్రకారం అన్ని ఎంఎస్ఎంఈలు ఉద్యమ్ పోర్టల్లో నమోదు చేసుకోవాలి. ఎంఎస్ఎంఈలు డిజిటలీకరణ వైపు అడుగులు వేస్తూ అంతర్జాతీయ మార్కెట్ ద్వారా ప్రపచమంతటా తమ వస్తువులను వ్యాపింపజేయాలి. దీనికోసం అమెజాన్, ఫ్లిప్కార్ట్ వంటి దిగ్గజ ‘ఈ- కామర్స్’ వేదికలను ఉపయోగించుకోవాలి. ఇవి కూడా ఎంఎస్ఎంఈలను ఆర్థికంగా బలోపేతం చేయడానికి వివిధ రాయితీల రూపంలో తమ వంతు ప్రోత్సాహాన్ని అందించాలి. ప్రధాని మోదీ గతేడాది జూన్ 1న ప్రారంభించిన ‘ఛాంపియన్స్’ సాంకేతిక పోర్టల్ సేవలను ఎంఎస్ఎంఈలు వివిధ రకాల సలహాలకు, సమస్యల పరిష్కారానికి వినియోగించుకోవాలి. సగానికి పైగా ఎంఎస్ఎంఈలు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నాయి. ప్రభుత్వం వీటిలో మౌలిక సదుపాయాల కల్పనకు, కార్మికుల నైపుణ్యాలను పెంచడానికి, ఉత్పత్తిలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించేవిధంగా అవసరమైన చర్యలు చేపట్టాలి. తద్వారా సంతులిత గ్రామీణాభివృద్ధికీ బాటలు పడుతాయి. కేంద్ర ప్రభు త్వం యూకే సిన్హా కమిటీ చేసిన సిఫారసులను సమర్థంగా అమలుచేసి ఎంఎస్ఎంఈ ల సర్వతోముఖాభివృద్ధికి, తద్వారా దేశాభివృద్ధికి అవరమైన చర్యలు చేపట్టాలి!
(వ్యాసకర్త: కామర్స్ సహాయ ఆచార్యులు, అగ్రహారం)
డాక్టర్ ఎం.మల్లారెడ్డి