‘దళిత బంధు’ పథకం సాధ్యాసాధ్యాల మీద అనుమానాలు ప్రచారంలో ఉన్నాయి. హుజూరాబాద్ ఎన్నిక తర్వాత అంతా హుష్కాకి అనే పెదవి విరుపులూ ఉన్నాయి. విమర్శల సంగతి ఏమైనా దళిత కుటుంబాలకు 10 లక్షల చొప్పున ఆర్థిక మద్దతును ఇస్తామని కేసీఆర్ చేసిన ప్రకటన దానికదే ఒక పెద్ద సాహసం. దళితుల అభివృద్ధిలో ప్రతిపాదిస్తున్న నూతన ప్రమాణం.
గత ప్రభుత్వాలు దళితులకు స్వయం ఉపాధి కోసం ఏదో రూపాయి, అర్ధా ఇచ్చి సరిపెట్టుకొమ్మని చెప్పినవే. దళిత ఉద్యమకారులు కూడా 10 లక్షల పెద్ద మొత్తాన్ని ఎప్పుడూ డిమాండ్ చేయలేదు. కానీ కేసీఆర్ దళితులకు అందవలసిన సహాయానికి సంబంధించి ఒక కొత్త ప్రమాణాన్ని నెలకొల్పారు. అందుకు ముఖ్యమం త్రి కేసీఆర్కు మనస్ఫూర్తిగా అభినందనలు చెప్పాల్సిం దే. సుదీర్ఘ రాజకీయానుభవం, తెలంగాణ ఉద్యమాన్ని విజయతీరం చేర్చిన ఘన చరిత్ర ఉన్న కేసీఆర్ అంత అలవోకగా ‘దళిత బంధు’ వంటి పథకాన్ని ప్రకటిస్తారా? గతంలో ఆయన ఇచ్చిన వాగ్దానాలు కొన్ని నిలుపుకోలేదని ప్రతిపక్షాలు అంటున్నాయి. నిలుపుకొన్నవి చాలా ఉన్నాయి కదా. వాటినీ చూడాలి కదా. బడ్జెట్లో సింహభాగం పేద వర్గాల సంక్షేమం కోసం ఖర్చు పెడుతున్నమాట నిజం కాదా?
ఎన్నికల ప్రయోజనం కోసమైనా పేదలు, రైతులు, దళితులు, ఆదివాసులు, మహిళల కోసం మోదీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఒక్కటంటే ఒక్క చెప్పుకోదగిన పథకం ఉందా? కార్పొరేట్లకు చేసిన మేలు
మాత్రం అనేక రూపాల్లో కనిపిస్తున్నది.
తెలంగాణ ప్రభుత్వం ఎజెండా ఇందుకు పూర్తిగా భిన్నం. పేదల సంక్షేమమే కేసీఆర్ ఎజెండా. ఎన్నెన్ని పథకాలు? ఒకటా రెండా? దాదాపు యాభై సంక్షేమ పథకాలు యాభై వేల కోట్ల వ్యయంతో అమలవుతున్నాయి. రైతుబంధు, రైతు బీమా పథకాల వల్లనైతేనేమి, 24 గంటల ఉచిత కరెంటు వల్లనైతేనేమి, ప్రాజెక్టుల ద్వారా చెరువులు నింపటం వల్లనైతేనేమి, వ్యవసాయంలో ఫలసాయం పెరిగింది. రాష్ట్ర జీడీపీలో 20 శాతం ఆదాయం వ్యవసాయం నుంచి రావటం నిజం గా గొప్ప మార్పు. ఈ సానుకూలతను చూసేందుకు నిరాకరిస్తే విజ్ఞత ఎలా అవుతుంది? పార్టీ కార్యకర్తల జేబులు నింపేందుకు సీసీ రోడ్లు తప్ప గ్రామాల్లో ఇతర మౌలిక సదుపాయాల గురించి గత ప్రభుత్వాలు పట్టించుకున్న దాఖలా ఉందా?
సంక్షేమ పథకాల వరుసలో సామాజిక వేదిక మీద ఇప్పుడు దళితబంధు వచ్చి నిలిచింది. ఉదాత్త ఆశయంతో, ఉన్నత లక్ష్యంతో, ఉత్తమమైన ప్రతిపాదనలతో నిండిన పథకం తెలంగాణ ‘దళిత బంధు’. ప్రజలను ప్రేమించేవారు ముందు ఈ ఆలోచనను బలపరచాలి. అణగారిన జాతికి అధిక మొత్తాన్నివ్వాలని, స్వశక్తితో స్వాభిమానంతో వారిని నిలబడేలా చేయాలనే ప్రభుత్వ తలంపునకు స్వాగతం పలకాలి. ‘ఆరంభింపరు నీచమానవులు’ అనే భర్తృహరి సుభాషితాన్ని పదేపదే ఉదహరించే కేసీఆర్ తన ధీరోదాత్తతను తానే ఇప్పుడు కాలపరీక్షకు నిలిపారు. వేచి చూడాలి కదా.
రెండవసారి ప్రభుత్వ పగ్గాలు చేపట్టిన తర్వాత, ఐదేండ్ల పరిపాలనా కాలం మధ్య దశలో ‘దళిత బంధు’ను ప్రవేశపెడుతూ కేసీఆర్ సాహసాన్ని చేస్తున్నారు. రాబోయేరోజుల్లో జనం ముందు అగ్నిపరీక్షకు నిలబడవలసి ఉంటుందని కేసీఆర్కు తెలియదా?తప్పకుండా తెలుసు. భారీ వ్యయంతో కూడిన ‘దళిత బంధు’ పథకాన్ని పూర్వాపరాలు విచారించకుండా, తగిన సన్నద్ధత లేకుండా ప్రవేశపెట్టారని ఎవరైనా అనుకుంటే అది వారి అమాయకత్వమైనా కావాలి, లేదా యాంత్రికమైన వ్యతిరేకతైనా కావాలి.
ప్రభుత్వానికి ప్రస్తుతం ప్రాజెక్టుల నిర్మాణం కోసం పెడుతున్న వ్యయం తగ్గింది. ప్రభుత్వ భూములను అమ్మకానికి పెడుతున్నారు. ఆదాయాన్ని పెంచుకునే మరిన్ని కొత్త మార్గాలేవో కేసీఆర్ ఆలోచనల్లో ఉండే ఉంటాయి. ఆ నిధులను దళితులకు పంచుదామని ఆయన ఆలోచిస్తే అంతకన్నా కావలసిందేముంది? స్వాగతించాల్సిందే.
దళిత కుటుంబాల్లో ‘దళిత బంధు’ చర్చ జోరుగా సాగుతున్నది. హుజూరాబాద్ దళిత కుటుంబాల్లో మంచి బతుకుకు సంబంధించిన ఆశలు మోసులెత్తుతున్నాయి. తామొక మంచి ఉపాధిని ఎంచుకునే వరం తమకు లభించబోతున్నదనే సంతోషం వారిలో కనిపిస్తున్నది. ట్రాక్టర్ కొనుక్కుంటామని, హార్వెస్టర్ కొనుక్కుంటామని, మెడికల్ షాప్ పెట్టుకుంటామని రకరకాల యోచనలు చేసుకుంటున్నారు. ప్రగతిభవన్లో జరిగిన వర్క్షాప్లో ఇచ్చిన వివిధ ఉపాధి మార్గాల పట్టికను అందరూ ఆసక్తిగా పరిశీలిస్తున్నారు. తెలంగాణ దళితబంధు విశాలదృష్టితో ప్రవేశపెడుతున్న విలక్షణ పథకం. 10 లక్షల గ్రాంటు ద్వారా లబ్ధిదారుడు నికరంగా మంచి ఆదాయం పొందడానికి వీలైన యూనిట్ ప్రారంభించుకోవచ్చు. చాలా సంతృప్తికరమైన స్థాయి పెట్టుబడి అని చెప్పవచ్చు. లబ్ధిదారులు కొంతమంది సమూహంగా కూడితే చిన్న లేక మధ్యతరహా పరిశ్రమనే పెట్టుకోవచ్చు. ఉపాధిమార్గాల అన్వేషణలో ప్రభుత్వ సహకారం ఉంటుంది. ఉపాధి ఎంపికలో లబ్ధిదారులకు పూర్తి స్వేచ్ఛ ఉంది. తిరిగి చెల్లించాలీ, కిస్తీలు కట్టాలనే భయం లేదు. బాకీ కట్టాలనే రంది లేదు. కాబట్టి వచ్చిన ఆదాయం సంపూర్ణంగా వినియోగించుకోవచ్చు. యూనిట్ విజయవంతం కావటానికి ప్రభుత్వం పర్యవేక్షణ, మార్గదర్శనం ఉంటాయి. తన యూనిట్కు సంబంధించిన ప్రభుత్వ శాఖ ఆ బాధ్యత తీసుకుంటుంది. వివిధ శాఖలతో గ్రామ, మండల, జిల్ల్లా, రాష్ట్రస్థాయి పర్యవేక్షణ కమిటీలుంటాయని ప్రభుత్వం ప్రకటించింది. ఆపద వస్తే ఆదుకునే ‘దళిత రక్షణ నిధి’ అదనపు బలం చేకూరుస్తుంది. దళితవాడల్లో మౌలిక సదుపాయాల కల్పన మీద కూడా ప్రభుత్వం దృష్టి సారిస్తున్నది. దళితుల మీది కేసుల ఎత్తివేత విషయాన్ని పరిశీలిస్తున్నది. అణగారిన జాతిలో ధైర్యం నింపే అన్ని అంశాలూ ‘దళిత బంధు’లో ఉన్నాయి.
అందరికీ సమానహక్కులు, ప్రతిపత్తి కలిగించటమనేది గొప్ప సామాజిక, ఆర్థిక రాజకీయ కృషి. భారత రాజ్యాంగ లక్ష్యం కూడా అదే. దళితుల కోసం ప్రత్యేక ఆవాస విద్యాలయాల స్థాపన, మార్కెట్ కమిటీల్లో రిజర్వేషన్లను ప్రవేశపెట్టడం, ఎస్సీ ప్రగతినిధి చట్టం వంటి చర్యలతో దళితుల సామాజిక వికాసం దిశగా తెలంగాణ ప్రభుత్వం తొలి అడుగులు బలంగా వేసింది. రాజ్యాంగం ప్రవచించిన విలువల సాధనలో ‘దళిత బంధు’ ద్వారా నేడు నూతన ప్రమాణాలను ప్రతిపాదిస్తున్నది.
సామాజిక, ఆర్థిక, న్యాయ సాధనలో ప్రభుత్వం తన బాధ్యతలను, కర్తవ్యాలను గుర్తించటంలోనే సగం విజయం ఇప్పటికే సాధించింది. సమాజాన్ని మరింత నాగరికంగా మార్చే ప్రతి చర్య ఆహ్వానించదగినదే. పథకం సాఫల్య వైఫల్యాలను ప్రతిపక్షం చర్చించాలి కానీ, పురిట్లోనే సంధి కొట్టాలనే దురాలోచన మానుకోవాలి. అమంగళం ప్రతిహతమవుగాక. తెలంగాణ ‘దళిత బంధు’ను రాష్ట్రవ్యాప్తంగా అమలుచేసి టీఆర్ఎస్ ప్రభుత్వం సంపూర్ణ విజయాన్ని పొందాలని ఆకాంక్షిద్దాం. బహుజన హితాయ.. బహుజన సుఖాయ..
‘వాడు చెమ్మటలోడ్చి ప్రపంచమునకు భోజనము పెట్టు వానికి భుక్తి లేదు’తమ రెక్కల కష్టం సైతం తమది కాకుండా పోతున్న దళితజాతి పరివేదనను పలికించిన పద్య పాదం ఇది. మహాకవి జాషువా కమనీయలేఖిని కార్చిన కన్నీటి బిందువు ఇది. పరిశుద్ధికి, పరిశ్రమకు పెట్టని కోటలు దళితవాడలు. చచ్చిన పశువుల చర్మం తీసి డప్పును, చెప్పును మలిచిన కళావేత్తలు. మోట నీటిని చేలకు పారించే తొండం బొక్కెన కనుగొన్న శాస్త్రవేత్తలు దళితబిడ్డలు. అమృతోత్సవ స్వాతంత్య్రం సాక్షిగా అర్ధాకలితో అలమటిస్తున్న అర్ధ బానిసలు దళితబిడ్డలు. నేటికీ కైకిలి కోసం తండ్లాడే కూలిబిడ్డలు, యంత్రభూతముల కోరలు తోమే కార్మికన్నలు అంతా దళితజాతి బిడ్డలే. వారి చెమట బిందువులే గాదెల్లో నిండిన ధాన్యపు గింజలు, వారి నెత్తురు మాంసాలే కండ్లు మిరుమిట్లు గొలిపే మహా సంపదలు.
ప్రజాస్వామ్యానికి మరోపేరు సమానత్వం. అణగారిన జాతుల వారికి సమానత్వం అందని మావిఫలం. ఆ అగాధాన్ని పూడ్చటం కన్నా మించిన కర్తవ్యం ప్రజాస్వామిక ప్రభుత్వాలకు వేరొకటి ఉండదు. ‘పొదల పొదల గట్ల నడుమ పొడిచేనమ్మ చందామామ’ అన్నట్లు దళితజాతికి తెలంగాణ ప్రభుత్వం ఒక నూతన ఆశ్వాసాన్ని ఇస్తున్నది. నమ్మకం కోల్పోయిన జాతిలో ఒక కొత్త ఆశారేఖను ఉదయింపజేస్తున్నది.
–డి.అభిజ్ఞ