దేశానికి స్వాతంత్య్రం వచ్చి 74 ఏండ్లు పూర్తవుతున్నప్పటికీ మెజారిటీ ప్రజలైన బీసీలు ఇప్పటికీ ఆర్థికంగా వెనుకబడే ఉన్నారు. కేంద్ర ప్రభుత్వంలో 80కి పైగా మంత్రిత్వశాఖలు ఉన్నప్పటికీ జనాభాలో సగభాగం ఉన్న బీసీల కోసం ఒక ప్రత్యేక మంత్రిత్వ శాఖ లేకపోవడం విషాదం. కేంద్ర ప్రభుత్వంలో ప్రత్యేక మంత్రిత్వశాఖ ఏర్పాటుచేయాలని బీసీలు ఏండ్లకొద్దీ కోరుతున్నా పెడచెవిన పెట్టి, ఓటు బ్యాంకు రాజకీయాల కోసమే వాడుకుంటున్నారు. ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటైతే ఆ శాఖ మంత్రి, అధికారులు ఇతర రాష్ట్ర ప్రభుత్వాలతో సంప్రదింపులు జరిపి వారి అభివృద్ధి, సంక్షేమం కోసం సమన్వయంతో ప్రణాళికలు రూపొందించే అవకాశం ఉంటుంది.
ఇటీవల జరిగిన కేంద్ర మంత్రివర్గ విస్తరణలో కొత్తగా సహకార శాఖ ఏర్పాటు చేశారు. కానీ బీసీలకు ప్రత్యేక మంత్రిత్వశాఖను ఏర్పాటుచేయకపోవడం బీజేపీకి బీసీల పట్ల ఉన్న చిత్తశుద్ధిని తెలుపుతున్నది. ఎంపీ, ఎమ్మెల్యేలలో ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు ఉండటంతో ఆ వర్గాల ప్రాతినిధ్యం చట్టసభల్లో కనిపిస్తున్నది. కానీ బీసీలకు రిజర్వేషన్లు లేకపోవడంతో బీసీల ప్రాతినిధ్యం చాలా తక్కువ ఉంటున్నది.
ఉద్యమనేత కేసీఆర్ కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు బీసీల కోసం ప్రత్యేక శ్రద్ధ కనబరిచారు. బీసీ నేతలను స్వయంగా ప్రధాని దగ్గరికి తీసుకువెళ్లి ప్రత్యేక మంత్రిత్వశాఖను ఏర్పాటుచేయాలని కోరారు. అలాగే చట్టసభల్లో బీసీలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించాలని విజ్ఞప్తి చేశారు. కానీ కాంగ్రెస్ అధినాయకత్వం ఆ విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకోలేదు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత చట్టసభల్లో బీసీలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించాలని సీఎం కేసీఆర్ నాయకత్వంలో అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపారు. విద్య ద్వారానే బీసీ వర్గాలు అభివృద్ధి చెందుతాయనే ఉద్దేశంతో వారికి విద్యారంగంలో పెద్దపీట వేశారు. ఉమ్మడి రాష్ట్రంలో 19 బీసీ గురుకుల పాఠశాలలు మాత్రమే ఉండేవి. ఇప్పుడు నియోజకవర్గానికి ఒక్కటి చొప్పున మొత్తం 261 బీసీ గురుకుల పాఠశాలలను ఏర్పాటుచేశారు. ఒక్కో విద్యార్థిపై రాష్ట్ర ప్రభుత్వం ఏటా రూ.లక్షా 25 వేలు ఖర్చుచేస్తున్నది. విద్యార్థులకు పౌష్టికాహారం అందిస్తూ అన్నిరకాల సదుపాయాలు కల్పిస్తున్నది. ఉద్యోగ, ఉపాధి అవకాశాల కోసం బీసీ స్టడీ సర్కిల్ను ఏర్పాటుచేసింది. రానున్న రోజుల్లో నియోజకవర్గానికి ఒక్కటి చొప్పున 119 బీసీ స్టడీ సర్కిళ్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం సంకల్పించింది. ఉన్నత విద్యకోసం విదేశాలకు వెళ్లే పేద విద్యార్థుల కోసం మహాత్మా జ్యోతిరావు పూలే పేరు మీద రూ.20 లక్షల ఓవర్సీస్ స్కాలర్షిప్ అందజేస్తున్నది.
బీసీలను రాజకీయంగా అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ఏ రాష్ట్రం లో లేనివిధంగా మార్కెట్ కమిటీల్లో రిజర్వేషన్లు ఏర్పాటుచేసింది. దాంతో వందలమంది బీసీ నేతలు మార్కెట్ కమిటీ చైర్మన్లు అయ్యా రు. స్థానిక సంస్థల్లో 50 శాతం మహిళా రిజర్వేషన్లు పెట్టి దాంట్లో కూడా 27 శాతం బీసీ మహిళలను ప్రజాప్రతినిధులు చేశారు. ప్రభుత్వం బీసీల కోసం కార్పొరేషన్ ఏర్పాటుచేసి ఆర్థికంగా చేయూతనందిస్తున్నది. చేసిన తప్పులకు గాను క్రమశిక్షణ చర్యల్లో భాగంగా మంత్రివర్గం నుంచి ఈటలను తొలగించవలసి వచ్చింది. తన మంత్రి పదవి పోయిన వెంటనే ఆయనకు బీసీల ఆత్మగౌరవం గుర్తుకువచ్చింది. బీసీల పేరుతో ఎక్కువ పదవులు అనుభవించింది ఈటల మాత్రమే. తనకు తాను బీసీ అని చెప్పుకోవడం తప్ప తన వ్యాపార భాగస్వాముల్లో ఏ ఒక్కరూ బీసీలు లేరనేది బహిరంగ రహస్యం. నిన్న మొన్నటిదాకా బీజేపీని నిందించిన ఈటలకు ఆ పార్టీలో గౌరవం ఉంటుందా అని ప్రజలే ప్రశ్నిస్తున్నారు.
బీజేపీ అధికారంలోకి వచ్చి ఏడేండ్లవుతున్నా.. బీసీలకు ప్రత్యేక మంత్రిత్వశాఖ, చట్టసభల్లో బీసీలకు 33 శాతం రిజర్వేషన్లు ఇవ్వకపోవడం బీసీల పట్ల ఆ పార్టీకి ఉన్న కపట ప్రేమకు నిదర్శనం. 2021లో చేపట్టబోయే జనాభా లెక్కల్లో బీసీ కులాల జనాభా లెక్క లు చేయబోమని కేంద్రమంత్రి పార్లమెంట్ సాక్షిగా ప్రకటించడం బీజేపీ బుద్ధిని తెలుపుతున్నది. బీజేపీకి బీసీల పట్ల నిజంగా చిత్తశుద్ధి ఉంటే తక్షణమే ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటుచేయాలి. చట్టసభల్లో బీసీలకు 33 శాతం రిజర్వేషన్లు ప్రకటించాలి.
(వ్యాసకర్త: టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు)
– కిషోర్ గౌడ్, 99125 06685