రాష్ట్ర ఆవిర్భావం తర్వాత పరిస్థితులు మారాయి. కేటీఆర్ టెక్స్టైల్స్ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత చేనేత పరిశ్రమలో పెద్ద కదలిక వచ్చింది. చేనేత పరిశ్రమ ముందుకు సాగుతున్నది. రాష్ట్రంలో ఏటా ఘనంగా జరుపుకునే బతుకమ్మ పండుగకు ప్రతీ ఆడబిడ్డకు కొత్త చీర అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం చీరల పంపిణీ చేస్తున్నది. ఏటా దాదాపు కోటిన్నర చీరలను ప్రభుత్వం ఉచితంగా ఇస్తున్నది. దీంతో నేతన్నలకు ఉపాధి పెరిగింది.
రాష్ట్ర ప్రభుత్వం చేనేతకూ బీమా పథకం తీసుకొస్తామని ప్రకటించటం హర్షణీయం. నేత కార్మికులు సాధికారత సాధించాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ దీనికి రూపకల్పన చేస్తున్నారని చెప్పవచ్చు. ‘రైతుబీమా’ తరహాలోనే ‘చేనేత బీమా’నూ అమలుచేయాలని ప్రభుత్వం భావిస్తుండటం ముదావహం. ఈ ఏడేండ్ల కాలంలో చేనేత పరిశ్రమ వైభవాన్ని సంతరించుకున్నది. వేల మంది చేనేత కార్మికులకు ఉపాధి లభించడంతో పాటు కాకతీయ మెగా టెక్స్టైల్స్, సిల్క్ హబ్స్ల ఏర్పాటుకు సన్నద్ధమవుతున్నది.
అనేక దేశాలు విద్య, ఆరోగ్యం, బీమా వంటి రంగాల్లో కీలకంగా వ్యవహరిస్తున్నాయి. 30 కోట్ల జనాభా ఉన్న అమెరికాలో 40 శాతం మందికిపైగా ఆరోగ్య బీమా కలిగి ఉండటం విశేషం. కానీ మన దేశం బీమా రంగం లో వెనకబడి ఉండటం బాధాకరం. 3.2 శాతం మంది మాత్రమే బీమా పొందుతున్నట్లు ‘ఇన్స్యూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా’ నివేదికలు చెప్తున్నాయి. ప్రభుత్వా లు దృష్టిపెట్టకపోవడం, బ్యాంకుల కఠిన విధానాలు, ప్రజల్లో బీమా పట్ల అవగాహన లేకపోవడం వంటి కారణాలే దీనికి కారణం. కానీ, రాష్ట్ర ప్రభుత్వం బీమా రంగంపై వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నది. రాష్ట్ర జనాభాలో రైతాంగం అధికంగా ఉండటం వల్ల మొట్టమొదట రైతుల నుంచే బీమాను ప్రారంభించటం గమనార్హం. వ్యక్తిగతంగా ఎలాం టి ప్రీమియం చెల్లించకున్నా, చనిపోయిన రైతుకుటుంబాలకు రూ.5 లక్షల వంతున బీమా అందిస్తున్నది. సుమారు 32.73 లక్షల మంది రైతులకు సంబంధించిన ప్రీమియం ప్రభుత్వమే చెల్లించడం విశేషం. ‘తెలంగాణ ఎకనామిక్ సర్వే 2019-20’ నివేదిక ప్రకారం ఆయా కుటుంబాలకు చెల్లించిన బీమా సొమ్ము మొత్తం రూ. 2,917 కోట్లు.
రాష్ట్రంలో చేనేత పరిశ్రమ కీలకమైనది. గద్వాల, పోచంపల్లి, సిరిసిల్ల, నారాయణపేట వంటి నగరాల్లో చేనేత వస్త్ర పరిశ్రమ స్థిరపడి ఉన్నది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 630 చేనేత సహకార సంఘాల్లో 85 వేల మందికి పైగా సభ్యత్వం ఉన్నది. సాంకేతికత అభివృద్ధితో పవర్లూమ్స్ వచ్చాయి. దీంతో చేనేత పరిశ్రమలో నేతన్నలకు ప్రాధాన్యం తగ్గిపోయింది. దీనికితోడుగా షాపింగ్మాల్స్, రెడీమేడ్ దుకాణాల వల్ల చేనేత చీరలపై కాకుండా పవర్లూమ్స్లో తయారయ్యే చీరలకు ప్రాధాన్యం పెరిగింది. గ్రామాల్లో చేనేత మగ్గాలపై ఆధారపడిన చేనేత కుటుంబాలపై పవర్లూమ్స్ ప్రభావం తీవ్రంగా పడింది. గత పాలకులు పరిశ్రమలకు ఇచ్చిన ప్రాధాన్యం తెలంగాణలో ఉన్న సిరిసిల్ల, వరంగల్, కొత్తపేట నేతన్నలకు ఇవ్వలేదు. 2005లోనే పోచంపల్లికి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు జీఐ ట్యాగ్ వచ్చినప్పటికీ నాటి ప్రభుత్వాల తీరు మారలేదు.
తెలంగాణ హ్యాండ్లూమ్ వీవర్స్ థ్రిఫ్ట్ ఫండ్ సేవింగ్ అండ్ సెక్యూరిటీ స్కీం కింద రాష్ట్రంలోని చిన్న, మధ్యతరహా చేనేత పరిశ్రమలను జియో ట్యాగింగ్ చేస్తున్నది. ఈ పథకం ద్వారా నిధులు పొదుపు చేసుకోవచ్చు. ‘నేతన్నకు చేయూత’ పేర నేతన్నలకు, డిజైనర్స్, డయ్యర్స్కు ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరుతున్నది. ప్రభుత్వం తమ వాటాను ఇందులో 8 నుంచి 16 శాతానికి పెంచింది. ఆసరా పింఛన్ పథకంలో నేతన్నలకు వయోపరిమితిని 60 నుంచి 55 ఏండ్లకు కుదించి ప్రతి నెలా రూ.1000 ప్రభుత్వం అందిస్తున్నది. చేనేత కార్మికులకు వేతన పరిహార ఇన్పుట్ సబ్సిడీని అన్నిరకాల నూలుపోగు కొనుగోలుపై 20 నుంచి 40 శాతానికి పెంచింది. దీంతో చేనేత కార్మికులకు ఊరట లభిస్తున్నది.
బీమా ఉంటే ధీమాగా ఉండొచ్చు. అందుకోసమే తెలంగాణ ప్రభుత్వం రైతు బీమా పథకాన్ని ప్రవేశపెట్టింది. గత ప్రభుత్వాల హయాంలో గ్రామాల్లో చేనేత కుటుంబాలకు ఎలాంటి సాయం అందక, బీమా సౌకర్యం లేకపోవడంతో వృత్తిని వదిలేసి నగరాలకు వలస వెళ్తున్నారని ‘పీరియాడిక్ లేబర్ సర్వే’, ‘కాన్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్’ నివేదికలు చెప్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఈ వలసలను నివారించటానికి జిల్లా కేంద్రాల్లో హ్యాండ్లూమ్ ఎగ్జిబిషన్లు నిర్వహించటం ముదావహం. టిస్కో ద్వారా వస్త్ర ప్రదర్శన చేస్తున్నది. ప్రభుత్వ ఉద్యోగులు, మం త్రులు ప్రతి సోమవారం చేనేత దుస్తులు ధరిస్తూ చేనేత వస్తువులను ప్రోత్సహించటం హర్షణీయం. ప్రభుత్వం పోచంపల్లి, సిరిసిల్ల నగరాల్లో సిల్క్ సెం టర్, సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్లను ఏర్పాటుచేసే యోచనలో ఉన్నది. ఈ-కామర్స్ విధానం ద్వారా ఆన్లైన్ విధానంలో చేనేత వస్ర్తాలను కొనుగోలు చేసేవిధంగా టిస్కో వెబ్సైట్ను ఆవిష్కరించింది.
రోజురోజుకు సాంకేతికత పెరుగుతున్నది. కాబ ట్టి చేనేతరంగంలో కూడా కొత్త ఆవిష్కరణలను తీసుకురావాల్సిన అవసరం ఉన్నది. రాష్ట్రంలో తగిన వనరులు ఉన్నందువల్ల జియో టెక్స్టైల్స్ పార్కులను స్థాపించాలి. విదేశాల్లో ఆర్గానిక్ రంగులతో వేస్తున్న నూలుపోగులను ఇక్కడ ఉపయోగిస్తే ఎగుమతి రంగంలో మన రాష్ర్టానికి గుర్తింపు వస్తుంది. రాష్ట్రప్రభు త్వం చేపడుతున్న అభివృద్ధి, సం క్షేమ కార్యక్రమాలతో నేతన్నల కుటుంబాలు బాగుపడతాయనడంలో సందేహం లేదు.
గత ప్రభుత్వాల హయాంలో గ్రామాల్లో చేనేత కుటుంబాలకు ఎలాంటి సాయం అందక, బీమా లేకపోవడంతో వృత్తిని వదిలేసి నగరాలకు వలస వెళ్తున్నారని ‘పీరియాడిక్ లేబర్ సర్వే’, ‘కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్’ నివేదికలు చెప్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఈ వలసలను నివారించటానికి జిల్లా కేంద్రాల్లో హ్యాండ్లూమ్ ఎగ్జిబిషన్లు నిర్వహించటం ముదావహం.
కన్నోజు శ్రీహర్ష