వానకాలం పండిన వడ్లనూ కొంటామని ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన అభయం రైతులలో కొండంత భరోసాను నింపింది. దొడ్డు వడ్లు కొనబోమంటూ ఇటీవల కేంద్రప్రభుత్వం చెప్పటంతో రైతన్నలు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. కేసీఆర్ తీసుకున్న నిర్ణయం వారిలో ఆ ఆందోళనను పూర్తిగా తొలగించిందని చెప్పవచ్చు. నిజానికి ఇదేదో ఇప్పటికిప్పుడు తీసుకున్న నిర్ణయం కాదు. రాష్ట్రప్రభుత్వం తొలి నుంచీ రైతులకు అండగా ఉంటున్నది. యాసంగి, వానకాలం అనే తేడా లేకుండా ధాన్యం కొంటున్నది. ఇది ఎప్పటికప్పుడు పెరుగుతున్నది కూడా. 2019-20 ఆర్థికసంవత్సరం వానకాలంలో 47.09 లక్షల టన్నులు సేకరించగా.. అది మరుసటి ఏడాది 48.85 లక్షల టన్నులకు పెరిగింది. ఇదే రెండేండ్లలో యాసంగిలో ఈ పెరుగుదల 64.17 లక్షల టన్నుల నుంచి ఏకంగా 92.33 లక్షల టన్నులకు పెరిగింది. రైతు సంక్షేమం పట్ల రాష్ట్రప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనం ఈ గణాంకాలు.
తెలంగాణ ఏర్పాటైన నాటి నుంచి ధాన్యం కొనుగోళ్లు ఏటికేడు పెరుగుతూనే ఉన్నాయి. 2014-15లో 24.29 లక్షల టన్నులను సేకరించగా.. 2020-21కి ఇది 141.18 లక్షల టన్నులకు చేరుకుంది. విలువ ప్రకారం చూస్తే.. తెలంగాణ రైతన్నలు ఈ ఏడేండ్లలో పండించిన ధాన్యం విలువ రూ.3,392 కోట్ల నుంచి రూ.26,630 కోట్లకు పెరిగింది. దాదాపు ఎనిమిదిరెట్లు అధికం. గత ఏడాది వానాకాలం ధాన్యం సేకరణలో దేశంలో రెండోస్థానంలో నిలిచింది మన రాష్ట్రం. వ్యవసాయరంగంలో వచ్చిన అభివృద్ధి ఫలాలు ఆ రంగానికే పరిమితం కాలేదు. ‘సంపద ఉత్పత్తి అయితే.. అది అక్కడే ఉండదు.. రొటేషన్ అయి మరింత మందికి ఉపాధి కల్పిస్తుంది. మరింత సంపదను సృష్టిస్తుంది’ అని ముఖ్యమంత్రి చెప్పిన మాట అక్షరసత్యం. అందుకే దేశ తలసరి ఆదాయం రూ.1,28,228 ఉంటే, తెలంగాణ అంతకు మించి రూ.2,37,632కు చేరుకున్నది. ఇది అసాధారణ విజయం.
సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం, చెరువుల పూడికతీత, 24 గంటలపాటు నాణ్యమైన ఉచిత కరెంటు, రైతుబంధు రూపంలో పంట పెట్టుబడి, అందుబాటులో విత్తనాలు-పురుగుమందులు, పండిన పంటకు మద్దతుధర, పంటరుణాల మాఫీ, రైతుబీమా వంటి పలు దీర్ఘకాలిక, సంక్షేమ చర్యల వల్లనే ఇది సాధ్యమైంది. వ్యవసాయ రంగ అభివృద్ధి, రైతన్నల సంక్షేమంపై ముఖ్యమంత్రి కేసీఆర్ సమగ్ర వ్యూహంతో ముందుకు పోతున్నారు. ఈ కారణంగానే నేడు తెలంగాణ నలుచెరుగులా సస్యశ్యామలమై కనిపిస్తున్నది. రైతులు కూడా ప్రభుత్వ సూచనలను పాటించాలి. దేశ, రాష్ట్ర అవసరాలు, ఎగుమతులు, మార్కెట్ పరిస్థితులు మొదలైన అంశాలను గమనంలోకి తీసుకోవాలి. క్రాప్ కాలనీలు, వాణిజ్య పంటలు, వ్యవసాయాధార పరిశ్రమలు, అనుబంధ రంగాలు మొదలైన భిన్న అంశాలపై అవగాహన పెంచుకోవాలి. తెలంగాణ రైతాంగం దేశంలోని అన్నదాతలకు అన్ని విధాలా ఆదర్శంగా నిలువాలి.