‘ఒక్క దెబ్బకు రెండు పిట్టలు’ అన్న సామెత దౌత్యనీతిలో తరచూ వినిపించే మాట. చిప్ తయారీ పరిశ్రమను భారత్లో నెలకొల్పటంపై ప్రస్తుతం తైవాన్తో మనం కొనసాగిస్తున్న చర్చలు కూడా ఇటువంటివే. ఈ చర్చలు ఫలిస్తే నేటి ఐటీ యుగంలో మౌలిక అవసరంగా మారిపోయిన చిప్ తయారీలో భారత్ స్వయం సమృద్ధి సాధించవచ్చు. ఈ అత్యాధునిక సాంకేతిక ప్రక్రియ దక్షిణాసియాకు కూడా విస్తరించి, దీనికి భారత్ కేంద్రబిందువుగా మారుతుంది. మరోవైపు, దక్షిణాసియాలో భారత్ను అష్టదిగ్బంధనం చేయడానికి చైనా చేస్తున్న కుట్రలకు దీటైన సమాధానం చెప్పినట్టవుతుంది. తైవాన్ తన భూభాగమేనంటూ, ఏ క్షణాన కబళిద్దామా అని చైనా కాచుకుని ఉంది. ఈ నేపథ్యంలో అమెరికా మద్దతుతో భారత్ ముందడుగు వేయడం భౌగోళిక రాజకీయాల్లో కీలకమైన పరిణామం.
కంప్యూటర్, సెల్ఫోన్లకే కాదు, వాషింగ్ మెషిన్, ఫ్రిజ్ వంటి గృహోపకరణాల తయారీకి కూడా చిప్లు తప్పనిసరి. ఇటీవల డిమాండ్ మేర చిప్లు ఉత్పత్తి కాకపోవడంతో అమెరికా నుంచి భారత్ వరకు ప్రపంచవ్యాప్తంగా కార్ల కంపెనీలు తమ అమ్మకాలను తగ్గించుకోవలసి వస్తున్నది. అరయంగా కర్ణుడీల్గె ఆర్వురి చేతన్ అన్నట్టు చిప్ కొరత ఏర్పడటానికి అనేక కారణాలున్నాయి. చైనా కంపెనీలతో వ్యాపారం చేయకుండా అమెరికా ఆంక్షలు విధించడం ప్రధాన కారణమైంది. కరోనా వైరస్ మూలంగా జనాలు ఇంటిదగ్గరే ఉండటం వల్ల కంప్యూటర్లు, సెల్ఫోన్ల వంటి వస్తువుల అమ్మకాలు పెరిగాయి. మరోవైపు లాక్డౌన్ల వల్ల ఉత్పత్తి, రవాణా మందగించింది. తాత్కాలికంగా ఈ కొరతను అధిగమించినా, దీర్ఘకాలికంగా పెరుగుతున్న అవసరాలకు అనుగుణంగా పరాధీనతను తగ్గించుకోవాలనే అభిప్రాయం బలపడుతున్నది. అమెరికా కూడా చైనాపై ఆధారపడకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకుంటున్నది. మరోవైపు చైనా సియాచిన్ హిమనది ఉత్తరాన సిన్-కియాంగ్ తక్లమకాన్ ప్రాంతంలో ప్రపంచంలోనే అతి పెద్ద పాలీ సిలికాన్ (చిప్ తయారీలో కీలకం) ఉత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటుచేస్తున్నది.
చిప్ తయారీ ప్రక్రియ అంత సులభమైంది కాదు. ఇందుకు వేల కోట్ల రూపాయల పెట్టుబడులు అవసరం. తక్షణ లాభాలు రావు. ఎప్పటికప్పుడు పరిశోధన సాగిస్తూ కొత్తవి వృద్ధి చేయాలి. భారీగా భూమి, స్వచ్ఛమైన నీరు, నిరంతర విద్యుత్తు, నిపుణులు, ముడిపదార్థాల సరఫరా అవసరం. అందువల్లే భారత్ మొదట చిప్ డిజైనింగ్కు పరిమితమై ఆ తర్వాత తయారీ రంగంలోకి అడుగు పెట్టాలనే ఆలోచన కూడా ఉన్నది. రాయితీలు, ప్రోత్సాహకాల విషయంలో తైవాన్ కోరికలను తీర్చడంలో తప్పు లేదు. భవిష్యత్తులో చిప్ తయారీ పరిజ్ఞానం, సామర్థ్యం కలిగి ఉండటం వల్ల ఆయుధాలను మించిన శక్తి లభిస్తుంది.