నేను పుట్టకముందే గజ్వేల్ మున్సిపాలిటీగా ఉండె. మున్సిపాలిటీ తొలి చైర్మన్గా మా నాయిన తలకొక్కుల ఎల్లయ్య పని చేసిండ్రు. ఆ తర్వాత కాలంలో గజ్వేల్ గ్రామపంచాయతీగా మారింది. చాలా ఏండ్లు గడిచిన తర్వాత మళ్లా ఈ ఏడెనిమిదేండ్ల కింద మున్సిపాలిటీ అయ్యింది. కేసీఆర్ పాలన మొదలైన తర్వాతనే గజ్వేల్కు మున్సిపాలిటీ వైభవం వచ్చింది. అంతకుముందు ఎవరూ పట్టిచ్చుకున్నది లేదు.
తెలంగాణ రాకముందు.. కరెంటు మూడు గం టలు పోతదని అధికారికంగా చెప్పెటోళ్లు. కానీ, అనధికారికంగా మరిన్ని గంటలు పొయ్యేది. లెక్క అనేదే ఉండేది కాదు. మధ్యలో కరెంటు పోకుండా టీవీలో పూర్తి సిన్మా చూసిన గుర్తు అనేదే లేదు. అంటే, కనీసం మూడు గంటలు కూడా వరుసగా కరెంటు ఉండని పరిస్థితి. కానీ, ఇప్పుడు కరెంటు కోతలే లేవు.
తెలంగాణ రాకముందు గజ్వేల్లో, చుట్టుపక్కల గ్రామాల్లో ఎంతోమంది రైతులు ఆత్మహత్యలు చేసుకునేటోళ్లు. వ్యవసాయం చేయటం అనేది ఒక భారంగా, పీడకల లెక్క ఉండేది. ఇప్పుడు గజ్వేల్ కోనసీమ లెక్క అయ్యింది. పొలాలకు కావల్సినన్ని నీళ్లు దొరుకుతున్నయి. రైతులకు రైతుబంధుతో డబ్బులు ఇస్తున్నరు. కేసీఆర్ కంటే ముందు ఎంతోమంది నాయకులు పరిపాలించిండ్రు కదా. వారెవరికీ రైతుబంధు లెక్క రైతులకు సాయం చేయాలనే ఆలోచన ఎందుకు రాలేదు?
కేసీఆర్ రాకముందు గజ్వేల్లో మంచినీళ్లకు కటకట ఉండేది. నీళ్లు కొనుక్కొని తాగేటోళ్లం. కానీ, ఇప్పుడు మిషన్ భగీరథతో ఆ సమస్య పూర్తిగా పోయింది. ఇంటింటికీ మంచి నీళ్లు నల్లాల్లో వస్తున్నయి. రోడ్ల గురించి ఎంత చెప్పినా తక్కువే. అంతకుముందు గతుకుల రోడ్లు, గుంతలు ఉండేటివి. ఇప్పుడు రోడ్లు అద్దాల లెక్క తయారైనయి. రోడ్లకు ఇరువైపులా చెట్లను పెంచుతున్నరు.
విద్యాసంస్థలన్నింటినీ ఒకే దగ్గరికి తీసుకొచ్చి ఎడ్యుకేషన్ హబ్ను నిర్మించిండ్రు. అది ఒక యూనివర్సిటీ లెక్క, గజ్వేల్కే గర్వకారణంగా తయారైంది. గజ్వేల్ దవాఖాన నా చిన్నప్పటి నుంచి ఎట్ల ఉండెనే దశాబ్దాలుగా అట్లనే కొనసాగింది. కానీ, కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాతనే దవాఖాన రూపురేఖలు మారిపోయినయి. బతుకమ్మలు ఆడెతందుకు ఆడోళ్లకు సరైన స్థలమే ఊర్లె లేకుండె. పాండవుల చెరువు దగ్గర రోడ్ల మీదనే బతుకమ్మలు పెట్టేటోళ్లం. ఇప్పుడు పాండవుల చెరువును ట్యాంక్బండ్లాగ తీర్చిదిద్దిన్రు. బతుకమ్మలు ఆడెతందుకు, పండుగను ఉత్సాహభరితంగా జరుపుకొనేతందుకు విశాలమైన జాగ ఉంది.
ఇంటిగ్రేటెడ్ మార్కెట్ పేరుతో గజ్వేల్ పట్టణం మధ్యలో గొప్ప భవనం నిర్మించిండ్రు. అందులో పువ్వులు, పండ్లు, కూరగాయలతోపాటు మటన్, చికెన్, చేపలు, రొయ్యల వంటి నాన్వెజ్ ఒకే దగ్గర ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. అంతకుముందు కూరగాయలను రోడ్ల పక్కన పెట్టి అమ్మేటోళ్లు. నాన్వెజ్ షాపులు కూడా రోడ్ల పక్కనే ఉండేటివి. దాంతోని రోడ్ల మీద చెత్తాచెదారం, నడవటానికి ఇబ్బంది ఉండేది. ఇప్పుడు ఆ సమస్య లేదు.
కేసీఆర్ వచ్చిన తర్వాతనే ప్రభుత్వ కార్యాలయాలన్నింటినీ ఒకే సముదాయంలో ఏర్పాటు చేసిన్రు. ప్రభుత్వ ఆఫీసుల్లో పని ఉన్నోళ్లు అక్కడికి వెళ్తే సరిపోతుంది. అంతకుముందు అక్కడో ఆఫీసు ఇక్కడో ఆఫీసు ఉండేవి. మహతి పేరుతో భారీస్థాయిలో ఆడిటోరియం నిర్మించిండ్రు. రూ.100 కోట్లతో గజ్వేల్లో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు చేస్తున్నరు.
గజ్వేల్ ప్రజలకు మరో 50 ఏండ్లకు కూడా లభించని అభివృద్ధి.. కేసీఆర్ రావటం వల్ల 50 ఏండ్ల ముందే లభించింది. కేసీఆర్ పాలన వచ్చినంకనే గజ్వేల్ దశ దిశ మారింది. ఆయన రుణం తీర్చుకోలేనిది.
కాముని విజయలక్ష్మి