టోక్యో ఒలింపిక్స్లో రెజ్లర్ రవి దహియా రజతం గెలువటంతో దేశం మురిసిపోయింది. కొడుకు సాధించిన ఘనతకు ఆయన తండ్రి రాకేశ్ దహియా కండ్లు మెరిశాయి. అంతకుమించి ఏదో ఆశిస్తున్నట్టుగా కనిపించాయి ఆయన కండ్లు. తన కుమారుడి విజయంతోనైనా ఊరు తలరాత మారుతుందన్న చిన్న ఆశ ఆయన చూపుల్లో ఉన్నది. ‘మా అబ్బాయి గెలుపుతో మా ఊరిని వెలిగించాడు. ప్రభుత్వం కరెంట్ ఇచ్చి ఆ వెలుగులు కొనసాగించాలి. మంచినీళ్లు ఇవ్వాలి’ అని చెప్పుకొచ్చాడు!
రవి దహియా నాహ్రీ గ్రామ నివాసి. ఇది మారుమూల పల్లెకాదు. హర్యానా రాష్ట్రంలోని సోనీపట్ జిల్లా కేంద్రానికి పది కిలోమీటర్లు, దేశ రాజధాని ఢిల్లీ నుంచి 80 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. అయినా, ఈ గ్రామం అభివృద్ధికి ఆమడదూరంలో ఆగిపోయింది. ఈ గ్రామంలో కరెంట్ ఉండేది కేవలం ఎనిమిది గంటలే. పొద్దంతా రెండు గంటలు. రాత్రుళ్లు ఆరు గంటలు. ఇక మంచినీళ్ల ప్రస్తావన తెస్తే ఆ గ్రామస్థులు కన్నీళ్లతోనే జవాబు చెప్తారు.
నాహ్రీ గ్రామంలో కరెంట్ వస్తే వింత. మన తెలంగాణ పల్లెల్లో కరెంట్ పోతే వింత. అక్కడ వారానికి నాలుగు బిందెల మంచినీళ్లొస్తే అదో అద్భుతం. మన గ్రామాల్లో నీళ్లు రానిరోజంటూ ఉండదు. తెలంగాణ ఏ ర్పడితే అంధకారమవుతుందన్నారు అవివేకులు. ఇప్పు డు పంట కోతలు తప్ప మరే కోతలు తెలియదు మనకు. ఇదంతా కేసీఆర్ వల్లే సాధ్యమైంది. ఆయన తీసుకున్న నిర్ణయాల వల్లే సాకారమైంది. ఇన్ని చేసినా అడ్డం పొ డుగు మాట్లాడే కపటులు రవిదహియా గ్రామం నాహ్రీ, ఆ రాష్ట్రం ఇన్నాళ్లు ఎవరి పాలనలో మగ్గిందో, ఇప్పుడు మరెవరి ఏలికలో వగరుస్తుందో తెలుసుకోవాలి.
గడిచిన పదహారేండ్లుగా హర్యానాను దఫదఫాలుగా పాలించింది హస్తిన పార్టీలే! 2005 నుంచి 2014 వరకు రెండు దఫాలుగా కాంగ్రెస్ పాలన కొనసాగితే.. ఆ తర్వాత బీజేపీ పాలన మొదలైంది. రెండోసారి అధికారంలోకి వచ్చినా ఇచ్చిన హామీలు నెరవేర్చింది లేదు. జిల్లా కేంద్రానికి సమీపంలో ఉన్న ఊరిలో, దేశ రాజధానికి కూతవేటు దూరంలో ఉన్న గ్రామంలో కనీస వసతులు కల్పించలేకపోతే, ఇక కుగ్రామాల దయనీయ స్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. ఇదిలా ఉంటే తెలంగాణలో మాత్రం జాతీయపార్టీల నేతలు రెచ్చిపోతుండటం హాస్యాస్పదం.
ఒక ఊరులో కనీసం 8 గంటలు కరెంట్ ఇవ్వని అసమర్థ పాలన వారిది. ప్రతి పల్లెకూ 24 గంటల విద్యుత్ ఇస్తున్న చరిత్ర తెలంగాణది. వ్యవసాయానికి 24 గంట ల ఉచిత విద్యుత్, పారిశ్రామిక అవసరాలకు 24 గంట ల నిరంతర విద్యుత్ ఇస్తున్న ఘనత మనది. తెలంగాణ వచ్చిన తొలినాళ్లలో ‘రాష్ట్రంలో అన్నిరంగాలకు 24 గంటలు కరెంట్ ఇస్తామ’ని అసెంబ్లీలో సీఎం కేసీఆర్ ప్రకటన చేస్తే అసాధ్యమని కొందరు వాదించారు. ‘అలా చేస్తే మీ పార్టీలోకి వస్తామ’న్నారు మరికొందరు. ‘అదే సాధ్యమైతే ఇదే అసెంబ్లీలో మీకు పాలాభిషేకం చేస్తామ’ని చెప్పారు ఇంకొందరు. అసాధ్యం సుసాధ్యమయ్యేసరికి వారి నోరు పెగలడం లేదు. ఏ దిక్కూ లేక ఆ దిక్కు పోయిన కొందరు తమ పార్టీ పాలిస్తున్న రాష్ర్టాల దుస్థితి చెప్పలేక నోరు పారేసుకుంటున్నారు. వారి అవివేకానికి సానుభూతి వ్యక్తం చేయడం తప్ప ఇంకేం చేయలేం.
‘తలసరి విద్యుత్ వినియోగంలో దేశంలో తెలంగాణ రాష్ట్రం నంబర్ వన్’ అన్న ముఖ్యమంత్రి కేసీఆర్ మాట ల్లో మన రాష్ట్ర అభివృద్ధి ప్రతిధ్వనిస్తుంటుంది. కేసీఆర్ మాటలను ఆ అందరు, ఈ కొందరు స్వాగతించడం నేర్చుకోవాలి. అదే సమయంలో ‘మాకు కరెంటు, నీళ్లు ఇస్తే చాలు’ అన్న రాకేశ్ దహియా మాటలను గుర్తు చేసుకోవాలి. ఆ రాష్ర్టాన్ని పాలించిన, పాలిస్తున్న నేతలు తమ పార్టీల వారేనని తలదించుకోవాలి.