‘కులాన్ని పాతి పెడదాం రండి’ అని ఇటీవల రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అధినేత మోహన్ భగవత్ భారతీయులకు పిలుపునిచ్చారు. కానీ నిమ్న కులాల పట్ల అగ్ర కులాల వివక్ష, హింస అంతం కానిదే భారత దేశంలో కుల నిర్మూలన సాధ్యం కాదు. మనుషులందరినీ సమానంగా చూడటమే అసలైన ధర్మం. కుల మతాలతో నిమిత్తం లేకుండా అందరికీ సమాన అవకాశాలు, గౌరవం ఉండటమే అసలైన న్యాయం.
కుల నిర్మూలన గురించి చర్చిస్తే, వాస్తవానికి క్రీ.శ.8వ శతాబ్దంలో ఆది శంకరాచార్య కాలంలోనే అది అంతం కావాల్సింది. అందరిలో ఉన్న దివ్యత్వం ఒక్కటేనని, ఈ విషయాన్ని విస్మరించడం వల్లే ఒకరిపై ఒకరు దాడులు చేసుకుంటున్నారని ఆది శంకరులు ప్రవచించారు. ఆయన ప్రవచనం ఆనాడు సత్ఫలితాలనే ఇచ్చింది. క్రీ.శ.13-16 శతాబ్దాల మధ్య కాలంలో వచ్చిన భక్తి ఉద్యమం మానవులందరూ సమానమేనని, దేవుడి దృష్టిలో అందరూ ఒక్కటేనని చాటి చెప్పింది. ఆ ఉద్యమం కులాన్ని నిర్మూలించలేకపోయినా, చెప్పుకోదగ్గ మంచి ఫలితాలనే ఇచ్చింది. రాజారామ్మోహన్ రాయ్ నుంచి అంబేద్కర్ వరకు అనేక మంది సంఘ సంస్కర్తల పోరాటం, కృషి వల్ల 19, 20 శతాబ్దాల కాలంలో కులం అంతరిస్తుందని అనుకున్నారు. కానీ కులతత్వం కొంత దెబ్బ తిన్నా సజీవంగానే నిలిచింది. కుల ప్రాతిపదికన ఎవరి పట్లా వివక్ష చూపకూడదని, అది చట్ట రీత్యా నేరమని స్వాతంత్య్రానంతరం నిర్దేశించుకున్నప్పుడు కులం నశిస్తుందని అనుకున్నారు. కానీ అప్పుడు కూడా కులం నశించిపోకుండా తప్పించుకుంది.
నేడు కులాన్ని నిర్మూలించడం దాదాపుగా అసాధ్యం అనిపిస్తున్నది. అంబేద్కరిస్టులు, మండల్ రాజకీయ పార్టీలకు కులం మద్దతే ప్రాణాధారం. కులం ప్రాతిపదికన అమలవుతున్న రిజర్వేషన్ల నిలిపివేతకు వారు పూర్తిగా వ్యతిరేకం. మరోవైపు, ఆర్ఎస్ఎస్తో వచ్చిన ఇబ్బంది ఏమంటే.. కులతత్వం అంతం కావాలని వాళ్లు పిలుపునిచ్చినప్పుడు వారు అగ్రకులాలను కాకుండా, నిమ్న కులాలను ఉద్దేశించే మాట్లాడతారు. అగ్ర కులాలకు వ్యతిరేకంగా నిమ్నకులాలు సమీకృతమవుతున్నాయని వారు భావిస్తుండటమే దీనికి కారణం. కుల వివక్షతను హిందూ కుటుంబంలో వచ్చిన విభజనలాగా ఆర్ఎస్ఎస్ చూస్తుంది. హిందువులందరూ తిరిగి ఐక్యంగా ఉండాలని ఆ సంస్థ కోరుకుంటుంది.
కులాన్ని పాతిపెడదామని భగవత్ అన్న మాటలకు అర్థం – దళితులు, బీసీలు హిందూ కుటుంబంలోకి తిరిగి రావాలని. హిందూ మతంలోని అసమానత్వపు సామాజిక క్రమాన్ని విచ్ఛిన్నం చేసి దాన్ని సమానత్వపు సామాజిక క్రమంగా పునర్ నిర్మించాలనేది ఆర్ఎస్ఎస్ లక్ష్యం కాదు. కానీ హిందూ సమాజాన్ని సంస్కరించాలని మాత్రం ఆర్ఎస్ఎస్ భావిస్తున్నది. మీడియాకు తెలియకుండా దశాబ్దాలుగా దళితులను హిందూ కుటుంబంలోకి కలిపే సమ్మేళనాలను ఆర్ఎస్ఎస్ నిర్వహిస్తున్నది. దళితులు హిందూ దేవాలయాల్లోకి ప్రవేశించేందుకు ఆర్ఎస్ఎస్ స్థానిక శ్రేణులు అనేక చోట్ల తోడ్పాటును అందిస్తున్నాయి. సహ పంక్తి భోజనాలను ఆర్ఎస్ఎస్ ప్రోత్సహిస్తున్నది. ఆర్ఎస్ఎస్ శతాబ్దానికి పైగా నిర్వహిస్తూ వస్తున్న ఈ కార్యక్రమాలు కులాన్ని నిర్మూలించటం పక్కనపెట్టి, కనీసం ఏ రూపంలోనైనా కులాన్ని బలహీన పరిచాయా? అలా జరిగి ఉండకపోతే, ఎందుకు జరగలేదని భగవత్ తనను తాను ప్రశ్నించుకోవాలి.
మనం మన విశ్లేషణ ద్వారా భగవత్కు సహాయం చేయవచ్చు. వాళ్లు కులాన్ని నిర్మూలించడంలో విఫలం కావడానికి నాలుగు కారణాలున్నాయి. 1. ఆర్ఎస్ఎస్ ఎప్పుడూ కుల వ్యవస్థ పునాదులపై దాడి చేయలేదు. హిందూ మత గ్రంథాలు కుల వ్యవస్థకు ఆదర్శంగా పవిత్రతను ఇచ్చాయి. వాటిని ఆర్ఎస్ఎస్ ఎప్పుడూ తిరస్కరించలేదు. 2. అర్చకత్వాన్ని కేవలం బ్రాహ్మణులు మాత్రమే నిర్వహించాలని కులవ్యవస్థ చెబుతుంది. అర్చకత్వం కూడా సివిల్ సర్వీసులాగా ఒక సేవ లాగా ఉండాలని, అన్ని కులాల ప్రజలు ఈ సేవ చేసేందుకు పోటీ పడే అవకాశం ఉండాలని అంబేద్కర్ కోరుకున్నారు. అర్చకత్వాన్ని ప్రజాస్వామ్యీకరిస్తే కుల వ్యవస్థ కరిగిపోయి కుప్పకూలుతుంది. ఆర్ఎస్ఎస్ ఎప్పుడూ ఈ ఆలోచనను సమర్థించలేదు. 3. నిమ్న కులాలు హిందూ కుటుంబం నుంచి ఎందుకు దూరంగా వెళ్లిపోతున్నాయనే విషయాన్ని మత కోణం లోంచి కాకుండా వేరే కోణంలో ఆర్ఎస్ఎస్ చూడలేకపోతున్నది. అగ్ర కులాల అణచివేతకు, క్రూరత్వానికి, వివక్షకు, హింసకు, అత్యాచారాలకు గురి కావడం వల్లే నిమ్న కులాలు హిందూ కుటుంబం నుంచి దూరంగా వెళ్లిపోతున్నాయి. అగ్ర కులాలు శతాబ్దాలుగా నిమ్న కులాలు, దళితులపై ఆధిపత్యం చెలాయించాయి. వారు నిమ్న కులాల వారిని సోదరులుగా భావించి ఉంటే, కుల తత్వం అనేదే ఉండేది కాదు. 4. అగ్ర కులాల కుల వివక్షకు ప్రతి స్పందనగానే అంబేద్కరిస్టులు, మండల్ రాజకీయ పార్టీలు కుల తత్వాన్ని పాటిస్తున్నాయి.
(వ్యాసకర్త: స్వతంత్ర జర్నలిస్ట్, ‘నితీశ్కుమార్ అండ్ ది రైజ్ ఆఫ్ బీహార్’ పుస్తక రచయిత)