దేశంలోని రైతులు, పేదలు, మహిళలు, పిల్లలు ఇక గుండెల మీద చేయేసుకొని ఉండొచ్చు. జై బీఆర్ఎస్’ రాజా రాంమోహన్ రాయ్ అనే వరంగల్ మిత్రుడు ఫేస్బుక్లో పెట్టిన పోస్ట్! ఇది ఆయన వ్యక్తీకరణలోని లోతును మాత్రమే కాదు, తెలంగాణ సమాజపు చైతన్యాన్ని, ఎనిమిదేండ్ల తమ ప్రస్థానం పట్ల గర్వాన్ని, రాబోయే ఏండ్లల్లో భారత దేశమంతా విరియబోయే వెలుగులనూ ప్రకటిస్తున్నది!
విజయదశమి రోజున మధ్యాహ్నం 1:19కి ఈ దేశ భవిష్యత్ మారే నిర్ణయాన్ని కేసీఆర్ వెలువరించిన్రు. ‘భారత్ రాష్ట్ర సమితి’గా రూపు సవరించుకొని నవ నవోన్మేషంతో ఉరకలెత్తించిన్రు. తెలంగాణను మాత్రమే కాదు, యావద్భారతాన్ని కూడా. బీఆర్ఎస్ ప్రారంభ సంరంభానికి వచ్చిన విశిష్ట అతిథుల్లో ఒకరైన తిరుమావళవన్ ఈ వ్యాస రచయితకు సుపరిచితుడు. అంబేద్కర్, కాన్షీరాం దారిలో నడుస్తూ తమ వీసీకే పార్టీని తమిళనాడు, ఆంధ్రప్రదేశ్లలో నడుపుతున్నరు. ఆయన స్వయంగా ఎంపీ కూడా. డీఎంకేతో పొత్తు పెట్టుకుని ఆరు చోట్ల పోటీచేసి నాలుగు ఎమ్మెల్యే సీట్లు గెలిచిన్రు.
“రాష్ట్ర సెక్రటేరియట్కు బాబా సాహెబ్ పేరు పెట్టడం ఒక అబ్బురం. పార్లమెంట్కు బాబా సాహెబ్ పేరు పెట్టాలని డిమాండ్ చేసిన మొట్టమొదటి నేత కేసీఆర్. అందుకనే పిలవగానే వచ్చినం.” అన్నరాయన.
“అసలు దళితబంధు లాంటి స్వావలంబన విధానాలు బీఎస్పీ పాలనలో కూడా జరగలేదు. ఇక్కడ ఎట్లా సాధ్యమైంది’ అన్నరు మరో యూపీ నేత. ఆ అబ్బురం, ఆ సంబరం పేరే కేసీఆర్. గతంలో ఎన్నోసార్లు మనం సంభాషించుకున్నం. దేశం ఎదుర్కొంటున్న గడ్డు పరిస్థితుల గురించి. కులం, మతం, పేదరికం, స్వార్థ రాజకీయాలు, హ్రస్వదృష్టి గల నాయకగణం; ఇద్దరు గుజరాతీలు దేశ సంపద అమ్మేయడం, మరో ఇద్దరు గుజరాతీలు వాటిని కొనడం; విదేశాల్లో సైతం చులకన అవుతున్న మన ప్రతిష్ఠ; స్వాతంత్య్ర వజ్రోత్సవ వేళ కూడా కానరాని దేశస్పృహ! ఒకటా రెండా.. బీజేపీ దుర్మార్గాలను వర్ణించడానికి, వల్లె వేయడానికి ఇపుడు ఆదిశేషుడిని అరువుకు తెచ్చుకోవాల్సిందే.
‘ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని బతికించడం, రాష్ర్టాలను బలోపేతం చేయడం, సమాఖ్యస్ఫూర్తిని కాపాడటం, రాజ్యాంగ అమలులో నిబద్ధత, ప్రజలందరూ ఆత్మగౌరవంతో, ఆర్థిక స్వావలంబనతో జీవించడం ఒక్కటే నా లక్ష్యం. ఇందులో వెరుపు లేదు, వెనకడుగు లేదు. ఇంక నాకు జీవితంలో వేరే పని లేదు. వ్యక్తిగత ఆశలు కూడా లేవు’ నాల్రోజుల కింద ఒక సమావేశంలో అన్నరు కేసీఆర్. ఇది ముమ్మాటికీ నిజం. మాటా పలుకూ ఆచరణా ఒక్కటే అయిన రూపం కేసీఆర్.
రాయచూర్ బీజేపీ నాయకుడు ‘మమ్మల్ని తెలంగాణలో కలపండి’ అన్నది ఇక్కడ జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమాలను చూసే! ఇపుడాయన కోర్కె నెరవేరబోతున్నది. రాయచూర్ను తెలంగాణలో కలపడం కాదు. తెలంగాణ పాలన రాయచూర్కు చూపించడం. అక్కడి బీజేపీని కూలదోసి కుమారస్వామితో కలిసి విఘ్నాలను చిత్తు చేయడం. చంద్రశేఖరుడే విఘ్నాధిపతి అయితే ఇంకతిరుగేమి ఉన్నది?
కర్నాటక సహా తెలంగాణ పొరుగు రాష్ర్టాలు అయిన మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్లోని రైతులు, పేదలు కూడా టీఆర్ఎస్ పాలన కావాలనడం మనందరి ఎరుకలోనిదే. వారికి టీఆర్ఎస్ పాలన అందివ్వడం కోసమే బీఆర్ఎస్ అవతారం! వారికే కాదు దేశమంతా అన్నివర్గాలు సుఖశాంతులతో వర్ధిల్లే పాలన, అంతర్జాతీయంగా మాసిన ప్రభను పునరుత్తేజింపజేయడమే కేసీఆర్ మనసులోని మాట. ఇది శుష్కపు వాగ్దానాల, వాగాడంబరాల ‘మన్ కీ బాత్’ కాదు. సచ్చీ మన్ కీ షాన్!
పార్టీ ప్రకటనకే ఉలికిపడిన నాయకులు అపుడే అక్కసు వెళ్లగక్కుతున్నరు. మేధావులు కూడా మెటికలు విరుస్తున్నరు. బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీని బలహీనపరచి, బీజేపీకి మేలుచేసే పని అని ఆడిపోసుకుంటున్నరు. బలంగా ఉన్న పార్టీని కదా బలహీనపరచగలం? కాంగ్రెస్ ఉనికి ఎక్కడని? అంతర్గత కలహాలతో, పుట్టగొడుగుల్లాంటి ముఖ్యమంత్రి అభ్యర్థులతో నిత్యకొట్లాట- ఆరని మంట తీరున వీధిన పడేవారిని ఎవరు పట్టించుకుంటరు, ఎందుకు పట్టించుకుంటరు? జవహర్లాల్ నెహ్రూ ‘డిస్కవరీ ఆఫ్ ఇండియా’ రాస్తే ఆయన మునిమనవడు ‘డిస్కవరీ ఆఫ్ కాంగ్రెస్’ పేర పార్టీ ఉందో లేదోనని దుర్భిణీ వేసుకు తిరుగుతున్నడు.
కాబట్టి… కాంగ్రెస్ను వదిలేసి నేడు దేశానికంతటికీ శత్రువు అయిన, యే మాత్రం ఈ నేలన ఉండవీల్లేని కలుపు మొక్క బీజేపీని ఏరి పారేయడమే బీఆర్ఎస్ ప్రధాన విధి. అపుడు మాత్రమే బీఆర్ఎస్ లక్ష్యాల సాధనకు మార్గం సుగమం అవుతుంది. కేసీఆర్తో పలు సందర్భాల్లో జాతీయ రాజకీయాల చర్చలో ఉన్న నేను స్పష్టంగా కుండబద్దలు కొట్టగలను- ఆయన ఈ పోరాటంలో వందశాతం నిజాయితీగా ఉన్నరని. ఇపుడు కాకపొతే మరెపుడు? ఆయన కాకపోతే మరెవరు?
ఊరూవాడా కదిలించగలరు; పండిత పామరులను అలరించగలరు; కరుణతోనో కటువుగానో క్రతువు ముగించగలరు! ఇంగ్లీష్లో ఒక మాటుంది- You can love him or hate him but you can’t ignore him అని. అదే కేసీఆర్. ఆయనంటే గిట్టనివారు ఉంటరు కానీ కేవలం వ్యక్తిగత కారణాలతోనే. తెలంగాణపై ఆయన అవ్యాజమైన ప్రేమను కలలో కూడా కాదనే ప్రతిపక్షాలు లేవు. అట్లనే, దేశ శ్రేయస్సు గురించి ఆయన పడుతున్న తపన, ఆయన చెప్తున్న అంశాలు, చెప్పీచెప్పని ఆయన ప్రణాళికలు ఏ ఒక్కటి కూడా ఏ దేశ నాయకుడూ కాదనలేని సత్యాలు.
ఒకవైపు బీజేపీ నాయకులు ఎక్కడెక్కడి నుంచో తెలంగాణకు వచ్చి తామే ఢిల్లీ వేదికగా అవార్డులు ఇచ్చిన పాలనను గల్లీల్లో విమర్శిస్తూ ఉంటే, మరొకవైపు దేశవ్యాప్త నాయకులూ, రైతుసంఘాలు హైదరాబాద్ వచ్చి మేమేమి తప్పు చేసినం, మాకెందుకు దక్కదు ఈ పాలన, ఈ దార్శనికత అనడం అతిశయోక్తి కాదు కదా?!
తెలంగాణ రాష్ట్రం కోసం యువత బలిదానాలు చేసుకుంటూ ఉంటే అసెంబ్లీ సాక్షిగా మీకు నయా పైసా ఇవ్వం ఏమి చేసుకుంటరో చేసుకోండి అని కాంగ్రెస్ ముఖ్యమంత్రి నాడు అవమానిస్తే టీఆర్ఎస్ రగిలింది. రాష్ట్రం ఆవిర్భవించింది. అట్లాంటి తెలంగాణ ఏర్పాటును అవమానిస్తూ ప్రధాని మోదీ పార్లమెంట్ సాక్షిగా అవమానిస్తే టీఆర్ఎస్ మరలా రగిలింది. బీఆర్ఎస్ ఆవిర్భవించింది. ‘బూడిద నుంచి లేచి భగ్గుమన్న సూరీడు’ అని రాస్తరు మహాకవి శివసాగర్. అట్లా, ఫీనిక్స్ పక్షిలా నివురు నుంచి నింగికి ఎగిసింది తెలంగాణ. పేదల రక్తాన్ని పీల్చి జలగల్లా బలిసిన బీజేపీ దుష్ట చతుష్టయాన్ని నలిపి పారేయడానికి మరొక అవతారం ఎత్తింది నేడు టీఆర్ఎస్. అర్జునుడిని ఆదేశించింది. జమ్మి చెట్టు నుంచి ఆయుధాలు కిందకు దించమని! ముహూర్తం మంచిగున్నదని!!
ఇక దేశమంతా దసరాయే.
విజయుని వీర విహారమే.
సిద్ధమైతున్నరు కదా,
మీరంతా?! జై భారత్.
-శ్రీశైల్రెడ్డి పంజుగుల