ఆధునిక భారతదేశానికి సరికొత్త నాయకత్వం అవసరం ఉన్నది. ఇవ్వాళ భారత రాజకీయాల్లో ఒక వెలితి కనిపిస్తున్నది. ఒక కొత్త నాయకత్వం కోసం, ఒక మార్పు కోసం ప్రజలు ఎదురుచూస్తున్నారు. దేశంలో అత్యధిక కాలం అధికారంలో ఉన్న కాంగ్రెస్ అంతకంతకూ కనుమరుగవుతున్నది. బీజేపీ మత విద్వేషపూరిత విభజన రాజకీయాలు చేస్తున్నది. ఈ క్రమంలో దేశంలో భారీ రాజకీయ శూన్యత ఏర్పడింది.
దేశానికి ఒక సమర్థవంతమైన నాయకత్వం, నాయకుడు, అంతకంటే సమర్థవంతమైన పరిపాలకుడి అవసరం కనిపిస్తున్నది. ప్రజలు అలాంటి ఒక నేత కోసం ఎదురు చూస్తున్నారు. మనదేశంలో ప్రజాస్వామిక అభివృద్ధి, సంక్షేమమే తప్ప నియంతృత్వానికి తావు లేదు. నియంతృత్వానికి వ్యతిరేకంగా స్వాతంత్య్ర పోరాటం చేసిన చరిత్ర మనదేశానిది. 75 ఏండ్ల స్వాతంత్య్రాన్ని మనం ఈ వేళ అమృతోత్సవాలుగా జరుపుకొంటున్నాం. అయితే దురదృష్టం ఏమిటంటే, ఇన్నేండ్ల స్వాతంత్య్రం తర్వాత కూడా ప్రజలు అచ్చే దిన్ కోసం వేచి చూసే దుస్థితి. ఇప్పటిదాకా కేంద్రంలో అధికారం వెలగ బెట్టిన అన్ని పార్టీలు దేశ ప్రజలకు తాయిలాలు ఇవ్వటమే తప్ప నిజమైన అభివృద్ధి సంక్షేమాలను అందించలేక పోయాయి.
ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం మనది. అందులోనూ సమాఖ్య విధానం మరో విశిష్టత. అలాంటి సమాఖ్య స్ఫూర్తికి తూట్లు పొడిచాయి దేశాన్ని పాలించిన పార్టీలు. భారత రాజ్యాంగం ప్రకారం దేశంలో సమాఖ్య పాత్ర అత్యంత ముఖ్యమైనది. కానీ కేంద్రంలో అధికారం చేపట్టే పార్టీలు రాష్ర్టాల్లో తమ పార్టీలు అధికారంలో ఉంటే ఒక విధంగా, లేకపోతే మరో విధంగా వ్యవహరిస్తున్నాయి. ఇదే ప్రధాన మంత్రి నరేంద్రమోదీ, గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ‘సహకార సమాఖ్య’కు ఆర్భాటంగా మద్దతు పలికారు. ‘రాష్ర్టాలకు హక్కుగా ఉన్నవాటిని ఇవ్వడం కేంద్రాన్ని బలహీనపరచదని కేంద్రం గ్రహించాల్సిన సమయం ఆసన్నమైంది. రాష్ర్టాలు కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం చేసుకోవాలి. రాష్ర్టాలు కేంద్రానికి లోబడి ఉండకూడదు. పరస్పర సహకార విధానం మన దేశంలో తప్పనిసరిగా ఉండాలి’. జనవరి 2012లో మోదీ అన్న మాటలివి. కానీ, ప్రధాని అయిన తర్వాత, తాను ఆనాడు అన్న మాటలు మరిచి సమాఖ్య వాదాన్ని పక్కన పెట్టారు. రాష్ర్టాలపై కేంద్రం నియంతృత్వాన్ని రుద్దుతున్నారు. అధికారాన్ని కేంద్రీకరించడం, ఆర్థిక, ఆర్థికేతర మద్దతును అందించడంలో రాష్ర్టాల మధ్య వివక్ష చూపుతూ, రాజకీయ ప్రత్యర్థులను భయాందోళనలకు గురి చేస్తున్నారు. ప్రభుత్వ వ్యవస్థలను, యంత్రాంగాన్ని దుర్వినియోగం చేయడం, ఈ దేశ సమాఖ్యస్ఫూర్తికి ఆరోగ్యకరం కాదు. కేంద్ర ప్రభుత్వ వైఖరి ఇలాగే కొనసాగితే దేశం పేక మేడలా కూలిపోతుంది.
రాజ్యాంగంలోని ఆర్టికల్ 38 ప్రకారం సంక్షేమ రాజ్యానికి ప్రధాన లక్ష్యం అంత్యోదయ ఫలాలు ప్రజలకు అందించాలి.కానీ ఈ లక్ష్యసాధనలో కేంద్ర పాలకులు దేశంలో సమృద్ధిగా ఉన్న వనరులను సక్రమంగా వినియోగించుకోలేక పోవడం ప్రధాన సమస్య. దేశాన్ని పాలించిన, పాలిస్తున్న ప్రభుత్వాల వరుస వైఫల్యాలు, రాజకీయ పార్టీల తప్పిదాలు దేశానికి శాపంగా మారాయి. దేశంలో సమృద్ధిగా నీటి వనరులున్నప్పటికీ వాటిని సాగునీటిగా వినియోగించుకోలేకపోతున్నాం. దేశ ప్రజలకు సరిపడా ఆహారాన్ని ఉత్పత్తి చేయలేకపోతున్నాం. సరిపడా విద్యుత్ ఉత్పత్తి, పంపిణీ చేయలేక పోతున్నం. అత్యంత దురదృష్టం ఏమిటంటే, ఐదు దశాబ్దాల కిందటి నదుల అనుసంధానాన్ని నేటికీ చేయలేకపోయాం! భారత సరిహద్దు భూభాగాన్ని పొరుగు దేశాలైన పాకిస్తాన్, చైనాలకు అప్పగించడం. సరిహద్దులలో మన సైనికులను రక్షించుకోవడంలో విఫలమవ్వడం కూడా అంతే దురదృష్టకరం !!
వరుస ఓటముల నుంచి దేశాన్ని గట్టెక్కించే సమర్థవంతమైన నేత కేసీఆర్ ఒక్కరే. సమర్థ పరిపాలకుడు, గొప్ప ట్రాక్ రికార్డ్ ఉన్న విజయవంతమైన దీక్షా దక్షుడు, కొద్ది ఏండ్ల క్రితమే ఆవిర్భవించిన రాష్ర్టాన్ని అతి తక్కువ సమయంలో అభివృద్ధి చేసిన ఘనత ఆయనది. దేశంలోని అత్యంత అభివృద్ధి చెందిన రాష్ర్టాలతో పోటీ పడి, తెలంగాణను అగ్రగామిగా నిలిపిన ఒకే ఒక్కడు తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర రావు.
ప్రపంచంలో అత్యధిక సంఖ్యలో US FDA ఆమోదించిన ఉత్పాదక ఫార్మా సౌకర్యాలు తెలంగాణలోనే ఉన్నాయి. తెలంగాణ ఏర్పడిన అనతి కాలంలోనే రాష్ట్రం దేశానికి గ్రోత్ ఇంజిన్గా మారిందంటే అతిశయోక్తి కాదు. ఇదంతా దార్శనికత గల ముఖ్యమంత్రి కేసీఆర్ వల్లే సాధ్యమైంది. రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమం కోసం అవిశ్రాంతంగా కృషి చేస్తున్నారు సీఎం కేసీఆర్. దేశంలోని నిరుపేదలు, కార్మికుల కష్టాలను అర్థం చేసుకున్న నాయకుడు కేసీఆర్. కేంద్ర కార్మిక మంత్రిగా, 8 ఏండ్లు రాష్ట్ర ముఖ్యమంత్రిగా పాలనాపరమైన అనుభవం ఆయన సొంతం. నైపుణ్యం, జ్ఞానం, గ్రహణశక్తి, నేర్చుకునే ధోరణి, విషయాలను త్వరితగతిన అవగాహన చేసుకోవడం వంటి అంశాలు, తెలంగాణ రాష్ర్టాన్ని సాధించిన అనుభవం ఆయన సొంతం.
కేసీఆర్, భారతదేశానికి ప్రత్యామ్నాయ, సమర్థవంతమైన, నిర్ణయాత్మక నాయకత్వాన్ని అందించడానికి ముందుకు వస్తున్నారు. దేశంలోని వనరులు, అవసరాలు, ప్రజా సమస్యలపై అవగాహన, సమాఖ్యవాదం పట్ల గౌరవంతోపాటు, లౌకిక తత్వానికి నిదర్శనంగా ఉండే కేసీఆర్ను ఈ దేశ ప్రజలు ఆశీర్వదించాలి. మార్పు కోసం పరితపిస్తున్న నాయకుడి చేతులకు ఈ దేశపు పరిపాలన పగ్గాలను అప్పగించేందుకు మనమందరం కలిసి నడుద్దాం.
(వ్యాసకర్త: డాక్టర్ జి. రంజిత్ రెడ్డి, లోక్సభ సభ్యుడు, చేవెళ్ల)