భారత దేశ రాజకీయ చిత్రపటంపై మరొక రాజకీయ పార్టీ జాతీయ పార్టీగా ఆవిర్భవించడానికి తెలంగాణ వేదిక అవుతున్నది. ఒక ప్రాంతీయ పార్టీగా ప్రారంభమై ప్రత్యేక రాష్ట్రంలో అధికారాన్ని కైవసం చేసుకున్న తెలంగాణ రాష్ట్ర సమితి ఇప్పుడు దేశ భవిష్యత్తు కోసం జాతీయ పార్టీగా మారనున్నది.
పెట్టుబడిదారులకు కొమ్ము కాసే గుజరాత్ నమూనాకు ప్రత్యామ్నాయంగా తెలంగాణ నమూనాను దేశ వ్యాప్తం చేస్తామనే నినాదంతో టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి ప్రవేశిస్తున్నారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పన, వ్యవసాయానికి ఉచిత విద్యుత్తు, సాగునీటి సౌకర్యం, ప్రజలందరికీ స్వచ్ఛమైన తాగునీరు, పేదలు, దళితులకు ఆర్థిక భరోసా ఇలా ఎన్నో సంక్షేమ, అభివృద్ధి పథకాలతో తెలంగాణ నమూనాను దేశానికి ఆదర్శంగా తీర్చిదిద్దారు కేసీఆర్. తన విధానాలకు మద్దతు ఇస్తున్న అఖిలేశ్ యాదవ్, కుమార స్వామి తదితర ప్రాంతీయ, జాతీయ పార్టీ నాయకుల మద్దతుతో తాను ప్రారంభించే కొత్త జాతీయ పార్టీని దేశ మంతటా విస్తరించాలని కేసీఆర్ భావిస్తున్నారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా ఉన్న ప్రజా సంఘాలు, రైతు సంఘాల నాయకులు, వివిధ రంగాల నిపుణులు, మేధావులు కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి రావడాన్ని స్వాగతించారు. ఆయనతో కలిసి పని చేయడానికి సంసిద్ధత వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్రతో పాటు పలు దక్షిణాది రాష్ర్టాల లోక్సభ స్థానాల్లో పోటీ చేసి జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని కేసీఆర్ భావిస్తున్నారు. రాజకీయ అనుభవం, చాణక్యం, నేర్పరితనం, మొండి ధైర్యం, సమయస్ఫూర్తి కలిగిన కేసీఆర్ భారీ కసరత్తు చేసిన తర్వాతే దేశ రాజకీయాల్లోకి అడుగు పెడుతున్నారు. దేశం ఏం కోరుకుంటోంది, దేశానికి ఏం అవసరమో విశ్లేషించి చెబుతున్నారు. దేశాన్ని ప్రపంచంలో సూపర్ పవర్గా చేయడం ఎలాగో ప్రణాళికా బద్ధంగా వివరిస్తున్నారు. కేసీఆర్ అంచనాలకు తగినట్లు దేశం స్పందిస్తే తెలంగాణ మాడల్ అభివృద్ధి దేశమంతటా ఆవిష్కృతమవుతుంది. దేశ చరిత్రలో కొత్త అధ్యాయం ప్రారంభమవుతుంది.
– డాక్టర్ తిరునహరి శేషు,రాజకీయ విశ్లేషకులు, 98854 65877
మార్పు దిశగా…
స్వాతంత్య్రానంతరం భారతదేశం ఆశించినంత స్థాయిలో అభివృద్ధి చెందలేదు. దేశంలోని సహజ వనరులను సరిగా ఉపయోగించుకోలేదు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పరిపాలన సాగలేదు. రైతులకు అండగా నిలవలేదు. ఈ నేపథ్యంలో రాజ్యాంగ లక్ష్యాలకు అనుగుణంగా దేశ పునర్ నిర్మాణానికి పునరంకితం కావాలని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ భావిస్తున్నారు.
భారత్ను అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దాలని సంకల్పించారు. శ్రామిక శక్తి, సాగుభూమి, పుష్కలమైన జల వనరులున్న దేశంలో వ్యవసాయాన్ని ఎంతో అభివృద్ధి చేయవచ్చని కేసీఆర్ అభిప్రాయం. అలాగే యువశక్తికి సరైన శిక్షణను ఇచ్చి ఉపాధి కల్పిస్తే దేశం ప్రగతి పథంలో దూసుకెళుతుందని ఆయన విశ్వాసం. అందుకే దేశానికి దిశా నిర్దేశం చేయడానికి ఆయన జాతీయ రాజకీయాల్లోకి వస్తున్నారు. తాను ప్రారంభించబోయే జాతీయ పార్టీ విధానాల గురించి, దేశాభివృద్ధి గురించి మేధావులు, అధికారులు, రైతు సంఘాల నాయకులతో ఆయన ఇప్పటికే సుదీర్ఘంగా చర్చించారు. అందరి సహకారంతో దేశాన్ని సూపర్ పవర్గా ఎలా మార్చుకోవచ్చో దేశ ప్రజలకు విపులంగా వివరించారు. అవినీతి రహిత పాలనతో దేశంలో గుణాత్మక మార్పు తీసుకురావాలన్నది కేసీఆర్ ఆశయం. వ్యవసాయానికి చేయూత నివ్వాలని, దేశ యువతకు ఉపాధి కల్పించాలని ఆయన భావిస్తున్నారు. శాస్త్ర, సాంకేతిక రంగాల్లో దేశాన్ని నెంబర్ వన్గా తీర్చిదిద్దాలని కలలు కంటున్నారు. తెలంగాణ సీఎంగా ఈ 8 ఏండ్లలో కేసీఆర్ ఎన్నో అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి రాష్ర్టాన్ని ప్రగతి పథంలో నడిపారు. ఇప్పుడు అదే స్ఫూర్తితో, బాధ్యతతో దేశాభివృద్ధికి నడుం బిగించారు. ఆయన ప్రయత్నాన్ని ప్రతి భారతీయుడు స్వాగతించాల్సిన అవసరం ఉంది.
– డాక్టర్ రక్కిరెడ్డి ఆదిరెడ్డి, కాకతీయ విశ్వవిద్యాలయం