‘దైవత్వానికి పర్యాయపదమే పరిశుభ్రత’ అని జాతిపిత గాంధీజీ దేశవాసులకు ఉద్బోధించారు. ఆయన హితవును తెలంగాణ తొలి నుంచీ మన సా వాచా కర్మణా ఆచరణలో పెట్టింది కాబట్టే, నేడు మన రాష్ట్రంలోని గ్రామసీమలు పారిశుద్ధ్యానికి, స్వచ్ఛమైన పరిసరాలకు పట్టుగొమ్మలుగా మారాయి. కేంద్ర జల్శక్తి శాఖ నిర్వహించిన ‘గ్రామీణ స్వచ్ఛ్ సర్వేక్షణ్-2022’లో దేశంలోనే మొట్టమొదటి ర్యాంకును తెలంగాణ సాధించటమేగాక, టాప్-50 జిల్లా ల్లో 31 మనవి కావటమే దీనికి నిదర్శనం. దీని వెనుక సీఎం కేసీఆర్ సారథ్యంలో ప్రభుత్వం అత్యంత ప్రణాళికబద్ధంగా చేపట్టిన కృషి ఉన్నది. ముఖ్యం గా పల్లెప్రగతి కార్యక్రమంతో మన పల్లెల రూపురేఖలే మారిపోయాయి.
ఉమ్మడి ఏపీలో గ్రామీణాభివృద్ధి ఎంతో నిర్లక్ష్యానికి గురైన అంశం. అడపాదడపా పనులు చేపట్టినా వాటి మధ్య సమన్వయంగానీ, దిశానిర్దేశంగానీ ఉండేవి కావు. స్వరాష్ట్రంలో ఇది సమూలంగా మారింది. గ్రామాన్ని ఒక యూనిట్గా తీసుకొని అభివృద్ధి చేసే విధానాన్ని కేసీఆర్ ప్రభుత్వం తీసుకొచ్చింది. రోడ్ల వంటి మౌలిక సదుపాయాల కల్పన, హరితహారంతో చెట్లు, ఉద్యానవనాల పెంపకం, నిరంతర కరెంటు సరఫరాకు తగినట్లుగా ఏర్పాట్లు, అంత్యక్రియల నిర్వహణ కోసం వైకుంఠధామాల నిర్మాణం వంటివి ఒక ఉద్యమంలా కొనసాగాయి. పారిశుద్ధ్యానికి పెద్ద పీట వేస్తూ ప్రతి గ్రామపంచాయతీకి ట్రాక్టర్ను, నీళ్లట్యాంకర్ను సరఫరా చేయటం, వ్యర్థాల నిర్వహణకు డంపింగ్యార్డులను నిర్మించటం వంటి పనులు యుద్ధప్రాతిపదికన జరిగాయి. ఈ మార్పులను అనేక జాతీయ, అంతర్జాతీయ సంస్థలు గుర్తించాయి. ఏటా కేంద్రం ప్రకటించే అవార్డుల్లో తెలంగాణ సింహభాగం కైవసం చేసుకుంటున్నది. 2001-14 మధ్య పారిశుద్ధ్యం, పరిశుభ్రతకు సంబంధించి తెలంగాణకు కేవలం ఒక్కసారే కేంద్ర పురస్కారం లభించగా.. ప్రస్తుతం ఏటా పదుల సంఖ్యలో అవార్డులు లభిస్తున్నాయి.
ఎనిమిదేండ్ల స్వల్పవ్యవధిలో ఇంత మార్పు సామాన్యమైన విషయం కాదు. కానీ, తెలంగాణ ఈ అసాధ్యాన్ని సుసాధ్యం చేసింది. అయినప్పటికీ దీనిని గుర్తించటానికి నిరాకరిస్తూ కొందరు కేంద్రమంత్రులు, బీజేపీ నేతలు అడ్డగోలు వ్యాఖ్యలు చేయటం వారి నైతికతను ప్రశ్నార్థకం చేస్తున్నది. వారు రాష్ర్టానికి వచ్చి తలాతోకా లేని ఆరోపణలు చేస్తున్నప్పటికీ, తెలంగాణకు కేంద్ర ప్రభుత్వ అవార్డులను అందించక తప్పడం లేదు. అనేక అవరోధాలను ఎదుర్కొని రాష్ర్టాన్ని సాధించుకున్న తెలంగాణ ప్రజల జీవితాల్లో ఇప్పుడిప్పుడే మంచి మార్పులు వస్తున్నాయి. వ్యవసాయంతోపాటు వివిధ రంగాలు స్థిరత్వాన్ని సంతరించుకుంటున్నాయి. స్వచ్ఛసర్వేక్షణ్ అవార్డులు, మిషన్ భగీరథకు లభించిన పురస్కారం వంటివి ఈ అభివృద్ధికి దక్కిన గుర్తింపులే. ఎవరెన్ని విమర్శలు చేసినా, తెలంగాణ సమాజం ప్రగతి పథంలో ప్రస్థానాన్ని ఇలాగే కొనసాగించాలి.