(నేటి అలంకారం: సరస్వతీదేవి)
ఆశ్వయుజ, కార్తిక మాసాలుగా విస్తరించిన శరత్ రుతువు ఆహ్లాదకరమైన పండువెన్నెల కురిసే కాలం. ఈ శరత్ కాలం ప్రారంభంలో వచ్చే పర్వదినాలే శరన్నవరాత్రలు. శివాంగి అయిన పరాశక్తిని ఆశ్వయుజ శుక్ల పాడ్యమి మొదలుగా నవమి వరకు వివిధ అవతారాలతో అర్చిస్తూ చేసే ఆరాధనకు దేవీ నవరాత్రులు ఆలవాలం. ఈ ఆధ్యాత్మిక ఉత్సవాల్లో భాగంగా అమ్మవారిని వివిధ సంప్రదాయాల్లో, వివిధ రూపాలలో, వివిధ క్రమాల్లో కొలుస్తారు. నవరాత్రుల్లో మూలా నక్షత్రం పరివ్యాప్తమై ఉన్న రోజు అమ్మవారిని శ్రీ సరస్వతిగా అలంకరించి ఆరాధిస్తారు. సరస్వతీదేవి శ్వేత వస్త్రధారిణి, వీణాపాణి, హంసవాహిని. శారదగా చంద్రరేఖను ధరించినది. సత్త్వగుణమూర్తి అయిన ఆమె శుద్ధమైన చేతస్సుకు (మనసుకు), బుద్ధికి, శాంతానికి, ప్రేమకు ప్రతీక. వాక్కుకు, సంగీతానికి భారతి అధిదేవత. ఆమెను ఆరాధించడం వల్ల మన మనసు, వాక్కు, కర్మ పవిత్రమై, రసమయమై లోకహితంగా పరిణతి చెందుతాయి.
సరస్వతీ స్వరూపంలో ఉన్న శక్తి విలాసానికి నమస్కరిస్తూ యాజ్ఞవల్క్య మహర్షి.. ‘స్మృతిశక్తి జ్ఞానశక్తి బుద్ధిశక్తి స్వరూపిణీ, ప్రతిభాకల్పనా శక్తిర్యాచ తస్యై నమోనమః’ అని స్తుతించాడు. స్మృతి, జ్ఞానం, బుద్ధి, ప్రతిభ, కల్పనాశక్తుల కోసం ప్రార్థిస్తూ, ఆమెనే వ్యాఖ్యానంగా, వ్యాఖ్యాన అధిష్ఠానంగా, భౌతిక ప్రపంచంలోని ద్వంద్వాల వలయాలుగా భావిస్తూ అమ్మవారిని.. ‘వ్యాఖ్యానరూపా యాదేవీ వ్యాఖ్యాధిష్ఠాతృదేవతా, భ్రమసిద్ధాంతరూపాయా తస్యై దేవ్యై నమోనమః’ అని ప్రార్థించాడు.
మరి ఆ సరస్వతీదేవిని ఆరాధించేదెలా? ప్రార్థనతో అమ్మను పూజించాలి. తెల్లటి పూలు, వస్తువులతో అర్చన చేయాలి. సత్యాన్ని పలుకుతూ, నిత్యం సత్ గ్రంథాలను పఠిస్తూ, లోకంలోని అందరి హితాన్ని కోరుకోవడమే అమ్మవారికి చేసే నిజమైన ఆరాధన. అమ్మవారిని సేవించడం ద్వారా మనలో వివేకం పెరుగుతుంది. ఆమె అనుగ్రహం పాపరాశిని దగ్ధం చేస్తుంది. పాపాలను నిర్మూలిస్తూ బ్రహ్మానుభూతిని కలిగిస్తుంది. కాశ్మీర శారదాదేవి ప్రార్థనలో అమ్మను సంసారతాపాన్ని హరించే అమృతనదిగా వర్ణిస్తూ.. ‘భవానీం భవసంతాపనిర్వాపణ సుధానదీమ్..’ అని స్తుతిస్తారు. ఇదే భావనతో ఈ శరన్నవరాత్రులలో పరాశక్తి అయిన సరస్వతీమాత అవతారాన్ని ప్రత్యేక నిష్ఠతో కొలిచి వివేకవంతులుగా, విశుద్ధ ధర్మశీలురుగా, కళారసాత్ములుగా వికసిద్దాం!
– యముగంటి ప్రభాకర్, 94401 52258