జాతీయవాద కోణంలో చరిత్రను మార్చడమే ఆర్ఎస్ఎస్ నేతలు పనిగా పెట్టుకున్నారు. 25 ఏండ్ల క్రితమే గుజరాత్లో గాంధీ ఆదర్శాలు భూ స్థాపితం చేసే కుట్ర మొదలైంది. గాంధీని చంపిన నాథూరాం గాడ్సేకు గుజరాత్లో గుడి కట్టారు. గాడ్సే దేశ భక్తుడని కీర్తించిన ఆర్ఎస్ఎస్ నేత సాధ్వి ప్రజ్ఞ పార్లమెంటు సభ్యురాలిగా ఎన్నికయ్యారు.
నేటి పాలకులు అసూయ, ద్వేషాలతో గాంధీజీ ఆత్మహత్య చేసుకున్నాడని చరిత్రను వక్రీకరించడం ఊహించని విషాద వాస్తవం. గాంధీజీ హత్యకు కారణమైన ఆర్ఎస్ఎస్ ఆయన వారసత్వానికి తూట్లు పొడిచింది. గాంధీని చరిత్ర నుంచి తొలగించటం, ఆయన మహత్తర వ్యక్తిత్వానికి మసి పూయటం భారత దేశానికి చేటు. అసలు ఆనాడు ఏం జరిగిందో నేటి తరానికి తెలియజెప్పడం చాలా అవసరం. 30-01-1948 నాటి సాయంత్రం 38 ఏండ్ల నాథూరాం గాడ్సే తుపాకీతో గాంధీజీని కాల్చి చంపాడని ఆనాటి దిన పత్రికలు వార్తను ప్రచురించాయి. గాడ్సే ఆర్ఎస్ఎస్, హిందూ మహా సభల్లో క్రియాశీల సభ్యుడు. ఆర్ఎస్ఎస్ కల్పించిన విషపూరిత వాతావరణం వల్లే గాంధీజీ హత్య జరిగిందని నాటి కేంద్ర హోం మంత్రి పటేల్ ప్రకటించి ఆర్ఎస్ఎస్ను కొంత కాలం నిషేధించారు. గాంధీని హత్య చేయడానికి వెళుతున్న ఆప్టే, గాడ్సేలను విజయులై తిరిగి రమ్మని సావర్కర్ దీవించారని హిందు మహాసభ సభ్యుడు, గాంధీ హత్యలో భాగస్వామి అయిన దిగంబర్ బడ్గె కోర్టులో వెల్లడించారు.
హత్యకు ముందు ఆప్టే, గాడ్సేలు సావర్కర్ను పలుమార్లు సంప్రదించి సలహాలు తీసుకున్నారని న్యాయమూర్తి జీవన్ లాల్ కపూర్ నిర్ధారించారు. ప్రజాస్వామ్యాన్ని గాఢంగా విశ్వసించే గాంధీ అభిప్రాయ భేదాల పరిష్కారం కోసం గాడ్సేను చాలాసార్లు చర్చలకు పిలిచారు. కానీ గాడ్సే చర్చలకు రాలేదు. గాంధీని జాతిపిత అనకూడదని, హిందూ మతమే జాతీయతని 1961లో సావర్కర్ ప్రకటించారు. సంఘ్ మతోన్మాద, నియంతృత్వ సంస్థ అన్నారు.
కరెన్సీ నోట్లపై గాంధీ బొమ్మను తీసేయాలని హిందూ మహా సభ మీరట్ అధ్యక్షుడు భరత్ కోరారు. “గాంధీ పేరు ఖాదీ అమ్మకాలను తగ్గించింది. గాంధీని తీసి మోదీని పెట్టడం మంచిదయింది. గాంధీని మించిన గుర్తింపు మోదీ పొందారు” అని హరియాణా బీజేపీ మంత్రి అనిల్ విజ్ వ్యాఖ్యానించడం బీజేపీ నాయకుల అహంకారానికి నిదర్శనం. నియంతలు గత కాలపు ఘనతలను రూపు మాపి వాటి స్థానంలో కొత్త గుర్తులను ప్రతిష్ఠిస్తారు. ఖాదీ గ్రామోద్యోగ సంస్థ 2017 క్యాలెండర్, డైరీలపై గాంధీకి బదులు ప్రధాని మోదీ ఫొటోను ముద్రించడం దీనికి ఉదాహరణగా చెప్పుకోవచ్చు.
పాకిస్థాన్ మత సంకుచిత భావాలతో మరణించింది. భారత్కూ ఆ గతే పట్టబోతోందని ప్రముఖ పాక్ పాత్రికేయుడు ఖలేద్ అహ్మద్ అన్నారు. గాంధీ జీవితం నుంచి నెల్సన్ మండేలా, మార్టిన్ లూథర్ కింగ్ లాంటి నాయకులు ప్రేరణ పొందారు. విశ్వమంతా గాంధీని చదివి, అనుసరించి లబ్ధి పొందింది. కానీ బీజేపీ, ఆర్ఎస్ఎస్ నాయకులు మాత్రం గాంధీని విస్మరించారు. ఆ మహాత్ముని ఘన వారసత్వాన్ని ఆచరించటమే ఆ మహా మనిషికి అసలైన నివాళి.
వ్యాసకర్త: సంగిరెడ్డి హనుమంత రెడ్డి
(ఆల్ ఇండియా ప్రొగ్రెసివ్ ఫోరం జాతీయ కార్యదర్శి, 94902 04545)