తెలంగాణ సంస్కృతి విలక్షణమైనది. రాష్ట్ర ప్రజలు జరుపుకొనే పండుగల్లో ‘బతుకమ్మ’ ప్రత్యేకమైనది. బతుకమ్మ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక. ప్రకృతిని ఆరాధిస్తూ, పూజిస్తూ తెలంగాణ సాంస్కృతిక అస్తిత్వాన్ని ప్రపంచానికి చాటిచెప్పే పండుగ బతుకమ్మ. ఆశ్వీయుజ మాస శుద్ధ పాడ్యమి నుంచి 9 రోజుల పాటు తెలంగాణ ఆడపడుచులంతా బతుకమ్మను ఘనంగా జరుపుకుంటారు. కులమతాలు, వయోభేదం లేకుండా సంబురంగా ఆడుతూ పాడుతూ గౌరీదేవిని అత్యంత భక్తిశ్రద్ధలతో పూజించే పూల పండుగ ఇది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత ప్రభుత్వం ఏటా ‘బతుకమ్మ’ను అధికారికంగా నిర్వహించటం అభినందనీయం.
బతుకమ్మ పండుగ ఎలా మొదలైందో చెప్పడానికి ఎన్నో చారిత్రక కథలు, పురాణాలు ప్రచారంలో ఉన్నాయి. వెయ్యేండ్లుగా ఇక్కడి ప్రజలు బతుకమ్మను తమ ఇంటిదేవతగా పూజిస్తున్నారు. తెలంగాణ ఉద్యమంలో ఉద్యమానికి ఊపునిచ్చి తెలంగాణ ప్రజానీకాన్ని కదిలించటమే కాదు, మన అస్తిత్వాన్ని నిలబెట్టిందీ బతుకమ్మ పండుగ.బతుకమ్మ పండుగ ఎలా మొదలైందని చెప్పడా నికి అనేక కథలు ప్రచారంలో ఉన్నాయి. అందు లో రాష్ట్ర కూట రాజులకు సంబంధించిన కథ కూడా ఒకటి ఉన్నది. తెలంగాణ ప్రాంతాన్ని ఒకప్పుడు రాష్ట్రకూట రాజులు పాలించేవారు. వారి వద్ద వేములవాడ చాళుక్యులు సామంతులుగా ఉండేవారు. క్రీ.శ.973లో చాళుక్య రాజైన తైలపాడు రాష్ట్రకూటులకు చివరి రాజుగా వ్యవహరించిన కర్కుడిని చంపి కళ్యాణి చాళుక్య రాజ్యాన్ని నెలకొల్పాడు. ప్రస్తుత తెలంగాణ ప్రాంతాన్ని తైలపాడు పరిపాలించేవాడు. క్రీ.శ.997లో తైలపాడు మరణించడంతో అతని కుమారుడు సత్యాశ్రయుడు రాజ్యపీఠాన్ని అధిష్ఠించాడు.
ఆపదలో ఉన్నవారిని వేములవాడ రాజరాజేశ్వరి రక్షిస్తుందని అప్పటి ప్రజలు నమ్మేవారు. ప్రజలే కాదు చోళరాజు పరాంతక సుందరచోళ కూడా రాష్ట్రకూటుల నుంచి ఆపద తలెత్తినప్పుడు రాజరాజేశ్వరిని వేడుకునేవాడు. అలా రాజరాజేశ్వరే తమను కాపాడుతున్నదని నమ్మిన పరాంతక సుందర చోళ తన కుమారుడికి రాజరాజ అని పేరు పెట్టుకున్నాడు. ఆ రాజరాజ చోళనే క్రీ.శ.985-1014 వరకు రాజ్యాన్ని పరిపాలించాడని చరిత్ర చెప్తున్నది. అతని కుమారుడైన రాజేంద్రచోళ సత్యాశ్రయునితో జరిగిన యుద్ధానికి సేనాధిపతిగా వ్యవహరించి విజయం సాధించాడు. ఆ విజయానికి గుర్తుగా రాజేశ్వరి ఆలయాన్ని కూల్చి అందులోని భారీ శివలింగాన్ని తన తండ్రికి బహుమతిగా ఇచ్చాడు. తన కొడుకు ఇచ్చిన శివలింగం కోసం క్రీ.శ.1006లో ఏకంగా బృహదేశ్వరాలయాన్ని నిర్మించాడు రాజరాజ చోళ. క్రీ.శ.1010లో నిర్మాణం పూర్తయ్యాక భారీ శివలింగాన్ని అందులో ప్రతిష్ఠించారు.
వేములవాడ బృహదమ్మ (పార్వతి) నుంచి శివలింగాన్ని వేరు చేసి తంజావూరుకు తరలించడం తెలంగాణ ప్రజలను కలచివేసింది. తమ దుఃఖాన్ని చోళులకు తెలియజేస్తూ పూలను మేరు పర్వతంలా పేర్చి బతుకమ్మ పేరుతో ఉత్సవాలు నిర్వహించడం మొదలుపెట్టారు. అప్పటినుంచి ఏటా బతుకమ్మను జరపడం ఆనవాయితీగా వస్తున్నది. బృహదమ్మ నుంచి వచ్చినదే బతుకమ్మ.
ఒక్క బతుకమ్మే కాదు, తెలంగాణ ప్రజలు జరుపుకొనే ప్రతి పండుగ సామాజిక సంబంధాలకు అద్దం పడుతుంది. ప్రకృతితో పాటు మనిషితో గాఢమైన నిరం తర సంబంధాలు ప్రదర్శించే అపురూపమైన ఉత్సవం బతుక మ్మ. ఇది తెలంగాణ సహజ జీవన సౌందర్యానికి ప్రతీక. బతుకమ్మకు వాడే పూలు కూడా సహజ సిద్ధంగా లభించేవి కావడం విశేషం. మానవ ప్రయత్నం లేకుండా సహజంగా లభించే మొక్కలకు, తీగలకు పూసేవే. పూలు బాగా వికసించే కాలంలో జలవనరులు సమృద్ధిగా పొంగిపొరలే సమయంలో.. భూమితో, జలంతో మానవ అనుబంధాన్ని సంబురంగా జరుపుకుంటాం.
ఈ సంబురాల్లో పెండ్లి కాని అమ్మాయిలు పుట్ట మన్నుతో దుర్గాదేవి బొమ్మను చేసి బొడ్డెమ్మగా పూజిస్తారు. వాకిట్లో ముగ్గులు వేసి ఆడుతారు. ఈ పండుగ బొడ్డెమ్మతో మొదలై సద్దుల బతుకమ్మతో ముగుస్తుంది. ఇలా మట్టిరూపం నుంచి పూలరూపం పొంది నీళ్లలో కలిసిపోయే తంతు అంతా జానపదుల సంస్కృతిలో భాగం.
ఈ పండుగలో ఆద్యంతం జానపదుల జీవనవిధానం మేళవిస్తుంది. ప్రకృతిని, పూలను కొలిచే సంస్కృతి ఒక్క తెలంగాణలో తప్ప దేశంలో ఎక్కడా లేదు. ఇది మనకు గర్వకారణం. ప్రకృతిలో లభించే రకరకాల పూల వలె అందరూ కలిసిమెలిసి బతుకాలనే గొప్ప సందేశం ఈ పండుగ అంతర్గతంగా మనకు బోధిస్తున్నది. ముఖ్యంగా బతుకమ్మ పండుగ అంటేనే పల్లెవాసుల జీవనశైలి. శ్రామిక రైతుల బతుకు చిత్రం. రాష్ట్రవ్యాప్తంగా అంతా కలిసి సమతాభావాన్ని పెంపొందించే గొప్ప ఉత్సవం ఈ బతుకమ్మ పండుగ.
(వ్యాసకర్త: దాసరి శాంతకుమారి , 96524 83644 తెలుగు భాష ఉపాధ్యాయురాలు)