ఎనిమిదేండ్లుగా దేశంలో బీజేపీ పాలన నడుస్తున్నది. గుజరాత్ మోడల్ పేరు జెప్పి అధికారంలోకి వచ్చిన బీజేపీ సర్కార్ ఈ
ఎనిమిదేండ్లలో దేశానికి చేసింది ఏమీ లేకపోగా. దేశం ఎన్నడూ లేనటువంటి విపత్కర పరిస్థితుల్లోకి నెట్టబడింది అన్నది
నిర్వివాదాంశం. గుజరాత్ మోడల్ విషయానికి వస్తే ప్రచార ఆర్భాటం తప్ప అక్కడ జరిగిన అభివృద్ధి శూన్యం.
ఈ ఎనిమిదేండ్లలో ఎన్నో సవాళ్ళను అధిగమిస్తూ.. అభివృద్ధి పథంలో ఒక్కొక్క మెట్టు ఎక్కు తూ అనేక రంగాల్లో తెలంగాణ రాష్ర్టాన్ని దేశానికే స్ఫూర్తినిచ్చేలా తీర్చిదిద్దారు సీఎం కేసీఆర్. కానీ గుజరాత్లో సంక్షేమం, అభివృద్ధి గురించి దేశ ప్రజలు చర్చించుకునే విధంగా ఏ ఒక్క కార్యక్రమానికీ బీజేపీ రూపకల్పన చేయలేకపోయింది.
తెలంగాణలో ప్రారంభించిన సంక్షేమ పథకాలు ముఖ్యంగా రైతుబంధు, రైతుబీమా అన్నదాతకు ఆలంబనగా నిలిచాయి. తెలంగాణలో సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగింది. సమైక్య రాష్ట్రంలో ఆకలిదప్పుల తెలంగాణ, స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ పాలనలో అన్నపూర్ణగా నిలిచి దేశానికే తిండి పెట్టే స్థాయికి చేరుకున్నది. 2013-14లో రాష్ట్రంలో 66.2 లక్షల టన్నుల ధాన్యం పండగా.. 2021 వచ్చేసరికి అది 251 లక్షల టన్నులకు పెరిగింది. ఇది దేశ చరిత్రలోనే సువర్ణాక్షరాలతో లిఖించాల్సిన సందర్భం.కానీ దురదృష్టవశాత్తూ సాధించిన విజయాన్ని వెన్నుతట్టి ప్రోత్సహించాల్సింది పోయి తెలంగాణ పట్ల, ఇక్కడి రైతుల పట్ల మోదీ సర్కార్ అవలంబిస్తున్న విధానా లు దురదృష్టకరం. కేంద్రం తెలంగాణ నుంచి ధాన్యం సేకరణకు మొండిచేయి చూపుతున్నది. అదే సమయంలో ఆకలి సూచీలో 116 దేశాలలో మనదేశం 101 స్థానంలో ఉండటం దేశ ప్రజల దైన్య స్థితికి అద్దం పడుతున్నది.
తెలంగాణ ఒక్క వ్యవసాయరంగంలోనే కాదు.. అన్ని రంగాల్లో అద్భుతమైన ప్రగతిని సాధించింది, సంక్షేమం, అభివృద్ధి ఏకకాలం లో జోడెద్దులుగా కేసీఆర్ ముందుకు నడిపిస్తున్న తీరును దేశ ప్రజలు గమనిస్తున్నారు. కేసీఆర్ దార్శనిక పాలన ఫలితంగా నేడు దేశ ఆర్థిక వ్యవస్థకు ఊతం ఇస్తున్న మొదటి నాలుగు రాష్ర్టాల్లో తెలంగాణ ఒకటిగా నిలబడటం మన కు గర్వకారణం. మోదీకి ప్రచార ఆర్భాటం తప్ప, దేశ అభివృద్ధి విషయంలో చిత్తశుద్ధి కొరవడింది. తెలంగాణ వంటి రాష్ర్టాల్లో అధికారంలోకి రావాలనే యావ తప్ప తెలంగాణ ప్రజల ఆకాంక్షల మీద, అవసరాల పట్ల ఎలా ంటి అవగాహన లేదు. అభివృద్ధి విషయంలో సరైన కార్యాచరణ లేని బీజేపీ సర్కార్ పాలనలో రూపాయి పతనం దేశ ఆర్థిక తిరోగమనానికి సంకేతం. 2014లో డాలర్తో రూపా యి మారక విలువ రూ.62గా ఉన్నప్పుడు మొసలి కన్నీరు కార్చిన మోదీ.. బీజేపీ పాలనలో రూ.82కు చేరిన తరుణంలో దేశ ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది.
రాష్ట్ర ప్రజలకు ఏం కావాలో రాష్ట్ర ముఖ్యమంత్రిగా పూర్తిస్థాయిలో అవగాహన ఉన్న వ్యక్తిగా కేసీఆర్ ఒక కార్యాచరణ ప్రకారం ముందుకు వెళ్తున్నారు. ఉమ్మడి పాలనలో పరిశ్రమలకు పవర్ హాలిడేల నుంచి నేడు తెలంగాణ రాష్ర్టాన్ని నిరంతరం విద్యుత్ వెలుగులు జిమ్మే రాష్ట్రంగా తీర్చిదిద్దారు. టీఎస్ ఐపాస్ ద్వారా పెట్టుబడులకు ప్రోత్సాహం అందించారు. ఈ విధానం ద్వారా 2 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులను ఆకర్షించగలిగాము. 16 లక్షలకు పైగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాము. 2014 నుంచి ఇప్పటివరకు దాదాపు 2 లక్షలకు పైగా ప్రభుత్వ ఉద్యోగాల ను భర్తీ చేసుకుంటున్నాము. ఐటీ రంగంలో విప్లవాత్మక పురోగతి సాధించాము. అదే క్రమంలో దేశంలో మాత్రం నిరుద్యోగం పెరుగుతూ పోతున్నది. మోదీ ఇచ్చిన హామీ ప్రకారం ఏడాదికి 2 కోట్ల ప్రభుత్వ ఉద్యోగాల కల్పన లెక్కన ఈ ఎనిమిదేండ్లలో 16 కోట్ల ఉద్యోగాలను భర్తీ చేయవలసి ఉన్నది. ఈ భర్తీ ఏమోగానీ ప్రభుత్వ సంస్థలను ప్రైవేట్ పరం చేస్తూ ఉద్యోగులను రోడ్డు మీదకు ఈడుస్తున్నది. దేశ యువతను మోసం చేస్తున్న మోదీ సర్కార్.. వారి దృష్టిని మరల్చడానికి విద్వేష రాజకీయాలకు పాల్పడుతున్నది.
అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు తగ్గుతున్నా.. దేశంలో మాత్రం పెట్రో ల్, డీజిల్ ధరలు తగ్గడం లేదు. వంట గ్యాస్ ధరల గురించి ఎంత తక్కువ మాట్లాడితే అం త మంచిది. దేశంలో నిత్యావసరాల ధరలు ఆకాశాన్ని చూస్తున్నాయి. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా రాష్ట్ర అభివృద్ధి కోసం కేసీఆర్ ఏం చేశారో చెప్పడానికి కొన్ని వందల కార్యక్రమా లు ఉన్నాయి. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, కాళేశ్వరం ప్రాజెక్టు, ఆసరా, కల్యాణలక్ష్మి, రైతుబంధు, చేనేతకు చేయూత, సంక్షే మ హాస్టళ్లు ఇలా అనేక కార్యక్రమాలతో తెలంగాణను ప్రగతిశీల రాష్ట్రంగా తీర్చిదిద్దారు. కానీ మోదీ సర్కార్ దేశానికి చేసింది మాత్రం శూ న్యం. నమీబియా నుంచి చీతాలను పట్టుకొచ్చిన మోదీ. దేశప్రజలను మోసం చేసి రూ.వేల కోట్లు ఎగ్గొటిన ఆర్థిక నేరస్థులను దేశానికి రప్పించడంలో విఫలమయ్యారు. నల్లధనం వెనక్కి రావడం మాట అటుంచితే రూ.లక్షల కోట్ల ను కార్పొరేట్లకు మాఫీ చేసిన మోదీ.. సంక్షేమ పథకాలను ఉచితాలు అంటూ విమర్శలు గుప్పించడం దారుణం.
తెలంగాణ రాష్ర్టానికి హక్కుగా దక్కాల్సిన బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ విషయంలో బీజేపీ చేతులెత్తేయడం.. ఇది అసాధ్యం అని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ప్రకటించడం రాష్ట్ర అభివృద్ధి విషయంలో తెలంగాణ బీజేపీ నేతల అసమర్థతకు నిదర్శనం. దేశాన్ని అన్ని రంగాల్లోభ్రష్టు పట్టించి, ఏదో ఘనకార్యం చేసినట్లు తెలంగాణ రాష్ర్టానికి కేంద్ర మంత్రులు క్యూ కడుతున్న తీరు సిగ్గుచేటు. దేశాన్ని పాలించలేని వీళ్ళ అసమర్థత మీద ప్రజలు ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చారు. దేశంలో ప్రత్యామ్నాయం కోసం ఎదురు చూస్తున్నారు. సీఎం కేసీఆర్ పాలనలో తెలంగాణ పురోగమనం.. మోదీ పాలనలో దేశ తిరోగమనం మీద ప్రజ లు చర్చించుకుంటున్నారు. వైఫల్యాలకు కేరా ఫ్ అడ్రస్గా నిలిచిన మోదీ కబంధ హస్తాల నుండి దేశాన్ని విడిపించేందుకు అవసరమైన మార్పు దిశగా దేశ యువత ఆలోచిస్తున్నది. ఇది శుభ పరిణామం.
(వ్యాసకర్త: బాల్క సుమన్ , ప్రభుత్వ విప్, చెన్నూర్ ఎమ్మెల్యే)