అచ్ఛేదిన్ కోసం దేశ ప్రజలు ఆశగా ఎదురు చూసి విసిగిపోయారు. తమ బతుకుల్లో మంచి రోజులు ఎప్పుడొస్తాయని ప్రధాని మోదీని ప్రశ్నిస్తున్నారు. బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోలోని హామీల్లో ఒక్కటైనా అమలు చేశారా అని నిలదీస్తున్నారు. నల్ల ధనం ఎందుకు వెనక్కి తీసుకురాలేదని ప్రశ్నిస్తున్నారు. ఇంకా అనేక ప్రశ్నలు సామాన్యులు సంధిస్తున్నారు. కానీ మోదీ మాత్రం మౌన వ్రతాన్నే అవలంబిస్తున్నారు.
దేశంలో నిరుద్యోగం భారీగా పెరిగింది. నిత్యావసరాల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. కానీ ప్రధాని మాటలు మాత్రం కోటలు దాటుతున్నాయి. చేతలు మాత్రం ఈ రోడ్డు నుంచి అవతలకు కూడా దాటడం గగనమవుతున్నది. సుఖ్ చైన్ కి జిందగీ (సుఖ శాంతుల జీవితం) మీకు ఇవ్వడానికి నేను సిద్ధం… మీరు నాకు 60 నెలలు అధికారం ఇవ్వండని నరేంద్ర మోదీ 2014 సంవత్సరంలో దేశ ప్రజల్ని కోరారు. 60 నెలలు కాదు ఏకంగా 120 నెలలు ఆయనకు అధికారం ఇచ్చింది దేశం. అందులో ఇంకా 24 నెలలు మిగిలి ఉన్నాయి. కానీ మోదీ ఏటా 2 కోట్ల ఉద్యోగాలిస్తామన్న హామీ నెరవేరలేదు. కొత్త వాటి సంగతేమో కానీ ఉన్న కొలువుల్లో రెండు కోట్ల ఉద్యోగాలు ఊడి పోయాయి. ప్రభుత్వ రంగ సంస్థల అమ్మకం కారణంగా లక్షలాది మంది రోడ్డున పడ్డారు. నిరుద్యోగుల సంఖ్య 23 కోట్లకు పెరిగింది.
ఏటా 8 లక్షల మంది భారతీయ విద్యార్థులు చదువుల కోసం విదేశాలకు వెళుతున్నారు. ఇలా ఇప్పటికే మన దేశం డబ్బు డాలర్ల రూపంలో రూ.4 లక్షల కోట్లు బదిలీ అయ్యింది. దీనికి బాధ్యులెవరు పీఎం గారు? ప్రపంచ స్థాయి యూనివర్సిటీల స్థాపన కలగానే మిగిలిపోతుందా? 130 కోట్ల జనాభా ఉన్న దేశంలో 80 కోట్ల మందికి ప్రభుత్వం ఇచ్చే 5 కేజీల ఉచిత రేషనే దిక్కయ్యింది. కరోనా వల్ల దాదాపు 22 కోట్ల మంది మధ్య తరగతి వాళ్ళు పేదరికాన్ని చవి చూశారు. అసమానతలు భారీగా పెరిగి పోయాయి. ఆశ్రిత పెట్టుబడి దారీ విధానం వల్ల దేశ సంపదలో చాలా భాగం 1 శాతం సంపన్నుల చేతుల్లో కేంద్రీకృతమైంది. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను, నిర్ణయాలను వ్యతిరేకించిన వారిని ప్రభుత్వం జైళ్లకు పంపిస్తోంది. దేశ ద్రోహం కేసులు మోపుతోంది. ప్రజల గొంతు వినిపించిన, న్యాయం పక్షాన నిలిచిన పాత్రికేయులను సైతం కేంద్రం వదలడం లేదు. లఖీంపూర్ ఖేరిలో కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా కొడుకు, అతని మిత్రులు కలిసి నలుగురు రైతులను, ఒక జర్నలిస్టును మంత్రి పేరు మీద ఉన్న కారుతో ఢీ కొట్టి తొక్కి చంపితే మంత్రి కొడుకును మాత్రం జైల్లో ఉంచారు. కేంద్ర మంత్రికి ఈ ఘటనతో సంబంధం ఉందని రుజువైనా ఎలాంటి చర్యలు లేవు.
మూడు రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని రైతులు ఢిల్లీ సరిహద్దుల్లో చేసిన 378 రోజుల సత్యాగ్రహంలో 750 మంది అమరులయ్యారు. కానీ ప్రభుత్వంలో పెద్దగా చలనం లేదు. హత్రాస్లో దళిత యువతి అత్యాచారం, హత్య జరిగిన తర్వాత కుటుంబ సభ్యులకు ఆమె శవాన్ని ఇవ్వకుండానే దహనం చేశారు. ఆవు మాంసం తిన్నారని ఇద్దరు ఆదివాసీలను మతోన్మాద శక్తులు హత్య చేశాయి. దేశంలో తరచూ బాలికలు, మహిళలపై అత్యాచారాలు, హత్యలు జరుగుతున్నాయి. ఇవన్నీ పరిశీలిస్తే దేశంలో ఎక్కడా మంచి రోజులు లేవు. గడచిన నాలుగు దశాబ్దాల్లో నిత్యావసరాల ధరలు విపరీతంగా పెరిగాయి. రైతుల రోజువారీ ఆదాయం 28 రూపాయలకు పడిపోయిన పరిస్థితి ఏర్పడింది. కానీ ప్రభుత్వం ఎలాంటి నష్ట నివారణ చర్యలు చేపట్టడం లేదు.
కరోనా ఉధృతంగా ఉన్నప్పుడు తగినంత ఆక్సిజన్ సరఫరా లేక వేల మంది మరణించారు. గంగా నదిలో కరోనా మృతుల శవాలు తేలియాడిన పరిస్థితి కనిపించింది. మోదీ ప్రభుత్వం ఆర్భాటంగా చేపట్టిన గంగా నది శుద్ధి ప్రాజెక్ట్ సగం కూడా పూర్తి కాలేదు. వైద్యం, విద్యలో పురోగతి లేదు. ప్రముఖ యూనివర్సిటీలు అధ్యాపకుల కొరతతో విద్యా విహీనంగా మారాయి. ఇలాంటి పరిస్థితిలో అమృత కాలం ఎక్కడ? అంతా ఆర్భాటమే… అధికారం నిలుపుకోవడానికి ఆరాటమే. దేశంలో 8 ఏండ్ల పాలనా కాలంలో ఒక్కటంటే ఒక్క మీడియా సమావేశం నిర్వహించని ప్రధానమంత్రి ఎవరంటే… అది నరేంద్ర మోదీనే. పెద్దగా పని లేకపోయినా ఎక్కువసార్లు విదేశాలకు వెళ్లిన ప్రధానీ ఆయనే. అత్యంత ఖరీదైన దుస్తులు ధరిస్తూ, లెక్కలేనన్ని సౌకర్యాలు అనుభవిస్తూ, తన భద్రతకు 400 కోట్ల రూపాయలు ఖర్చు చేసుకుంటున్న ప్రధానిగా మోదీ ప్రఖ్యాతి గాంచారు. దేశంలో ఒక్కటి మాత్రం పక్కాగా జరుగుతున్నది… డబుల్ ఇంజిన్ సర్కారు నినాదంతో ఇప్పటి దాకా ఏడు విపక్ష సర్కార్లను బీజేపీ కూల్చింది. వివిధ రాష్ర్టాల్లోని వివిధ పార్టీల ఎమ్మెల్యేలను కోట్ల రూపాయలు కుమ్మరించి కొనుగోలు చేసింది. తమ వెంట ఉండే వారికి, తమ అడుగులకు మడుగులు ఒత్తే వారికి ఢోకా లేదు. లేకపోతే ఈడీ దాడులు, చేతులకు బేడీలు. బీజేపీ కక్ష సాధింపు చర్యలతో ప్రత్యర్థి పార్టీల నాయకులు భయం భయంగా మనుగడ సాగిస్తున్నారు.
దేశంలో ఇన్ని అక్రమాలు, అన్యాయాలు జరుగుతున్న నేపథ్యంలో ఇప్పటికైనా పౌర సమాజం మేల్కొనాలి. ఇప్పుడు కాకుంటే మరెప్పటికీ సాధ్యం కాదు. ‘80-20 శాతం’ ఓట్ల రాజకీయాలను ఆధారం చేసుకుని అధికారాన్ని కాపాడుకుంటామనే నమ్మకం బీజేపీకి ఉంది. మతాలు, భావోద్వేగాలతో ఓట్లు కొల్లగొట్టవచ్చని భావిస్తోంది. ఎలక్టోరల్ బాండ్ల ద్వారా బీజేపీకి భారీగా నిధులు వస్తున్నాయి. ఈ పద్ధతిలో ఎవ్వరికీ లెక్కలు చెప్పాల్సిన పని లేదు! పీఎం కేర్ నిధి లెక్కలు ఎలానూ చెప్పరు. కానీ పారదర్శకత గురించి పదే పదే మాట్లాడుతుంటారు. మీ పుట్టిన రోజు నాడు మహారాష్ట్రకు చెందిన ఒక రైతు మీకు శుభాకాంక్షలు చెప్పి, వ్యవసాయ నష్టాలు భరించలేక ఆత్మహత్య చేసుకున్నారు. ఎంత విషాదం ప్రధాన మంత్రి గారు? ఎంత తీవ్రమైన విషయం. అయినా మీలో ఎందుకు స్పందన లేదు? అచ్ఛేదిన్ అంటే ఇవేనా? సబ్కా సాత్… సబ్కా వికాస్ అంటే అర్థం ఇదేనా?
( వ్యాసకర్త : ఎండి.మునీర్ , 99518 65223, సీనియర్ జర్నలిస్ట్)