కోల్కతాలో అయిదు దుస్తుల దుకాణాలు నడిపే శాలిని ఘోష్ కరోనా రెండో దశ దెబ్బకు మూడు దుకాణాలను మూసేశారు. మిగిలిన రెండు షాపుల్లో గుట్టలుగా పేరుకుపోయిన దుస్తులను అమ్మడానికి కొందరు మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్లను నియమించాలనుకున్నారు. అందుకోసం సోషల్ మీడియాలో ప్రకటన ఇచ్చారు. వందల కొద్దీ పోస్టు గ్రాడ్యుయేట్లు, పీహెచ్డీలు చేసినవారు ఆ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్నారు. భారత దేశంలో నిరుద్యోగ తీవ్రతకు ఇది ఒక ఉదాహరణ మాత్రమే.
మనం ఆందోళన చెందాల్సిన మరో విషయం… చదువుకున్న నిరుద్యోగులు పెరిగిపోవడం. భారత ఆర్థిక వ్యవస్థ పర్యవేక్షణ కేంద్రం(సీఎంఐఈ) విశ్లేషణ ప్రకారం రాజస్థాన్, బీహార్, ఆంధ్రప్రదేశ్ మొదలైన రాష్ర్టాలు మూడింట ఒక వంతు మంది పట్టభద్రులకు కూడా ఉద్యోగాలను కల్పించలేకపోయాయి. ఈ ఏడాది జులైలో నమోదైన నిరుద్యోగిత రేటు 6.08%తో పోలిస్తే ఆగస్టు నాటికి అది 8.28%కు చేరింది. గత ఏడాది కాలంలో ఇదే అత్యధిక నిరుద్యోగిత రేటు. ప్రస్తుతం దేశంలో 4-4.5 కోట్ల మంది నిరుద్యోగులు ఉన్నారని అంచనా. పట్ణణ నిరుద్యోగిత రేటు 9.57 శాతంగా ఉండగా, గ్రామీణ నిరుద్యోగిత రేటు 7.68 శాతంగా నమోదైంది. నిరుద్యోగిత రేటు అత్యధికంగా నమోదైన రాష్ర్టాల్లో బీజేపీ పాలిత హర్యానా 37.3 శాతంతో మొదటి స్థానంలో ఉంది. తెలంగాణలో నిరుద్యోగిత రేటు 6.9 శాతంగా ఉంది.
కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలేవీ ఉపాధిని పెంచడం లేదని విమర్శలు వినిపిస్తున్నాయి. గత రెండేండ్లలో నిరుద్యోగిత రేటు మరింత ఎక్కువైనట్లు కేంద్ర మంత్రిత్వ శాఖలు చేసిన సర్వేల్లోనే వెల్లడైంది. దేశంలో వివిధ ఉత్పత్తులకు డిమాండ్ తగ్గిపోవడం వల్ల ఉపాధి అవకాశాలు తగ్గిపోయాయి. 40-59 ఏండ్ల మధ్య వయస్కుల్లో 57 శాతం నిరుద్యోగులుగా ఉన్నా రు. వీరు తక్కువ వేతనాలకే పని చేయడానికి సిద్ధ పడటంతో ఉన్నత విద్యార్హతలు, నైపుణ్యాలు కలిగిన యువతకు ఉపాధి లభించడం లేదు.
ప్రపంచ ఆర్థిక వేదిక అంచనా ప్రకారం భారత్లో ఏటా 1.3 కోట్ల మంది కొత్తగా శ్రామిక జనాభాకు జత అవుతున్నారు. ఇంత మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలంటే ఈ ఏడాది మొదలుకుని 2030 వరకు ఏటా సుమారుగా 8-8.5% వృద్ధిని సాధించాలి. అయితే నలుగురు మేనేజ్మెంట్ నిపుణుల్లో ఒకరు, అయిదుగురు ఇంజినీర్లలో ఒకరు, 10 మంది పట్టభద్రుల్లో ఒకరు మాత్రమే ఉద్యోగాలకు తగిన నైపుణ్యాలు కలిగి ఉన్నారు. డేటా సైన్స్, బిగ్ డేటా, మెషిన్ లెర్నింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ, వెబ్ డెవలప్మెంట్ లాంటి సాంకేతిక ఉద్యోగాలను పక్కన పెడితే సంప్రదాయ ఉద్యోగాలు చేసేందుకు సైతం నేటి విద్యార్థులు సరిగ్గా సమాయత్తం కావడం లేదు. వీరికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తగిన శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పించాల్సి ఉంది. రవాణా, హోటళ్లు, కమ్యూనికేషన్స్, ప్రసార మాధ్యమాలు, ఆర్థిక సేవలు, విద్య, ఆరోగ్యం, ఐటీ, బీపీవో తదితర ప్రొఫెషనల్ సర్వీసుల్లో ఉద్యోగాల సంఖ్య పెంచేందుకు భారత్ కృషి చేయాలని చాలా మంది ఆర్థిక వేత్తలు సూచిస్తున్నారు.
ఆశ్రిత పెట్టుబడి దారీ విధానాల వల్ల దేశ సంపదలో చాలా భాగం ఇద్దరు, ముగ్గురు కార్పొరేట్ల ఖాతాలో పోగవుతోంది. మన దేశం ప్రపంచంలోనే అయిదో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించినా, ఉపాధి అవకాశాలు పెరగడం లేదు. నిరుద్యోగిత రేటు ఎందుకు పెరుగుతోందని ప్రశ్నించిన వారిని దేశ ద్రోహులుగా చిత్రీకరిస్తారు. కులం, మతం పేరుతో మంటలు పెట్టి ప్రజా ప్రయోజన అంశాలు చర్చకు రాకుండా చేస్తారు.
ప్రస్తుతం దేశం ముందు మూడు ముఖ్యమైన సవాళ్లు ఉన్నాయి. 1.కరోనా కారణంగా నిరుద్యోగులైన యువతకు ఉపాధి చూపించడం 2.ఉద్యోగ నైపుణ్యాలు లేని యువతకు పని కల్పించడం. 3.ఉన్నత చదువులు చదివి కొలువులు కోల్పోయినవారికి ఉద్యోగాలు కల్పించడం. ఒకవైపు ద్రవ్యోల్బణం దేశ ఆర్థిక పరిస్థితికి ప్రమాదకరంగా మారింది. మరోవైపు నిరుద్యోగ భూతం కోరలు చాచింది. ఇలాంటి పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం ఉన్న ఉద్యోగాల్లోనూ కోత పెడుతోంది. 2020 సెప్టెంబర్లో దేశంలో 39.8 కోట్ల మంది ఉద్యోగులు ఉంటే ఈ ఏడాది ఆగస్ట్ నాటికి అది 39.5 కోట్లకు చేరింది. తమ పరిధిలో ఖాళీగా ఉన్న 16 లక్షల ఉద్యోగాలను భర్తీ చేయడం లేదు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు పరం చేస్తూ రిజర్వేషన్ల ప్రకారం బడుగు, బలహీన వర్గాలకు దక్కాల్సిన ఉద్యోగాలను వారికి అందకుండా చేస్తోంది. ఆశ్రిత పెట్టుబడి దారీ విధానాల వల్ల దేశ సంపదలో చాలా భాగం ఇద్దరు, ముగ్గురు కార్పొరేట్ల ఖాతాలో పోగవుతోంది. మన దేశం ప్రపంచంలోనే అయిదో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించినా, ఉపాధి అవకాశాలు పెరగడం లేదు. నిరుద్యోగిత రేటు ఎందుకు పెరుగుతోందని ప్రశ్నించిన వారిని దేశ ద్రోహులుగా చిత్రీకరిస్తారు. కులం, మతం పేరుతో మంటలు పెట్టి ప్రజా ప్రయోజన అంశాలు చర్చకు రాకుండా చేస్తారు. యువతను విద్వేష పూరిత ప్రసంగాలతో రెచ్చగొడుతున్నారు. యువత ఈ కుయుక్తుల పట్ల అప్రమత్తంగా ఉండి వీటికి దూరంగా ఉండాలి.
(వ్యాసకర్త: వై. సతీష్ రెడ్డి , 9641466666 , ఛైర్మన్, టిఎస్ రెడ్కోరెడ్కో)