పిట్టపోరు పిల్లితీర్చినట్టు..
పిట్ట పోరు.. పిల్లి తీర్చిందన్నట్టు రాష్ట్ర బీజేపీలో బండి సంజయ్, కిషన్రెడ్డి వర్గపోరుతో మధ్యలో పోస్టులన్నీ డాక్టర్ లక్ష్మణ్ తన్నుకుపోతున్నారని పార్టీ నేతలు వాపోతున్నారు. అధిష్ఠానానికి తాము ఆనటం లేదా? అని ఇంద్రసేనారెడ్డి, మురళీధర్రావు, జితేందర్రెడ్డి తదితరులు తమ సన్నిహితుల వద్ద వాపోతుండగా, విజయశాంతి బాహాటంగానే గళం విప్పారు. ‘నా టాలెంట్ వాడుకోండయ్య అంటే, ఎవరికీ పట్టడం లేద’ని ఆమె వాపోతున్నారు. పార్టీలో నన్ను తొక్కేయాలని చూస్తున్న వారిని పాతరేసినా తప్పులేదంటున్నారు. ఉన్నపళంగా విజయశాంతి ఆగ్రహానికి వేరే కారణం ఉందని ఆ పార్టీ వర్గాలు అంటున్నాయి. సినీనటి జీవిత ఇటీవల బండి సంజయ్ పాదయాత్రలో ప్రత్యక్షం కావడం, మరో నటి జయసుధ పార్టీలో చేరికకు రంగం సిద్ధం కావడం వంటి చర్యలన్నీ తనకు పార్టీలో చెక్ పెట్టేందుకు జరుగుతున్నాయని విజయశాంతి అసహనంతో ఉన్నారని, ఆ విషయం బయటికి చెప్పలేక ఈ విధంగా అసంతృప్తి వ్యక్తం చేశారని అంటున్నారు.
ఒక్క మాట
కాంగ్రెస్, బీజేపీలలో ఇప్పుడు ‘ఒక్క మాట’ అనేది ట్రెండింగ్లో ఉంది. మునుగోడులో పార్టీ మీటింగ్ పెట్టి తనకు ఒక్క మాట చెప్పరా? అని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేయగా, ఖైరతాబాద్ టికెట్కు హామీ ఇచ్చి విజయారెడ్డిని పార్టీలో చేర్చుకునేటప్పుడు తనకు ఒక్క మాట చెప్పరా? అని ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ ఏకంగా పార్టీకే రాజీనామా చేసిన విషయం తెలిసిందే. టీపీసీసీ చేపట్టే కార్యక్రమాలపైన గానీ, గాంధీభవన్లో జరిగే ప్రెస్మీట్లపైన కానీ తనకు ఒక్క మాట చెప్పరా? అని మర్రి శశిధర్రెడ్డి అధిష్ఠానానికి ఫిర్యాదు చేయడానికి ఢిల్లీ వెళ్తున్నారు. తన సొంత జిల్లాలో సభ పెట్టి తనకు ఒక్క మాట చెప్పరా? అంటూ టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి చేసిన గగ్గోలు తెలిసిందే. బీజేపీలో జయసుధ చేరికపై తనకు ఒక్క మాట చెప్పరా? అని విజయశాంతి వాపోతుండగా, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని పార్టీలో చేర్చుకునే విషయంపై తమకు ఒక్క మాట చెప్పరా? అని మునుగోడు బీజేపీ నేతలు అలకపాన్పు ఎక్కారట!
వేటు కమిటి
పార్టీలో చేరికల కోసం బీజేపీలో ఈటల చైర్మన్గా కమిటీ ఏర్పాటు చేయగా, మునుగోడు ఎన్నిక నేపథ్యంలో కాంగ్రెస్ ఇందుకు భిన్నంగా
‘వేటు’ల కమిటీని ఏర్పాటు చేసింది. పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి జై కొడుతారనే అనుమానంతో ఏకంగా డీసీసీ అధ్యక్షుడితో సహా జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిని తప్పించి, ఆరుగురు మండల పార్టీ అధ్యక్షులను సస్పెండ్ చేసింది. దీంతో.. మీరు సస్పెండ్ చేయడం ఏమిటి? మేమే పార్టీపై వేటు వేస్తున్నామంటూ 10 మంది సర్పంచ్లు, ఏడుగురు ఎంపీటీసీలు గులాబి, కాషాయ కండువాలు కప్పుకోవడంతో… కాంగ్రెస్ వేటు కమిటీకి పని లేకుండా పోయింది.