‘1914-15 నాటి అమరులు రాజకీయం నుంచి మతాన్ని వేరుగా చూశారు. మతం వ్యక్తిగత విషయమనీ, అందులో జోక్యం చేసుకోకూడదన్నారు. అదేవిధంగా మతాన్ని రాజకీయాల్లో ప్రవేశపెట్టకూడదని, అది ప్రజల ఐక్యతను దెబ్బతీస్తుందనీ భావించారు. సిక్కులు, హిందువులు, ముస్లింలు కలిసికట్టుగా ఉద్యమించి, జీవితాలను త్యాగం చేసినందు వల్లే గదర్ ఉద్యమం ఐక్యంగా నిలబడగలింది’
-1928లో భగత్సింగ్ ‘కీర్తి’ పత్రికలో రాసిన ‘మత కలహాలు- వాటి నివారణ’ అనే వ్యాసం నుంచి…
గదర్ ఉద్యమంలోనే కాదు, దానికన్నా ముందు, దాని తర్వాత బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా వచ్చిన ఎన్నో ఉద్యమాల్లో వివిధ మతాల, వర్గాల, జాతీయతల ఐక్యతను మనం చూస్తాం. బ్రిటిష్ వ్యతిరేక స్వాతంత్య్ర ఉద్యమం భారత ఆధునిక సమాజానికి మొదటి రాజకీయ ప్రయోగం. 1857 నాటికి రాచరిక, భూస్వామ్య పాలన నుంచి బ్రిటిష్ వలస పాలన కిందికి రావడం ఒక మార్పు. వలసవాదం తన పాలన కోసం ప్రవేశపెట్టిన మార్పు ‘ఆధునికత’. అప్పటివరకూ భూస్వామ్య సంస్కృతి ప్రభావంలో ఉన్న భారతీయ సమాజం భావజాలంలో, భౌతిక అంశాల్లో ఆధునికతను క్రమంగా సంతరించుకున్నది. ఈ నేపథ్యంలోనే ఆవిర్భవించిన చదువుకున్న మధ్యతరగతి వర్గం మిగతా ప్రజానీకంతో కలిసి స్వాతంత్రోద్యమానికి తెరలేపింది. మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్న ప్రజలు-హక్కులు, ప్రజాస్వామ్యం, సెక్యులరిజం వంటి ఆలోచనలకు అప్పటి నుంచే పునాది పడింది.
అసలు స్వాతంత్య్రం అంటే ఏమిటి? ఆర్థిక, రాజకీయ శృంఖలాలను ఛేదించడమే స్వాతంత్య్రమా? లేక అంతకంటే పెద్ద లక్ష్యం ఏదైనా స్వాతంత్రోద్యమానికి ఉందా? అని ఆలోచిస్తే 75 ఏండ్ల వజ్రోత్సవాల సందర్భంగా ఎక్కడి నుంచి మొదలుపెట్టి ఎక్కడికి పయనిస్తున్నామనేది అర్థమవుతుంది. 1947 తర్వాత కూడా భారత చరిత్రలో కులం, మతం, జాతీయత అనే అంశాలు రాజకీయాలను తద్వారా సమాజాన్ని ఏదో ఒకరకంగా ప్రభావితం చేస్తూనే ఉన్నాయి. అభివృద్ధి కోసమే అయితే ఈ అంశాలు ప్రజలను ఐక్యపరిచి ఒక పాజిటివ్ ప్రభావం చూపగలుగుతాయి. అయితే దురదృష్టవశాత్తు రాజకీయం మరింత ఎక్కువగా మతాన్ని పులుముకోవడం మొదలై, వజ్రోత్సవాల ద్వారంలో నిలబడి ఉన్న భారతీయుల మధ్య ఐక్యతను ముక్కలు చేసి, దేశాన్ని అంతర్జాతీయంగా సిగ్గుపడేలా చేస్తున్నది. అమెరికా వెలువరించిన ‘యునైటెడ్ స్టేట్స్ కమిషన్ ఆన్ రిలీజియస్ ఫ్రీడమ్-2021’ రిపోర్టులో.. భారతదేశంలో మతస్వేచ్ఛ ప్రమాదంలో ఉన్నదని పేర్కొన్నారు.
మతస్వేచ్ఛ తీవ్ర ప్రమాదంలో పడిన దేశాల జాబితాలో అఫ్ఘానిస్థాన్, మయన్మార్, చైనా దేశాల సరసన భారత్ను నిలబెట్టారు. ఇది మోదీ పాలిస్తున్న భారత్ను అపకీర్తి పాలుజేయడానికేనని కొందరి వాదన.
అదే నిజమైతే ఉత్తరప్రదేశ్ హత్రస్లో దళిత యువతిపై అత్యాచారం జరిగిన సంఘటనను రిపోర్ట్ చేయడానికి వెళ్లిన కేరళ ముస్లిం జర్నలిస్టు సిద్ధిఖ్ కప్పన్ అక్టోబర్ 2020 నుంచి ఇప్పటికీ జైలులోనే మగ్గుతుండటం, అదే యూపీలోని హరిద్వార్లో గంగానది సాక్షిగా మరో మతం మీద విద్వేష విషం చిమ్మిన నర్సింగానందకు నెలలోపే బెయిల్ దొరకడం ఏ పరిస్థితికి అద్దం పడుతుందో చెప్పాలి.
ముస్లింలు ప్రతీ క్షణం దేశభక్తిని నిరూపించుకోవాలని ఒక ప్రత్యేక భావజాలానికి చెందిన రాజకీయం సవాలు చేస్తున్న నేటి తరుణంలో భారత స్వాతంత్రోద్యమంలో ముస్లింల పాత్రను ఈ 75 ఏండ్ల సందర్భంగా మళ్లీ చెప్పుకోవాల్సి రావటం ఎంత విషాదమో అంతే సంతోషకరం. హిందుస్థాన్ రిపబ్లికన్ అసోసియేషన్ యోధులు రామ్ ప్రసాద్ బిస్మిల్, అష్ఫక్ ఉల్లా ఖాన్ ఒకరి భుజం మీద ఒకరు చేయి వేసుకుని ‘సర్ఫరోషి కీ తమన్నా అబ్ హమారే దిల్ మే హై.. దేఖ్నా హై జోర్ కిత్నా బాజువే ఖాతిల్ మె హై’ (దేశ స్వాతంత్య్రం కోసం శిరస్సును అర్పించాలన్న కోరిక మా హృదయం నిండా నిండి ఉంది.. మా శిరస్సును ఖండించే తలారీ చేతుల్లోని బలమెంతో చూడాలని ఉంది) అని పాడుతూ అమరులవుతారు. భారత ఉపఖండంలో రాచరిక పాలన చివరిరోజుల్లో మొదలైన బ్రిటిష్ వ్యతిరేక ఘటనలు, ఉద్యమాలు, తిరుగుబాట్లలో హిందు, ముస్లిం రాజులు, సంస్థానాధీశులు, జమీందార్లు, అప్పుడప్పుడే ఉనికిలోకి వస్తున్న చదువుకున్న, అగ్రకుల, మధ్యతరగతి వర్గం సైతం పాల్గొన్నది.
అసలు 1800లోనే ఇస్లాం సంస్కరణవాదమైన వాహబీ ఉద్యమ ప్రభావంతో మూడో నిజాం సికందర్ ఝా తమ్ముడే బ్రిటిష్ వ్యతిరేకతను హైదరాబాద్ రాజ్యంలోకి తీసుకొని వచ్చాడు. ఔరంగాబాద్ కంటోన్మెంట్లో తిరుగుబాటు చేసి, నిజాంను 1857 సిపాయి తిరుగుబాటుకు సహాయం చేయమని కోరుతూ హైదరాబాద్కు వచ్చి, మొదటి సాలార్జంగ్ కుమ్మక్కుతో బ్రిటిష్ రెసిడెన్సీ జైలులో మగ్గిన చీదాఖాన్ రాజేసిన అగ్గి మనకు ఒక తురమ్ఖాన్ (తుర్రేబాజ్ ఖాన్)ను అందించింది. అందుకే కోఠి, సుల్తాన్బజార్ ప్రాంతాల్లో సాయంత్రం నుంచి తెల్లవారుజాము వరకు బ్రిటిష్ రెసిడెన్సీ మీద యుద్ధం చేసి చివరికి రెసిడెన్సీ ముందు వేలాడిన తుర్రేబాజ్ ఖాన్ శరీరం బ్రిటిష్ వ్యతిరేక చైతన్యంగా మారింది. అతడి సహచరుడు మౌల్వీ అల్లాఉద్దీన్ చివరి క్షణం వరకు కాలాపానీలోనే ‘వీరుడిగా’ ఉండి అక్కడే ‘వీర్ మౌల్వీ అల్లాఉద్దీన్’గా మరణించాడు.
భగత్సింగ్, ఆయన సహచరుల ‘హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లికన్ అసోసియేషన్’ విస్తృతంగా ప్రచారం చేసిన ‘ఇంక్విలాబ్ జిందాబాద్’ (విప్లవం వర్ధిల్లాలి) అనే నినాదాన్ని 1921లో రూపొందించినది కాంగ్రెస్ నేత మౌలానా హస్రత్ మొహానీ. ‘సారే జహాన్ సే అచ్ఛా, హిందూస్థాన్ హమారా’ రాసిన అల్లామా ఇక్బాల్ను దేశ విభజన తర్వాత పాకిస్థాన్ జాతీయ కవిగా ప్రకటించినా, ఆయన హిందూస్థాన్ అనే గులిస్థాన్ (పూల తోట)ను ప్రేమించినవాడే. ‘సైమన్ గో బ్యాక్’, ‘క్విట్ ఇండియా’ నినాదాలను రూపొందించింది ముంబై కార్మిక, కమ్యూనిస్టు నేత యూసుఫ్ మెహరాలి. సుభాష్ చంద్రబోస్ నోట పలికిన ‘జై హింద్’ నినాదాన్ని రూపొందించింది మన హైదరాబాదీ, ఇండియన్ నేషనల్ ఆర్మీ సభ్యుడు జైనుల్ అబిదీన్ హసన్ అని చెప్పుకొంటున్నపుడు తెలంగాణ నేల మీద మధ్యయుగాల నుంచి వీచిన ‘గంగా జమునీ తహ్జీబ్’ మరింత గుబాళిస్తుంది. ‘హింద్’ అనే పదాన్ని ఒక మతానికి సూచకంగా కాకుండా భారత ఉపఖండాన్ని సూచించే చరిత్రాకార్థంలో చూడాలి. అందుకే 1850ల్లో కార్ల్ మారక్స్ రచనల్లో సైతం హిందుస్థాన్ అనే ఉంటుంది. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్లో ముఖ్యులైన జస్టిస్ తయాబ్జీ, మౌలానా అబుల్ కలాం ఆజాద్, ముహమ్మద్ అలీ జౌహర్, షౌకత్ అలీ, డాక్టర్ ముఖ్తార్ అన్సారీ, హకీం అజ్మల్ఖాన్, మౌలానా మహమూద్ హసన్- ఇలా ఇంకెన్నో పేర్లు చరిత్రలో రికార్డు చేయబడ్డాయి.
ఈ 75 ఏండ్ల భారత చరిత్ర ఎదుర్కొంటున్న సంక్షుభిత సందర్భాలకు రాజకీయం మతగ్రస్థం కావడమే కారణం. వలసవాద, సామ్రాజ్యవాద సంకెళ్లను ఛేదించుకున్న భారతదేశం, విచ్ఛిన్నకర మతవాద రాజకీయాల నుంచి బయటపడి ‘ప్రత్యామ్నాయాన్ని’ఎంచుకునే దిశగా పయనించడమే వజ్రోత్సవం ఇచ్చిన సందేశంగా భావిద్దామా?
కొసమెరుపు: ‘ఉచితాల’ పేరిట ఎన్నికల్లో వాగ్దానాలు చేయొద్దనేది మోదీ కొత్త అస్త్రం. వెంటనే బీజేపీ నాయకుడు అశ్విని ఉపాధ్యాయ.. ఉచితాలు ఇస్తామని రాజకీయపార్టీలు హామీ ఇవ్వకుండా ఆదేశించాలని కోరుతూ సుప్రీంకోర్టు తలుపు తట్టాడు. దీనికీ, మతానికి సంబంధం ఉంది. అది ఎలాగంటే.. ఉచితాల పేరిట ప్రతిపక్షాలు సంక్షేమ పథకాలను సైతం తమ ఎన్నికల మ్యానిఫెస్టోలో పెట్టుకోలేని స్థితికి తేవాలనేది వాళ్ల వ్యూహం. మరి బీజేపీకి సంక్షేమ పథకాలు చెప్పాల్సిన అవసరం లేదా అంటే మతం పేరిట లబ్ధి పొందే ఆయుధం తమ వద్దే ఉందన్న ధీమా వారిది. అందుకే ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో తమకు ఓటు వేయకపోతే కేరళ, పశ్చిమబెంగాల్లాగా యూపీ అవుతుందని ఓటర్లను ‘బెదిరించాడు’ యోగి ఆదిత్యనాథ్. అభివృద్ధి సూచికలో కేరళ దరిదాపుల్లో యూపీ లేకపోయినా, మతం పులుముకున్న రాజకీయానికి ఉన్న వేల ఉదాహరణల్లో ఇదొకటి.
‘సర్ఫరోషి కీ తమన్నా అబ్ హమారే దిల్ మే హై.. దేఖ్నా హై జోర్ కిత్నా బాజువే ఖాతిల్ మె హై’ (దేశ స్వాతంత్య్రం కోసం శిరస్సును అర్పించాలన్న కోరిక మా హృదయం నిండా నిండి ఉంది.. మా శిరస్సును ఖండించే తలారీ చేతుల్లోని బలమెంతో చూడాలని ఉంది)
-డా. ఎం.ఎ. శ్రీనివాసన్ , 81069 35000