రాష్ట్రంలో మినీ పుర పోరు ఫలితాలు ప్రభుత్వ పాలనా విధానాల పట్ల ప్రజామోదాన్ని ప్రతిబింబించాయి. పట్టణాలు, నగరాల్లో గులాబీ గుబాళించింది. రెండు కార్పొరేషన్లు, ఐదు మున్సిపాలిటీల్లో టీఆర్ఎస్ విజయబావుటా ఎగురవేసింది. అధికారానికి కావల్సిన సాధారణ మెజారిటీ కాకుండా, అన్నింటా మూడింట రెండొంతుల మెజారిటీ సాధించి ఎదురులేదని చాటింది. రాష్ట్ర ప్రభుత్వ పాలనా తీరుపై అవాకులు చెవాకులు పేలిన ప్రతిపక్షాలు బొక్కబోర్లా పడ్డాయి. చావుదప్పి కండ్లు లొట్టపోయిన చందంగా నామమాత్రపు ఉనికిని చాటుకున్నాయి. ప్రత్యామ్నాయం మేమేనని బీరాలు పలికిన ఒకటి, రెండు స్థానాలతో చతికిలపడ్డారు. నకిరేకల్లో ఖాతా కూడా తెరువలేదు. ఖమ్మంలో తప్ప కాంగ్రెస్ పరిస్థితి కూడా అంతే. పోరు ఏదైనా ఫలితం ఒకటేనని మరోమారు పుర ఎన్నికలు టీఆర్ఎస్ పట్ల ప్రజాదరణను ధ్రువపరిచాయి.
తాజా ప్రజాతీర్పు అనేక విధాలుగా విలక్షణమైనది. ఉద్యోగవర్గం, చదువుకున్న యువత ఎక్కువగా ఉండే నగరాల్లో అధికారపక్షం అసలు పస బయటపడుతుందన్న విపక్షాల వాదనలు వీగిపోయాయి. అక్షరాస్యుల్లో సహజంగా ఉండే ప్రశ్నించే తత్తం, విచక్షణ తమకు అనుకూలిస్తుందని ప్రతిపక్షాలు భ్రమపడ్డాయి. అయితే, అభివృద్ధి సంక్షేమాల పట్ల సానుకూలతకు సంకేతంగా పట్ణణ ప్రజానీకం టీఆర్ఎస్కు పట్టం గట్టడం గమనార్హం. గత ఆరున్నరేండ్ల కాలంలో ప్రణాళికాబద్ధంగా ప్రభుత్వం అమలుచేస్తున్న పథకాలతో ప్రజల జీవన ప్రమాణాలు గణనీయంగా పెరిగాయి. గ్రామీణ సన్నకారు రైతు, కులవృత్తిదారు మొదలు ఉద్యోగి దాకా అందరూ ప్రభుత్వ పాలనా విధానాలతో పొందుతున్న మెరుగైన జీవన భద్రతకు ఇది సాక్ష్యం.
జీహెచ్ఎంసీ, ఎమ్మెల్సీ ఎన్నికలు మొదలు నాగార్జునసాగర్ ఎన్నిక దాకా టీఆర్ఎస్ అఖండ విజయాలను సాధించింది. ఇది గాలివాటం కాదు. ప్రభుత్వ పనితీరుకు ప్రజలు ఇస్తున్న మద్దతుకు నిదర్శనం. ఇదిచూసైనా ప్రతిపక్షాలు, విమర్శించటమే పనిగా పెట్టుకున్న మేధావులనబడేవారూ కండ్లు తెరువాలి. నిర్మాణాత్మకంగా వ్యవహరించాలి. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాలది విశిష్టమైన పాత్ర. అధికారపక్షాన్ని ఎల్లవేళలా ప్రజానుకూలంగా నడిపించటంలో నిర్మాణాత్మక సద్విమర్శలే కీలకం. అలాంటి బాధ్యతాయుత ప్రతిపక్షాలతోనే ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతుంది. అయినదానికీ, కానిదానికీ రచ్చ చేయటమే రాజకీయంగా వ్యవహరించేవారితో ప్రజలకూ, ప్రజాస్వామ్యానికీ ఒనగూడేదేమీ లేదు. పాలను, నీళ్లను వేరుచేసే రాజహంసలా ఇచ్చిన ఓటరు తీర్పే గౌరవనీయం, అందరికీ శిరోధార్యం.