వస్తు శిల్పాలలో ఆధునికతను, భిన్నత్వాన్ని ప్రవేశపెడితే కవిత్వంలో కొత్తదనాన్ని సాధించవచ్చు. అభివ్యక్తిలో మార్పులు కొత్తదనానికి దారి తీయవా? అంటే.. అవునూ అన్నదే సమాధానం.అయితే అభివ్యక్తి అన్నది ప్రధానంగా శిల్పంతో ముడిపడి ఉన్న అంశం కాబట్టి, ముందు చెప్పిన వాక్యం స్థూలమైన విభజన. కవిత్వంలో ‘మొనాటనీ’ని వదులుకోవాలంటే అరిగిపోయిన కవితా వస్తువులను కాకుండా కొత్తవాటిని ఎన్నుకోవాలి. అదే విధంగా కొత్త కవితా ఊహలను ఆవాహన చేసుకోవడం ద్వారా నూతనత్వాన్ని సాధించవచ్చు.
కార్తీక్ అనే మలయాళ కవి 19వ ఏట రాసిన ‘ఒక మూర్ఖుడు-మరో మూర్ఖుడు’ అనే కవిత కొత్త కవిత్వ ఊహకు ఉదాహరణ. అతని ఆ కవితను ‘ఇండియన్ లిటరేచర్’ పత్రికలో చదివి తెలుగులోకి అనువదించాను. దాన్ని పూర్తిగా ఇస్తున్నాను.
ఒక మూర్ఖుడు, మరో మూర్ఖుడు
ఒక గోడ, ఒక మూర్ఖుడు…
అతడు కాళ్లు చేతులున్న
మనుషుల బొమ్మలు గీశాడు ఆ గోడ మీద
ఏ గోడను చూసినా ఆ మూర్ఖుడు
అదే బొమ్మను గీస్తాడు!
అదృష్టమో దురదృష్టమో తెలియదు కాని
అతడు బొమ్మలు గీసిన గోడలు రెండు
వేర్వేరు బస్ స్టాండ్లలో ఉన్నాయి
ఒక బస్ స్టాండ్లో బస్సు ఎక్కి
మరో బస్ స్టాండ్లో దిగినవాళ్లు
ఆశ్చర్యానికి గురయ్యారు
కొందరు ఒక బస్ స్టేషన్ను
మరొక స్టేషన్గా భ్రమపడ్డారు కూడా..
మరో మూర్ఖుడైన ఒక ప్రయాణికుడు
ఇలా అనుకున్నాడు:
ఒక గోడ మీది బొమ్మలోని మనుషులు
నా బస్సులోకి ఎక్కి విహారయాత్ర చేస్తూ
ఈ బస్ స్టాండును చేరుకున్నారు!
ఎంత నూతనత్వం ఉంది ఈ ఊహలలో! ఎప్పు డూ ఒకేరకంగా రాయడం మానుకోవాలంటే, ఇటువంటి కొత్త కవిత్వ ఊహలను ఆశ్రయించాలి. ఈ ఊహలో మేధాపరమైన ఉత్కృష్టత, వ్యంగ్యం మాత్ర మే ఉన్నాయనుకుంటే అది పొరపాటే. ఇందులో సామాజిక స్పృహ కూడా ఉంది. అయితే, కార్తీక్ ఈ అంశాలను మనసులో పెట్టుకునే ఇలా రాశాడా అన్నది మనకు తెలియదు. కొన్నిసార్లు కవిలోని ప్రధాన ఉద్దేశం ఒకటైతే, పాఠకులకు కొన్ని భిన్నమైన అర్థాలు అదనంగా తోచవచ్చు. మనుషులు గోడ మీది బొమ్మలలాగా ఎక్కడివాళ్లక్కడ ఉంటారు తప్ప ఒకరినొకరు తరచుగా కలవరు. ఒకవేళ కలుస్తారనుకుంటే అది మూర్ఖత్వమే. అలా ఎవరికి వారుగా బతుకుతున్నప్పటికీ కలుసుకుంటున్నామనే భ్రమలో ఉంటారనే ఊహలో వ్యంగ్యం ఇమిడి ఉంది. బస్సులోని మరో మూర్ఖుని ఊహ కూడా వ్యంగ్యాత్మకమైనది. వెరసి ఇటువంటి కవిత్వ ఊహ చాలా వినూత్నమైనది, విలక్షణమైనది. పెరుందేవి ప్రసిద్ధ తమిళ కవి. ఈమె కవితలు సాధారణమైనవిగా కనిపిస్తాయి. కానీ, వాటిలో లోతు ఉంటుంది. ‘ఇండియన్ లిటరేచర్’ పత్రికలో వచ్చిన ఈమె కవితనొకదాన్ని తెలుగులో చదవండి..
నడిచేవాళ్లు
ఇల్లు అని పిలువబడే రేకుల షెడ్డులో
ఒక చిన్న అమ్మాయి ఉరేసుకుంది,
ఖాళీ ప్లాస్టిక్ సీసాలు చూస్తుండగా.
తన తండ్రితో నలుగురు తోబుట్టువులతో
ఆ శవం జల్గాఁవ్ నుండి మధ్యప్రదేశ్ వరకు
ఎలా నడవబోతోంది?
దాన్నలా వదిలేద్దాం
నా చేతుల మీద రక్తపు మరకలు లేవు
అవి చేతి తొడుగుల్లో సురక్షితంగా ఉన్నయి
చూసేందుకు కళ్ల కోసం ఇది మరొక దృశ్యం
దేశం చనిపోయింది
చనిపోయినవాళ్లు చనిపోయిన దేశం కోసం ఏడవలేరు
అదీ గాక, వాళ్లు తమ ఊరును
చేరుకోవడం గురించి ఆలోచించాలి..!
ఇది కరోనా కాలంలోని వలసలను వస్తువుగా చేసుకొని రాసిన కవిత. ఇందులోని 3,8,9 పంక్తులు దీన్ని ఇతర కవితల నుంచి వేరుచేస్తాయి. ‘ఖాళీ ప్లాస్టిక్ సీసాలు చూస్తుండగా’ అనే ఊహ సాధారణ కవులకు వచ్చేది కాదు. ఈ పంక్తిలోని భావాన్ని రకరకాలుగా వివరించవచ్చు. అది దారిద్య్రానికి సంకేతం కావచ్చు, లేదా ప్రాణం ఖాళీ అయిన స్థితిని సూచించవచ్చు. అదేవిధంగా, ‘నా చేతుల మీద రక్తపు మరకలు లేవు! అవి చేతి తొడుగుల్లో సురక్షితంగా ఉన్నయి’ అనడంలో వలసదారుల మరణానికి పాలకులు పరోక్షంగా కారణమైనా వారిని కచ్చితమైన దోషులుగా నిర్ణయించలేని పరిస్థితి వల్ల వారు సురక్షితంగా ఉన్నారని అన్యాపదేశంగా చెప్పడముంది. ‘ఆ శవం జల్గావ్ నుంచి మధ్యప్రదేశ్ వరకు/ ఎలా నడవబోతోంది..’ అనడంలో కూడా వ్యంగ్యం లేదా? నా ఈ వివరణలే కాక మరికొన్ని భిన్నమైనవి ఉండే అవకాశం లేకపోలేదు.
ఈ రెండు కవితల ఆంగ్ల పాఠాంతరాలను (ఇంగ్లిష్ వర్షన్స్ను) పరిశీలిస్తే, వాటిలోని భాష చాలా సూటిగా, సరళంగా ఉంది. మలయాళంలో కూడా అదేవిధంగా ఉన్నందుకే ఇంగ్లిష్లో అటువంటి భాష వచ్చి ఉం టుంది. అంటే వస్తువుకు, కవిత్వ ఊహకూ ప్రాధా న్యం తప్ప భాషకు కాదన్నమాట. ఇది కవిత్వంలో కొత్తదనం గురించిన సమగ్ర వ్యాసం కాదు. ఒకటి రెండు పార్శ్వాల నుంచి చూసి చేసిన పరిశీలన. ఇలా కొత్తవైన జీవితానుభవాలు, అభివ్యక్తీకరణలతోనే కవిత్వం పరిపుష్టమవుతుంది. పది మందిని ఆకట్టుకుంటుంది. కలకాలం నిలిచిపోతుంది.