హైదరాబాద్లో దోమలగూడ మీదుగా వెళ్తుండగా అగ్గువ.. అగ్గువ అని వినిపించింది. ఈ మధ్య వచ్చిన గాలి దుమారానికి రాలిన మామిడి పండ్లు అమ్ముతున్నారేమో అని ఆనుకున్న. అగ్గువ అగ్గువ అని వినిపించిన దిక్కు చూస్తే అకడేదో మీటింగ్ జరుగుతున్నది. వేదికపై ఒక నాయకుడు మైక్లో ‘అగ్గువ.. అగ్గువ.. అవకాశం పోతే, మళ్లీరాదు’ అని పెద్దగా అరుస్తున్నాడు. అదేమిటో తెలుసుకుందామని దగ్గరికెళ్లి చూస్తే.. టీడీపీ మినీ మహానాడు బ్యానర్ కనిపించింది. ఆ పార్టీ పొలిట్బ్యూరో సభ్యుడు, జాతీయ అధికార ప్రతినిధి ఒకరు ఉద్వేగంగా ప్రసంగిస్తూ, ‘తెలంగాణలో ఎవరు గెలువాలన్నా టీడీపీతో పొత్తు పెట్టుకోవాల్సిందే. పార్టీకి ఏడు లక్షల మంది సభ్యత్వం ఉంది. కొన్ని విషయాలు బయటికి చెప్పకూడదు కానీ.. మనతో పొత్తు పెట్టుకుంటే ప్యాకేజీలో భాగంగా కాంగ్రెస్తో పొత్తు కూడా ఉచితం. దానికీ మనోడే (రేవంత్) అధ్యక్షుడిగా ఉన్నాడు’ అంటూ సాగిపోతున్నది ఆయన ప్రసంగం. ‘ఆలస్యం చేస్తే ఆశాభంగం.. ఎన్నికలు ఇప్పట్లో లేవు కాబట్టి ఇదే మంచి అవకాశం. అగ్గువకే పార్టీ దొరుకుతుంది. కొనుక్కోండి’ అంటూ కొందరు అక్కడ కరపత్రాలు కూడా పంచుతున్నారు. ఇంతకు నా అనుమానం ఏమిటంటే మూడున్నర కోట్ల తెలంగాణ జనాభాలో ఏడు లక్షలు ఎంత? ఈ ఆఫర్ కొంచెం అతిగా అనిపించడం లేదూ?
– వెల్జాల