1920వ దశకంలో తెలంగాణలో సైన్స్ ఫిక్షన్ కథలు వచ్చాయి. ఒద్దిరాజు రాఘవ రంగారావు ‘అదృశ్య వ్యక్తి’ అనే కథ, సిరుగూరి జయరావు ‘పరమాణువులో మేజువాణి’ అనే సైన్స్ ఫిక్షన్ కథ రాశారు. తెలంగాణలో ప్రజల పోరాటం ప్రారంభమైన తర్వాత ఈ ధోరణి మారింది. కాంచనపల్లి, వట్టికోట ఆళ్వారుస్వామి, ఆవుల పిచ్చయ్య, అయోధ్య రామకవి వంటి వారు నాటి పోరాటాలను, తాము ప్రత్యక్షంగా చూసినవాటిని కథల్లో చిత్రించారు. ఆవుల పిచ్చయ్య కథలు ఎక్కువగా ‘మీజాను’ పత్రికలో అచ్చయ్యాయి.
ప్రజల పోరాటానికి దారితీసిన వాటిల్లో వెట్టిచాకిరి ప్రధానమైనది. ఎటువంటి జీతభత్యాలు లేకుండా భూస్వాములకు, ప్రభుత్వ ఉద్యోగులకు పని చేయటాన్ని వెట్టిచాకిరి అంటారు. ఈ దోపిడీకి గురయ్యేవాళ్లు తమ వ్యవసాయ పనులుగానీ, కులవృత్తి పనిగానీ చేసుకోవటానికి సమయం లేక ఆకలిచావులకు గురయ్యేవారు. వెట్టి చాకిరిని చిత్రిస్తూ ఎన్నో కథలు వచ్చాయి. ఆవుల పిచ్చయ్య ‘దౌరా’ ‘వెట్టి చాకలి దినచర్య’, కాంచనపల్లి ‘మన ఊళ్లో కూడానా’, వట్టికోట ‘పరిగె’, సురవరం ‘సంఘాల పంతులు’, ఎస్.బి. సీతారామరావు ‘గరీబోన్ని’, భాగ్యరెడ్డి వర్మ ‘వెట్టిమాదిగ’.. వంటివన్నీ ఆ కోవకు చెందినవే.
భాగ్యరెడ్డి వర్మ ఆ రోజుల్లో హరిజనోద్యమం నడిపాడు. 1932లో ఆయన రాసిన ‘వెట్టిమాదిగ’ కథ మొట్టమొదటి దళిత కథ. 1939లో సీతారామారావు రాసిన ‘గరీబోన్ని’ కథ తెలంగాణ మాండలికంలో రాసిన మొదటి కథ. కాంచనపల్లి ‘చెరువొడ్డున’ కథలో ఆ ఊరి దొర, పక్క ఊరి జాగీర్దారు ఏకమై చెరువు నీరును తమ పొలాలకు పారించుకోగా, రెండూర్ల హిందూ ముస్లిం ప్రజలు ఏకమై చేసిన పోరాటం చిత్రింపబడింది. నాటి పోరాటాన్ని, హిందూ ముస్లింల ఐక్యతను చిత్రించే మంచి కథ ఇది.
1946-47 నాటి తెలంగాణ సాయుధ పోరాట కాలంలో, ‘లెవీ’ ధాన్యాన్ని బలవంతంగా వసూలు చేయటం అనే ఇతివృత్తాన్ని తీసుకొని మందరామిరెడ్డి ‘సర్కారు కిస్తు’ అనే కథను, భాస్కరభట్ల కృష్ణారావు ‘ఇజ్జత్ శిక్ష’ కథను రాశారు. నాటి పోరాట కాలంలో ప్రజల బాధలను, పోరాటాన్ని చిత్రించని కథా రచయితే ఆనాడు లేడంటే అతిశయోక్తి కాదు. రజాకార్ల ఆగడాలను చిత్రిస్తూ అడ్లూరి అయోధ్య రామకవి 1948లో ‘తెలంగాణ మంటల్లో’ అనే కథా సంపుటిని ప్రచురించాడు. ప్రజలు ప్రజారక్షకదళాలుగా ఏర్పడి రజాకార్లతో సాయుధ పోరాటం చేసే ఘట్టాన్ని తీసుకొని, ‘అమరజీవి’ అనే కథను కె.ఎల్.ఎన్ రాశాడు. ఆయన మరో కథ ‘శాంతి ప్రకటనలు’ కూడా కమ్యూనిస్టుల పోరాటాన్ని వెల్లడిస్తుంది. ‘ప్రతిమ’ అనే కలం పేరుతో రాసిన ‘నిట్టూర్పు’ కథ ఒక అపూర్వమైన కథ. భాస్కరభట్ల కృష్ణారావు మూడు కథా సంపుటాలను ప్రచురించాడు. జి.రాములు, నందగిరి వెంకటరావు చక్కని చారిత్రక వృత్తాంతాలతో కథలు రాశారు. అసలు తెలంగాణలో ఉన్నంత కథా వస్తు వైవిధ్యం మరే ప్రాంతంలో లేదనే చెప్పాలె.
1930వ దశకంలో కొందరు యువ రచయితలు ‘సాధన సమితి’ పేరుతో ‘రోమాంటిసిజం’, అంటే భావకవిత్వ ధోరణులతో కథలు, కవిత్వం రాశారు. నందగిరి వెంకటరావ్, నందగిరి ఇందిరాదేవి, బూర్గుల రంగనాథరావు, నెల్లూరి కేశవస్వామి, ధరణికోట శ్రీనివాసులు మొదలైన వారు వీరిలో ఉన్నారు. బూర్గుల రంగనాథరావు ఆరు కథలతో ‘వాహ్యాళి’ పేరుతో సంపుటిని, ధరణికోట శ్రీనివాసులు ‘మా ఇంట్లో’ పేరుతో కథల సంపుటిని ప్రచురించారు. ధరణికోట శ్రీనివాసులు, మునిమాణిక్యంలాగా భార్య ప్రధాన పాత్రగా గల హాస్యకథలను రూపొందించి వాటిలో దాంపత్య జీవితాన్ని చిత్రీకరించాడు.
–ముదిగంటి సుజాతారెడ్డి, 99634 31606