బ్రిటిష్ కాలం నాటి రాజద్రోహం చట్టం రాజ్యాంగబద్ధం కాదంటూ సుప్రీంకోర్టులో సవాల్ చేసిన పిటిషన్దారులలో మాజీ సైన్యాధికారి సుధీర్ వొంబట్కెరె ఒకరు. దేశ సరిహద్దుల పరిరక్షణలో దశాబ్దాలపాటు సేవలందించిన ఈ రిటైర్డ్ మేజర్ జనరల్.. పదవీ విరమణ తర్వాత, 80 ఏండ్ల వయసులో దేశంలోపల ప్రజల హక్కులను కాపాడే బాధ్యతను భుజానికి ఎత్తుకున్నారు. మోదీ హయాంలో హక్కుల అణచివేత పెరిగిపోయిందని, దీనిని ఎదుర్కోవటానికి రాజ్యాంగాన్ని కాపాడుకోవటమే మార్గమని చెబుతున్నారు.
‘ఉద్యోగ బాధ్యతలు చేపట్టే ప్రతి సైనికుడు భారత రాజ్యాంగాన్ని సంరక్షిస్తానని ప్రమాణం చేస్తాడు. తన ప్రాణాన్ని పణంగా పెట్టి అయినా రాజ్యాంగాన్ని కాపాడుతాడు. సైనికులు దేశ సరిహద్దులో సంరక్షకులుగా కాపలా కాస్తేనే రాజ్యాంగం కల్పించిన హక్కుల నీడలో దేశంలో ప్రజలు సుఖంగా, భద్రంగా నిద్రపోతున్నారు. కానీ, రాజద్రోహ చట్టం ప్రజల హక్కులకు భంగకరంగా ఉన్నది. ఈ కారణం వల్లనే నేను ఈ చట్టాన్ని సవాలు చేశాను. సుప్రీంకోర్టు స్టే ఇవ్వటంతో రాజద్రోహం చట్టం కింద విచారణ ఎదుర్కొంటున్న వందలాది మందికి ఉపశమ నం లభించింది. వీరు ఎదుర్కొంటున్న కేసుల్లో విచారణలను నిలిపివేసే అవకాశం ఉంది. బెయిల్ కోసం వీరు కోర్టులను ఆశ్రయించవచ్చు.
రాజద్రోహం చట్టం విషయంలో కేంద్రం యూ టర్న్ తీసుకోవటం వల్లనే అత్యున్నత న్యాయస్థానం ఈ తీర్పు వెలువరించాల్సి వచ్చింది. అయితే ఇది తుది తీర్పు కాదు, మధ్యంతర తీర్పు మాత్రమేనన్న సంగతిని గుర్తు పెట్టుకోవాలి. చట్టం రాజ్యాంగ బద్ధత గురించిన విచారణ కొనసాగుతుంది. ఈ చట్టం ద్వారా ప్రజలకు అన్యాయం జరుగుతున్నది. చట్టం అమలులో అనేక తప్పులు జరిగినట్లు నేను గుర్తించాను. నేనేం నమ్ముతానంటే.. చట్టం అమలులో ఒక దగ్గర తప్పు జరగటానికి అవకాశం ఉంటే.., అది అంతటా జరిగే అవకాశం ఉన్నది. ఎప్పుడైనా, ఎక్కడైనా అన్యాయాన్ని వ్యతిరేకించాల్సిందే. ప్రతిఘటించాల్సిందే. ఈ చట్టం అమలులో పార్టీలు, వాటి రంగులకు అతీతంగా ఒకేవిధంగా వ్యవహరించాయి. అన్ని ప్రభుత్వాలు ఒకే తీరున అన్యాయానికి పాల్పడ్డాయి. అందుకే నేను ఈ చట్టాన్ని వ్యతిరేకించటానికి సిద్ధపడ్డా. రాజ్యాంగంలోని 19-1(ఏ), 14, 21 అధికరణలకు రాజద్రోహం చట్టం వ్యతిరేకమైనదే కాకుండా హానికరమైనది. దానితో సమానత్వం, భావ ప్రకటన స్వేచ్ఛ, జీవించే హక్కు, వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలుగుతుంది. రాజద్రోహ చట్టం దేశంలో ఎన్నో ఏండ్లుగా అమలవుతున్నది. ఎంతో మంది మీద ఈ చట్టం కింద కేసులు మోపారు. కానీ గత కొన్నేండ్లుగా ఈ చట్టం ప్రయోగం మరింత పెరిగిపోయింది. అనేక మందిపై ఈ చట్టం కింద కేసులు పెట్టారు. ఇప్పటికి 800 రాజద్రోహం కేసులు నమోదై.. నా అన్నదమ్ములు, అక్కచెల్లెండ్లు అయిన భారతీయులు 13 వేల మంది జైళ్లల్లో మగ్గుతున్నారు. గత ఎనిమిదేండ్ల కాలంలోనే 400 రాజద్రోహం కేసులు నమోదయ్యాయి. ఈ చట్టాన్ని ఒక రాజకీయ ఆయుధంగా వాడుకుంటున్నారు.
ప్రజలకు నిజమైన భావప్రకటనా స్వేచ్ఛ లేకుండా పోయింది. రాజద్రోహ చట్టం ప్రజల మాట్లాడే హక్కును హరిస్తున్నది. ఈ ధోరణి ఈ మధ్య ఇంకా ఎక్కువైంది. అలాంటప్పుడు ఇది దేశం ఎదుర్కొంటున్న తీవ్రమైన సమస్య కాదా? వ్యక్తిస్వేచ్ఛను నిరాకరించినట్లు కాదా?
ఈ పరిస్థితుల్లో దేశ ప్రజల సకల హక్కులకు హామీ ఇస్తున్న రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాలి. అప్పుడే మన హక్కులన్నింటికీ భద్రత ఉంటుంది. మన రాజ్యాంగాన్ని సంరక్షించుకొనే క్రమంలో.. నేను నా ఇంటి బయట భారతీయుడిని. ఇంటిలోపల… నేనొక హిందూను, ముస్లింను, మరింకేదైనా’..
-సుధీర్ వొంబట్కెరె (రిటైర్డ్ మేజర్ జనరల్)
మైసూరుకు చెందిన సుధీర్ వొంబట్కెరె ఐఐటీ మద్రాస్ నుంచి స్ట్రక్చరల్ డైనమిక్స్లో పీహెచ్డీ చేశారు. భారత సైన్యంలో చేరి 35 ఏండ్లపాటు సేవలందించారు. 1965లో పాకిస్థాన్తో జరిగిన యుద్ధంలో ఆ దేశంలోని సియాల్కోట్లోకి వొంబట్కెరె కెప్టెన్గా ఉన్న సైనికదళం చొచ్చుకెళ్లింది. పాక్ వైమానిక దాడి నుంచి ఆయన తృటిలో తప్పించుకున్నారు. ‘ఫిఫ్టీ ఇయర్స్ ఎగో.. ఎయిర్ ఎటాక్’ పేరుతో దీనిపై వొంబట్కెరె ఒక పుస్తకం కూడా రాశారు. సైన్యం నుంచి రిటైర్ అయిన తర్వాత.. పర్యావరణ, ప్రజాసంబంధిత అంశాలపై, వినియోగదారుల హక్కులపై ఆయన కార్యకర్తగా పని చేస్తున్నారు. మైసూరు వద్ద థర్మల్ విద్యుత్కేంద్ర ఏర్పాటును వ్యతిరేకిస్తూ ఉద్యమించారు. నగరంలోని వారసత్వ కట్టడాల పరిరక్షణకు ప్రజలను కూడగట్టారు. హరిద్వార్లో సాధువుల విద్వేషపూరిత ప్రసంగాలపై దర్యాప్తు జరిపించాలని సుప్రీంకోర్టులో కేసు వేశారు.